ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాలను మూటగట్టుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ అధిష్టానం లోపాలను, బలహీనతలను అధిగమించే ప్రయత్నాలు చేయడం లేదని వాపోతున్నారు.
వరుసగా ఒక్కోరాష్ట్రాన్ని కోల్పోతున్నా అధిష్టానం లో చలనం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ అత్యున్నత కార్యనిర్వాహక కమిటీ సీడబ్ల్యుసీ భేటీ జరగనుంది. ఈ భేటీ లో ఏ అంశాలపై చర్చిస్తుందా ?ఏ నిర్ణయాలు తీసుకుంటుందా ? అని కాంగ్రెస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఈ కీలక సమావేశానికి గులాంనబీ ఆజాద్, ఆనంద్శర్మ తదితర ముఖ్య నాయకులు హాజరుకావచ్చని భావిస్తున్నారు.
పార్టీలో సీనియర్లు..మేధావులు ఎందరో ఉన్నప్పటికీ భవిష్యత్ వ్యూహాలపై మేధో మధనం లేదు. వైఫల్యాలపై అంతర్మధనం లేదు.రాజకీయ పార్టీ లాగా సీరియస్ గా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. 2014, 2019 లోక సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ లో స్తబ్దత నెలకొంది.
నాయకుల్లో హుషారు లేదు. కార్యకర్తల్లో చురుకుదనం లేదు. 2019 లో రాహుల్ అధ్యక్ష పదవి వదులుకుంటే .. రెండేళ్లు దాటినా పార్టీ ప్రెసిడెంట్ ను ఎన్నుకోలేక పోయింది. పార్టీ వైఫల్యాలో ఇదే ప్రధానమైంది.పార్టీని సంస్థాగతంగా సంస్కరించండి అని చాలా రోజులుగా పలువురు నేతలు చెబుతూనే ఉన్నారు.
అయినా అధిష్టానం వైఖరిలో పెద్ద మార్పులేదు. దీంతో పార్టీకి దశ దిశ లేకుండా పోయింది. ఎన్నికల వ్యూహాలు లేవు .. బాధ్యతల అప్పగింతలు .. సమీక్షలు ఏమీ లేవు. పార్టీ నడుస్తోందంటే .. ఏదో నామకహా అని చెప్పుకోవాలి. ఈ కారణాలవల్లనే పార్టీ బలహీనపడుతుంది.ఎన్నికలొచ్చినపుడు ఏదో నామమాత్రపు ప్రచారం నిర్వహించడం తప్పితే .. వ్యూహాలు లేవు ,, ఎత్తుగడలు లేవు.
స్పందించని అధిష్టానం వైఖరి గమనించి వివిధ రాష్ట్రాల నేతలు వేరే పార్టీలకు వలస పోతున్నారు.ఓట్లు కూడా తరలి పోతున్నాయి. గతంలో కాంగ్రెస్ కి కరడుగట్టిన సాంప్రదాయక ఓటర్లు ఉండేవారు. వారు ఎలాంటి పరిస్థితి లో కూడా కాంగ్రెస్ కి మాత్రమే ఓటు వేసేవారు.
అలాంటి సాంప్రదాయక ఓటర్లు కూడా వేరే పార్టీ ల వైపు చూస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణగా యూపీ ఎన్నికలను చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీ పై వెల్లువెత్తుతున్న విమర్శలను పట్టించుకుంటుందా ? వైఖరి మార్చుకుంటుందా ?
ఇకనైనా తప్పులను తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతుందా ?పార్టీ అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం త్వరగా చేపడుతుందా ? కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా ? బీజేపీని ఎదుర్కొనే విధంగా సంస్థాగతంగా మార్పులు, చేర్పులు చేపడుతుందా ? అసలు ఏమి చేయబోతున్నదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదైనా సీరియస్ గా స్పందించకపోతే పార్టీ మరింత బలహీన పడటం తథ్యం.