Won’t Telugu artists be seen by phalke award committee members?……………
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో మహానటీ, నటులున్నారు. అద్భుతమైన రచయితలు,సంగీత దర్శకులు ఉన్నారు. హిట్ ఫిలిమ్స్ అందించిన దర్శకులు ఉన్నారు. కానీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం అతి కొద్దీ మంది తెలుగు వారికే లభించడం శోచనీయం.
లబ్ద ప్రతిష్టులైన కళాకారులు ఫాల్కే అవార్డు కమిటీ సభ్యులకు కనిపించకపోవడం నిజంగా విచిత్రమే. అసలు ఈ కమిటీ సభ్యులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారా అనే సందేహాలు కూడా లేకపోలేదు.రాజకీయ నేతల సూచనలతోనే ఈ కమిటీ పురస్కారాలను ప్రకటిస్తున్నదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వారిలో నటులు చిత్తూరు నాగయ్య , ఎస్వీ రంగారావు,ఎన్టీ రామారావు , నటీమణులు భానుమతి,సావిత్రి, జమున, గాయకులు ఘంటసాల, పీ.బీ .శ్రీనివాస్,బాలూ , గాయనీమణులు జానకి, సుశీల, ఎస్.వరలక్ష్మి , రచయితలు సీనియర్ సముద్రాల , పింగళి,దాశరధి, ఆరుద్ర, కృష్ణశాస్త్రి ,శ్రీశ్రీ , ఆత్రేయ ,సినారే ,ముళ్ళపూడి, సంగీత దర్శకులు రాజేశ్వరరావు, పెండ్యాల, సుసర్ల,ఆదినారాయణరావు, దర్శకులు సీఎస్ రావు ,కేవీ రెడ్డి,ఆదుర్తి , కమలాకర కామేశ్వరరావు , బాపు వంటి దర్శకులున్నారు.
వీరంతా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడినవారే. మరెంతోమంది అద్భుత కళాకారులు ఉన్నారు. వీరంతా కమిటీ సభ్యులకు కనిపించకపోవడం ఘోరం. వీరంతా అసమాన ప్రతిభ గలవారే. హిందీ కళాకారులకు ఏ మాత్రం తీసి పోరు. ఎన్టీఆర్ అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఇవ్వలేదు అనుకోవచ్చు .
నాగయ్య , ఎస్వీఆర్ లను కూడా వారు గుర్తించకపోవడం బాధాకరం. తెలుగు సినీ ప్రముఖులకైతే న్యాయం జరగలేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.వారిలో కొందరికైనా కనీసం మరణాంతర పురస్కారం కూడా ప్రకటించక పోవడం దారుణం. వీరంతా ఏభాష కళాకారులతో పోల్చినా తక్కువైనవారు కానే కాదు.
ఈ పురస్కారానికి అర్హులైన వ్యక్తులను ఎంపిక చేయడంలో ప్రాంతీయ వివక్షత, రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. హిందీ పరిశ్రమ లో నటులకు, గాయకులకు, సంగీత దర్శకులకు కూడా ఈ అవార్డులు ఇచ్చారు. తెలుగు లో అలా జరగలేదు.
ఇప్పటివరకు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974) పైడి జైరాజ్ (1980) ఎల్.వి.ప్రసాద్ (1982) బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986) అక్కినేని నాగేశ్వరరావు (1990) డి.రామానాయుడు (2009) కె. విశ్వనాథ్ (2016)లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉంటే ఏడాదికి ఒక్కరినే ఈ అవార్డు కి ఎంపిక జేయడం కూడా కష్టమే అనే అభిప్రాయం కూడా లేకపోలేదు. చిత్ర పరిశ్రమ చిన్నదిగా ఉన్నపుడు పెట్టిన ఈ అవార్డు ని ఇపుడు పరిశ్రమ విస్తృతమైన నేపధ్యం లో అవార్డు ను రెండుగా చేసి సౌత్ లో ఒకరికి , నార్త్ లో ఒకరికి ఇస్తే కొంతైనా న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది.
భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం విశేష కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేస్తుంటారు. దేశంలో ఇది అత్యున్నత పురస్కారం. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969 లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం, శాలువా ,పదిలక్షల రూపాయలు నగదు అందజేస్తారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులతో కూడిన కమిటీ ఈ అవార్డుకి అర్హులైన వారిని ఎంపిక జేస్తుంది.
తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు. భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు. తరవాత కాలంలో కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆయన పేరు మీద అవార్డు ప్రదానం చేయడం మంచి సంప్రదాయమే. అభిలషణీయమే.