Subramanyam Dogiparthi…………………
మట్టిలో మాణిక్యం…. ఇది నటి భానుమతి సినిమా. ఈ సినిమాకు ఆమే హీరో. ఆమె కోసం కధలో మార్పులు కూడా చేసారట.కథ ప్రకారం భానుమతి చలం పాత్రలు తల్లీ కొడుకులు.. అయితే భానుమతి సూచన మేరకు వదినా మరిది పాత్రలుగా మార్చారట.
ఆ తర్వాత ఆమె ధోరణిని దృష్టిలో ఉంచుకుని డైలాగులు రాశారు.సినిమాలో భానుమతి పాత్ర ఇతర పాత్రలకు ఏదో ఒక పేరు పెట్టేస్తుంది. లావుగా ఉంటే బస్తా అనో రబ్బరు బంతి అనో . ఈ సినిమాలో కూడా మల్లయ్య పాత్రలో ధూళిపాళను , జమున తల్లి పాత్రలో మోహనను ఇలా రకరకాల పేర్లతో వాయించేస్తుంటుంది. భానుమతి ని దృష్టిలో ఉంచుకునే రాజశ్రీ మాటలు కూడా రాశారు.భానుమతి తనదైన శైలిలో అలవోకగా నటించింది.
మంచి సినిమా . An entertaining Feel Good Movie . బాగా ఆడింది . సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే. సినిమా ప్రారంభమే భానుమతి పాడే ‘శరణం నీ దివ్య చరణం’ అనే పాటతో . చెవుల్లోని తుప్పు వదులుతుంది . ‘మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట’ , ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి .
‘రిం జిం రిం జిం హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్’ పాటతో , పాటలో హైదరాబాద్ వర్ణన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ‘పల్లెటూరి బైతుగాడు డియ్యాలో అహ డియ్యాలో’ టీజింగ్ పాట హుషారుగా ఉంటుంది ఆ డియ్యాలో అనే పదాన్ని రచయిత రాజశ్రీ ఎక్కడ నుండి పట్టుకొచ్చాడో కానీ గమ్మత్తుగా ఉంటుంది .
బి వి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భానుమతి , జమున , రుష్యేంద్రమణి , గీతాంజలి , మోహన , చలం , ప్రభాకరరెడ్డి , సాక్షి రంగారావు , రాజనాల , కె వి చలం , పద్మనాభం ప్రభృతులు నటించారు .
చలం స్వంత సినిమా కదా ! చాలామంది హాస్య నటుల్ని ఏదో ఒక పాత్రలో చూపించాడు . రాజశ్రీ డైలాగులు బాగుంటాయి . కోకమ్మ గారు అని జమునని చలం చేత అనిపిస్తారు . కోక అంటే చీరె . చీరె అంటే శారీ ..
జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా అందుకుంది. చలం అదృష్టవంతుడు . పద్మనాభం , కాంతారావుల్లాగా చేతులు కాల్చుకోలేదు. శారదతో కలిసి ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. అటు పేరు , ఇటు డబ్బులు అన్నీ వచ్చాయి.
తెలుగు సినిమాల్లో ఇదొక మాణిక్యం అనుకోవచ్చు.. మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా.యూట్యూబులో ఉంది. చూడనివవారు ఉంటే వాచ్ లిస్టులో పెట్టేయవచ్చు .