సింధూలోయ నాగరికత అలా అంతమైందా ?

Sharing is Caring...

The end of the Indus Valley Civilization ……

సింధూ లోయ నాగరికత ఎలా అంతమైందనే శతాబ్దాల నాటి రహస్యానికి ఎట్టకేలకు సమాధానం దొరికిందని ఒక శాస్త్రీయ అధ్యయనం చెబుతోంది.ఈ కొత్త పరిశోధన ఫలితాలు ఇప్పటివరకు ఉన్న పాత సిద్ధాంతాలను సవాలు చేస్తున్నాయి.

ఈ పురాతన నగర సామ్రాజ్యం ఒకేసారి జరిగిన ఏదో ఒక భారీ విపత్తు వల్ల అంతం కాలేదని, పర్యావరణ, సామాజిక మార్పుల వల్ల చాలా కాలం పాటు నెమ్మదిగా, క్రమంగా అంతరించిపోయిందని అధ్యయనం వెల్లడించింది.

‘కమ్యూనికేషన్స్ ఎర్త్ & ఎన్విరాన్‌మెంట్’ (Communications Earth & Environment) అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అంతర్జాతీయ పరిశోధనలో… శాస్త్రవేత్తల బృందం క్రీస్తు పూర్వం (BCE) 3000 నుండి 1000 వరకు ఉన్న వాతావరణాన్ని విశ్లేషించడానికి ప్రాచీన వాతావరణ డేటా (paleoclimate data)  కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించింది.

సింధూ లోయ నాగరికతలో అత్యంత ముఖ్యమైన పట్టణ కేంద్రాలలో ఒకటైన ‘హరప్పా’ అంతమవడానికి కారణం ఏదో ఒక భారీ విపత్తు కాదు, శతాబ్దాల పాటు వరుసగా వచ్చిన సుదీర్ఘ కరువులే దీనికి కారణం. ఇవే నదులను, నేలలను పూర్తిగా ఎండబెట్టేలా చేశాయి.

“వరుసగా వచ్చిన భారీ కరువులు (ఇందులో ఒక్కో కరువు దాదాపు 85 ఏళ్లకు పైగా కొనసాగింది) సింధూ లోయ నాగరికత చివరి పతనానికి ప్రధాన కారణం కావచ్చు” అని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయ పడింది. 

ఒకదాని తర్వాత ఒకటి నగరాలు ఎలా కూలిపోయాయి?

ఈ నాగరికత వర్ధిల్లిన ప్రాంతంలో 5,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల క్రితం వర్షపాతం, ఉష్ణోగ్రతలు ఎలా మారాయో తెలుసుకోవడానికి పరిశోధకులు అంతర్జాతీయ వాతావరణ అనుకరణలను (Global climate simulations) ఉపయోగించారు. కరువులు తీవ్రమవడంతో, ప్రజలు నీటి వనరులు ఇంకా అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వలస వెళ్లారని ఈ బృందం విశ్లేషించింది.

అయితే, ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ప్రాంతంలోని నగరాలన్నీ కుప్పకూలాయి. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక శతాబ్ద కాలపు సుదీర్ఘ కరువు… ఇక్కడి ప్రధాన నగరాల పతనానికి,  సంస్కృతి అంతమవడానికి దారితీసిందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనా పత్రంలో రాశారు.

“అన్ని అనుకరణలలో (Simulations) 5000 నుండి 3000 సంవత్సరాల క్రితం వరకు వర్షపాతం నిరంతరాయంగా తగ్గడం గమనించాం. కాబట్టి బహుళ శతాబ్దాల కరువులు, రుతుపవనాలు బలహీనపడటం లేదా శీతాకాలపు వర్షపాతంలో మార్పులు వంటివి నిజంగానే జరిగాయి, ఇవి ఏదో ఒక సాధారణ మోడల్ వల్ల వచ్చిన తప్పుడు అంచనాలు కావు” అని గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పీహెచ్‌డీ విద్యార్థి, ఈ అధ్యయన ప్రధాన రచయిత హిరెన్ సోలంకి ‘లైవ్ సైన్స్’కు పంపిన ఈమెయిల్‌లో తెలిపారు.

పరిశోధనలోని ముఖ్యమైన అంశాలు

క్రీస్తు పూర్వం 2425 నుండి 1400 మధ్య నాలుగు ప్రధాన కరువు కాలాలు గుర్తించబడ్డాయి. ఇందులో ఒక్కొక్కటి 85 సంవత్సరాలకు పైగా కొనసాగింది. క్రీస్తు పూర్వం 1733 ప్రాంతంలో వచ్చిన మూడవ తీవ్రమైన కరువు ఏకంగా 164 సంవత్సరాల పాటు కొనసాగి, ఆ ప్రాంతాన్ని మొత్తం దెబ్బతీసింది.మొత్తం ఉష్ణోగ్రత 0.5°C పెరిగింది.  వర్షపాతం 10% నుండి 20% వరకు తగ్గింది, ఇది అక్కడి నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపింది.

ఈ కారణాలన్నీ కలిసి 3,500 నుండి 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం, పాకిస్తాన్ ప్రాంతాలలో వర్ధిల్లిన సింధూ లోయ నాగరికత నెమ్మదిగా, క్రమంగా అంతమవడానికి దారితీశాయి. నాటి ప్రాచీన నాగరికతలపై వాతావరణ మార్పుల ప్రభావం… నేడు మళ్లీ పర్యావరణ సవాళ్లతో పోరాడుతున్న ప్రస్తుత మానవాళికి ఒక పెద్ద పాఠం.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!