ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కొన్నేళ్ల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ లోనే నివాసం ఉంటున్నారు. ఇదివరలో ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. అక్కడ నుంచి ఫిలిం సిటీకి రావాలన్నా పోవాలన్న ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయం ఇంకో పనికి కేటాయించవచ్చన్న ఉద్దేశ్యంతో ఫిల్మ్ సిటీలోనే మకాం పెట్టారు.
అక్కడకి దగ్గర్లోనే రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కార్యకలాపాలను రామోజీ సతీమణి శ్రీమతి రమాదేవి చూస్తుంటారు. కరోనా రాకముందు వరకు నిత్యం ఫిల్మ్ సిటీ లో బయటి ప్రొడక్షన్ హౌస్ షూటింగ్స్ తో పాటు ఇన్ హౌస్ ప్రొడక్షన్ షూటింగ్స్ జరుగుతుండేవి. ఆషూటింగ్స్ ను ఓ కంట గమనిస్తూ ..వాటితో పాటు ఈటీవీ ఛానల్ ప్రసారాలను స్వయంగా రామోజీరావే పర్యవేక్షించేవారు. అలాగే ఫిల్మ్ సిటీ కి సందర్శకుల తాకిడి ఎలా ఉందొ ఓ కంట గమనిస్తుండేవారు.
ఎంత క్లోజ్ అబ్జర్వేషన్ ఉన్నప్పటికీ యేవో లోటు పాట్లు ఉంటాయి. ఈ లోటు పాట్లు ఏమిటో తెలుసుకోవడానికి రామోజీ ఫిలిం సిటీ లో తన ఇంటికి దగ్గర్లో ఒక ఫిర్యాదుల పెట్టెను పెట్టించారు. తన పర్యవేక్షణలో పనిచేసే సిబ్బంది ఎక్కడ ఏ సమస్య ఫీలవుతున్నా దాన్ని ఒక పేపర్ పై విపులంగా రాసి ఆ పెట్టె లో వేస్తే చాలు. ఏరోజుకా రోజు రామోజీరావును ఆ ఫిర్యాదుల పెట్టెలో ఉండే లెటర్స్ ను తెప్పించుకుని చదువుతారు.
ఆ సమస్య మూలాలేంటో తెలుసుకుని వాటి పరిష్కారానికి రామోజీ ప్రయత్నిస్తారు.కొంత కాలం ఆగాక దానిపై మళ్ళీ ఫాలో అప్ కూడా చేస్తుంటారు.ఆయన దృష్టికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉండటంతో స్టాఫ్ తమ సమస్య గురించి రాసి ఫిర్యాదుల డబ్బాలో వేస్తుంటారు.రామోజీ రావు తన దినచర్యలో దాన్నొక భాగం గా మార్చుకున్నారు. కరోనా ముందు కాలం వరకు ఈ ప్రక్రియ సజావుగా సాగింది.
ఇక ఎర్లీ టు బెడ్,ఎర్లీ టు రైజ్ సిద్ధాంతం ఆయనది.దినచర్యలో భాగంగా రామోజీ తెల్లవారుజామున మూడన్నరకే నిద్ర లేస్తారు. అప్పటి నుంచి ఒక రౌండ్ వాకింగ్ చేస్తారు. అలా నడుస్తూనే పరిసరాలను గమనిస్తారు. తర్వాత 5 గంటల నుంచి గ్రీన్ టీ తాగుతూ ఈనాడు దినపత్రికలను పరిశీలిస్తారు. ఏమైనా రిమార్క్స్ రాయాలనుకుంటే రెడ్ ఇంక్ తో రాసేస్తారు. గతంలో అయితే సునిశితంగా పరిశీలించే వారు.. ఏ జిల్లా ఎడిషన్ ను వదిలేవారు కాదు.
హెడ్డింగ్స్ సరిగ్గా లేదనిపిస్తే రిమార్క్స్ రాసేవారు. ఒక్కోసారి అవి ఘాటుగా కూడా ఉంటాయి. సబ్ ఎడిటర్లు హర్ట్ అయి ఉద్యోగం వదిలి వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే హెడ్డింగ్స్ బాగుంటే అవార్డు అని రాసే వారు. అవార్డు అంటే చిన్న కాష్ ప్రైజ్ ఇచ్చేవారు. రెగ్యులర్ గా అవార్డ్స్ ఆ సబ్ ఎడిటర్ కి వస్తే ఒక ఇంక్రిమెంట్ కూడా ఉండేది. (ఈ వ్యాస రచయితకు కూడా ఆలాంటి అవార్డ్స్ వచ్చాయి.)
ప్రస్తుతం వయో భారంతో అంత సీరియస్ గా పత్రికలను రామోజీ రావు పరిశీలించడంలేదు. తర్వాత ఈ టీవీ కార్యక్రమాలను పరిశీలిస్తారు. ముఖ్యమైన ఫోన్లు మాట్లాడాతారు. ఎవరికయినా స్పెషల్ నోట్ పెట్టాలంటే తనే స్వయంగా ఇంగ్లీషులో రాసి పెడతారు. ఆ ఇంగ్లిష్ లో పదాలు అందరికి అంత తొందరగా అర్ధంకావు. అంత మంచి వొకాబులరీ ఆయనది.
ఇక ఉపాహారం తీసుకుని 9 గంటలకల్లా ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ కూడా డిపార్టుమెంటు హెడ్స్ తో మాట్లాడటం..నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేస్తారు. ఒక్కోసారి లంచ్ ఆఫీసులోనే చేస్తారు. అదికూడా సింపుల్ గా ఉంటుంది. లేదంటే పక్కనే ఉన్న ఇంటి కెళతారు. ఇలా ఆయన దినచర్య నడుస్తుంది. దాదాపు 60 ఏళ్ళనుంచి అలవాటైన వాకింగ్ ను మాత్రం ఆయన ఇప్పటికి వదలలేదు.
————– K.N.MURTHY