సినీలోకంలో “విడాకులు” కొత్తేమి కాదు!

Sharing is Caring...

సినీ పరిశ్రమలో నటీనటులు పెళ్లి చేసుకోవడం … కొద్దికాలం పోయాక విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. సమంత .. నాగచైతన్యల కంటే ముందు ఎన్నో జంటలు కలిసాయి.. విడిపోయాయి. సినీ ప్రముఖులకు విడాకులు కొత్త పదం కాదు. ఈ విడాకుల భావనపై  ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.  తారల అభిమానులకు కూడా తారలు విడాకులు తీసుకోవడం షాకింగ్ వార్త కాదు. టాలీవుడ్‌లో విజయవంతమైన పెళ్లిళ్లు చాలా తక్కువే అని చెప్పుకోవాలి .ఈ వినోద పరిశ్రమలో తారలు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా  2004 లో నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2006 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి తర్వాత అమెరికాకు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. కీర్తికి విడాకులు ఇచ్చిన సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. స్వయంగా నాగార్జున కూడా అమలను పెళ్లి చేసుకోక ముందు లక్ష్మిదగ్గుబాటి ని పెళ్లి చేసుకున్నారు. లక్ష్మి దగ్గుబాటి ఎవరో కాదు  ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమార్తె  .. హీరో వెంకటేష్ చెల్లెలు. 1984 లో వీరి వివాహం అయింది. 

86 లో చైతూ పుట్టాడు. తర్వాత నాగార్జున లక్ష్మిల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇద్దరూ దూరమైనారు. 92 లో నాగార్జున నటి అమలను చేసుకున్నారు. లక్ష్మి దగ్గుబాటి శరత్ విజయ రాఘవ ను పెళ్లిచేసుకున్నారు. చైతూ కూడా ఎక్కువ కాలం వీరి వద్దే పెరిగాడు. ఇక సమంత మాజీ బాయ్ ఫ్రెండ్ నటుడు సిద్దార్ధ సూర్యానారాయన్ కూడా 2003 లోనే మేఘన అనే అమ్మాయిని పెళ్ళిచేసుకుని తర్వాత విడాకులు తీసుకున్నారు. సమంత డైవర్స్ తీసుకున్నాక ఇతగాడు చేసిన ట్వీట్స్ కలకలం రేపాయి. 

తెలుగు వారికి బాగా పరిచయమున్న నటీ నటుల్లో విడాకులు తీసుకున్న వారు చాలామందే ఉన్నారు. మంచు మనోజ్ కూడా ఆ మధ్య డైవర్స్ తీసుకున్నారు. నటుడు ప్రకాష్ రాజ్  కూడా 2009 లో విడాకులు తీసుకున్నారు. ఆయన భార్య దివంగత నటుడు  శ్రీహరి భార్య డిస్కో శాంతి చెల్లెలు లలిత కుమారి. ప్రకాష్ రాజ్ లలిత కుమారికి పిల్లలు కూడా ఉన్నారు. విడాకులు తీసుకున్నాక ప్రకాష్ రాజ్ పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ను పెళ్లి చేసుకున్నారు.

అంతకు ముందు నటుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ మొదట వాణి గణపతిని వివాహం చేసుకున్నారు..తర్వాత  సారికను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నటి గౌతమితో సహజీవనం చేశారు. గౌతమి అంతకు ముందు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. రెండేళ్ల క్రితమే కమల్.. గౌతమీలు దూరమయ్యారు.

ప్రముఖ నటి లక్ష్మి మొదట భాస్కరన్‌ని, ఆ తర్వాత మోహన్ శర్మను, ఆపై శివచంద్రను వివాహం చేసుకున్నారు. లక్ష్మి మొదటి భర్త కూతురు నటి ఐశ్వర్య తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్ళాడి రెండేళ్లకే విడాకులు తీసుకుంది. మరో ప్రముఖ నటి రాధిక మొదట నటుడు ప్రతాప్ పోతన్ ను ఆ తర్వాత రిచర్డ్ హార్డీని, ఆపై నటుడు శరత్‌కుమార్‌ని వివాహం చేసుకున్నారు. నటుడు శరత్ బాబు మొదట హాస్య నటి రమాప్రభను చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహలత అనే ఆమెను చేసుకున్నారు.

ఒకప్పటి హీరో అరవింద్ స్వామి  గాయత్రీ అనే ఆమెను చేసుకుని విడాకులు ఇచ్చారు. దర్శకుడు పార్థిబన్  నటి సీత పరస్పర అంగీకారంతో విడిపోయారు. దర్శకుడు ..నటుడు .. కొరియోగ్రాఫర్  ప్రభుదేవా 2011 లో రామలత నుండి విడాకులు తీసుకున్నారు. అప్పట్లో నయన తార ప్రభు పెళ్లి చేసుకుంటారని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఎందుకో ఆ ఇద్దరూ  పెళ్లి చేసుకోలేదు.

రోహిణి .. రఘువరన్ జంట కూడా విడిపోయారు. తమిళ హీరో ప్రశాంత్ కూడా గృహ లక్ష్మి నుంచి దూరమైనారు. నటి రేవతి సురేష్ చంద్ర మీనన్ లు తేడాలొచ్చి విడిపోయారు. నటి సరిత కూడా రెండు వివాహాలు చేసుకున్నారు.  ప్రముఖ నటి శ్రీవిద్య జార్జ్ థామస్‌ అనే నిర్మాత ను చేసుకుని తర్వాత విడాకులు తీసుకుంది.

ఇటీవలే మరణించిన నటి జయంతి కూడా రెండు వివాహాలు చేసుకున్నారు. ఆ మధ్య నటి అమలాపాల్ డైవర్స్ తీసుకున్నారు. వీరే గాక పరిశ్రమలో డైవర్స్ తీసుకున్న వారు మరెందరో ఉన్నారు. చిత్ర పరిశ్రమలో విచ్చలవిడి ధోరణి .. ఇరువురు సంపాదనపరులు కావడం .. ఆధిపత్య వైఖరి .. ఇగో సమస్యలు .. స్నేహితుల ప్రభావం .. ఇంకా మరెన్నో కారణాలు జంటలు విడిపోవడానికి దారి తీస్తున్నాయి. 

———KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!