రామోజీ ఫిర్యాదులపెట్టె కథ !!

Sharing is Caring...

His performance is different…………….

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన సంస్థల్లో పనిచేసిన చాలామంది రామోజీపై చిన్నవిమర్శను సహించరు. రామోజీ మరణించే కొన్నిరోజుల ముందు వరకు ఫిల్మ్ సిటీ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు, కార్యాలయం ఉన్నాయి.

అంతకుముందు ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. అక్కడ నుంచి ఫిలిం సిటీకి రావాలన్నా పోవాలన్నా ఎక్కువ సమయం పట్టేది. ఆసమయం ఇంకో పనికి కేటాయించవచ్చన్న ఉద్దేశ్యంతో ఫిల్మ్ సిటీలోనే మకాం పెట్టారు.

అక్కడకి దగ్గర్లోనే రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ స్కూల్ కార్యకలాపాలను రామోజీ సతీమణి శ్రీమతి రమాదేవి చూస్తుంటారు. నిత్యం ఫిల్మ్ సిటీ లో బయటి ప్రొడక్షన్ హౌస్ షూటింగ్స్ తో పాటు ఇన్ హౌస్ ప్రొడక్షన్ షూటింగ్స్ జరుగుతుండేవి. ఆషూటింగ్స్ ను ఓ కంట గమనిస్తూ ..వాటితో పాటు ఈటీవీ ఛానల్ ప్రసారాలను స్వయంగా రామోజీరావే పర్యవేక్షించేవారు.

అక్కడే ఈటీవీ డెస్క్ ఏర్పాటు చేశారు. టౌన్ లో ఉండే సబ్ ఎడిటర్లు, ఇతర సిబ్బంది ఆఫీస్ కి రావడానికి .. పోవడానికి రామోజీ బస్ సదుపాయం కల్పించారు.ఇక ఫిల్మ్ సిటీ కి సందర్శకుల తాకిడి ఎలా ఉందొ ఓ కంట గమనిస్తుండేవారు.ఎంత క్లోజ్ అబ్జర్వేషన్ ఉన్నప్పటికీ యేవో లోటు పాట్లు ఉంటాయి. ఈ లోటు పాట్లు ఏమిటో తెలుసుకోవడానికి ఫిలిం సిటీ లో తన ఇంటికి దగ్గర్లో ఒక ఫిర్యాదులపెట్టెను పెట్టించారు.

తన పర్యవేక్షణలో పనిచేసే సిబ్బంది ఎక్కడ ఏ సమస్య ఫీలవుతున్నాదాన్ని ఒక పేపర్ పై విపులంగా రాసి ఆపెట్టె లో వేస్తే చాలు. ఏరోజుకా రోజు రామోజీరావు ఆ ఫిర్యాదుల పెట్టెలో ఉండే లెటర్స్ ను తెప్పించుకుని చదివేవారు. ఇతరులకు ఆ సమస్య తెలీకుండా హెచ్ ఆర్ స్టాఫ్ ద్వారా ఫిర్యాదు చేసిన వారిని పిలిపించి మాట్లాడేవారు.

ఆ సమస్య మూలాలేంటో తెలుసుకుని వాటి పరిష్కారానికి రామోజీ ప్రయత్నించేవారు. కొంత కాలం ఆగాక దానిపై మళ్ళీ ఫాలో అప్ కూడా చేసేవారు. ఆయన దృష్టికి వెళితే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉండటంతో స్టాఫ్ తమ సమస్య గురించి రాసి ఫిర్యాదుల డబ్బాలో వేసేవారు.

ఈ టీవీ డెస్క్ లో రాజకీయాలు బాగా నడుస్తుండేవి. కొంతమంది పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకటి రెండు సార్లు దొంగ ఫిర్యాదులు అందాయి. వాటి మీద విచారణ జరిపి ఆఫిర్యాదు చేసిన వారికి వార్నింగ్ ఇచ్చి పంపారట. ఫిర్యాదుల పరిశీలనను రామోజీ రావు తన దినచర్యలో దాన్నొక భాగం గా మార్చుకున్నారని సమాచారం. సంస్థల పనితీరు సజావుగా సాగడానికి రామోజీ రావు ఈ ఫిర్యాదుల స్వీకరణను ఎంచుకున్నారు.

ఇక ఎర్లీ టు బెడ్,ఎర్లీ టు రైజ్ సిద్ధాంతం ఆయనది.దినచర్యలో భాగంగా రామోజీ తెల్లవారుజామున మూడన్నరకే నిద్ర లేచేవారు. అప్పటి నుంచి ఒక రౌండ్ వాకింగ్ చేసేవారు. అలా నడుస్తూనే పరిసరాలను గమనించేవారు. తర్వాత 5 గంటల నుంచి గ్రీన్ టీ తాగుతూ ఈనాడు దినపత్రికలను పరిశీలించేవారు. ఏమైనా రిమార్క్స్ రాయాలనుకుంటే రెడ్ ఇంక్ తో రాసేవారు. 

గతంలో అయితే సునిశితంగా పరిశీలించే వారు.. ఏ జిల్లా ఎడిషన్ ను వదిలేవారు కాదు.హెడ్డింగ్స్ సరిగ్గా లేదనిపిస్తే  రిమార్క్స్ రాసేవారు. ఒక్కోసారి అవి ఘాటుగా కూడా ఉండేవి. సబ్ ఎడిటర్లు హర్ట్ అయి ఉద్యోగం వదిలి వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి.

అలాగే హెడ్డింగ్స్ బాగుంటే అవార్డు అని రాసే వారు. అవార్డు అంటే చిన్న కాష్ ప్రైజ్ ఇచ్చేవారు.  రెగ్యులర్ గా అవార్డ్స్ ఆ సబ్ ఎడిటర్ కి వస్తే ఒక ఇంక్రిమెంట్ కూడా ఉండేది. (ఈ వ్యాస రచయితకు కూడా అలాంటి  అవార్డ్స్ వచ్చాయి.)

తర్వాత కాలంలో వయో భారంతో అంత సీరియస్ గా పత్రికలను రామోజీ రావు పరిశీలించేవారు కాదు. ఈ టీవీ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. ఎవరికయినా స్పెషల్ నోట్ పెట్టాలంటే తనే స్వయంగా ఇంగ్లీషులో రాసి పెట్టేవారు. ఆ ఇంగ్లిష్ లో పదాలు అందరికి అంత తొందరగా అర్ధంకావు. అంత మంచి వొకాబులరీ ఆయనది.

ఇక ఉపాహారం తీసుకుని 9 గంటలకల్లా ఆఫీస్ కి వెళ్లేవారు. అక్కడ కూడా డిపార్టుమెంటు హెడ్స్ తో మాట్లాడటం..నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులు చేసేవారు.ఒక్కోసారి లంచ్ ఆఫీసులోనే చేసేవారు. అదికూడా సింపుల్ గా ఉండేది. లేదంటే పక్కనే ఉన్న ఇంటి కెళ్ళేవారు. అలా ఆయన దినచర్య పూర్తి అయ్యేది. దాదాపు 60 ఏళ్ళనుంచి అలవాటైన వాకింగ్ ను జబ్బున పడేవరకు వదలలేదు. 
————– K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!