Why did those two friends separate?……………………….
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1967 లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదురై సీఎం అయ్యారు. ఆయన క్యాబినెట్లో కరుణానిధి పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ గా చేశారు. 1969 లో అన్నాదురై చనిపోయారు.
తర్వాత తొలిసారిగా కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ సమయంలో ఎంజీఆర్ కరుణానిధి కి మద్దతుగా నిలిచాడు. ఆ తర్వాత కరుణానిధి ఎంజీఆర్ కి ప్రాధాన్యత ఇవ్వడం మెల్లగా తగ్గించాడు. ఎంజీఆర్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.
1970 నాటికి ఎంజీఆర్ జయలలిత లు బాగా దగ్గర అయ్యారు. జయ ప్రభావం ఎంజీఆర్ పై బాగా ఉండేది అంటారు. అలాగే జయ కు ఎంజీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం కూడా కరుణానిధికి నచ్చేది కాదట. 71 లో ఎంజీఆర్ కరుణానిధి గెలుపుకోసం ఎన్నికల ప్రచారం చేసాడు. కరుణానిధి తిరిగి సీఎం అయ్యాడు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి వంటి విషయాల పట్ల జయనే ఎంజీఆర్ ను రెచ్చగొట్టింది అంటారు.
జయ ప్రోద్బలంతోనే ఎన్నికల ఖర్చు చెప్పమని కరుణానిధిని ఎంజీఆర్ అడిగాడు. అలా ఎంజీఆర్..కరుణానిధి ల మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒక దశలో కరుణానిధి తన పెద్ద కొడుకు ముత్తును సినిమా హీరో చేయాలని ప్రయత్నించాడు. కానీ పోటీలో నిలబడలేకపోయాడు. ఇదికూడ ఆ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం. మెల్లగా వీరి స్నేహబంధం బీటలు వారింది.
ఎంజీఆర్ ని కరుణానిధి డీఎంకే పార్టీ నుండి తొలగించాడు. అటు ఎంజీఆర్ కు ఇటు కరుణానిధి కి పార్టీ లో ఉమ్మడి మిత్రులు చాలామంది ఉన్నారు. వీరు అటు ఇటు విషయాలు మోసే వారు. జయలలిత ఎంజీఆర్ ఎక్కడికెళ్లారు ?ఏం చేస్తున్నారనే విషయాలు ఇటు కరుణానిధి కి … ఆయన అన్న మాటలు అటు ఎంజీఆర్ .. జయకు చెప్పేవారు. ఆలా ఒకరిపై మరొకరు ద్వేషం పెంచుకున్నారు.
పార్టీ నుంచి తొలగించగానే ఎంజీఆర్ సొంత పార్టీ పెట్టారు. అదే తరుణంలో దిండిగల్ లోక్ సభ సీటుకు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలలో ఎంజీఆర్ పార్టీ గెలిచింది. ఇక ఎంజీఆర్ వెనుతిరిగి చూడలేదు. 1976 లో కరుణానిధి సర్కార్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 1977 ఎన్నికల్లో కరుణానిధిని ఓడించి ముఖ్యమంత్రి అయ్యారు.
1977 నుండి వరుసగా పదేళ్ల పాటు 1987 వరకు ( చనిపోయేంత వరకు ) ఎంజీఆర్ సీఎంగా కొనసాగారు. ఎంజీఆర్ తరువాత జయ కూడా కరుణానిధి పై పగ సాధించింది. ఆ తర్వాత కథ అందరికి తెలిసిందే.
———KNM