Operation Sindhoor ……………………..
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. భారత్ ‘సుదర్శన్ చక్ర’ అని పిలుచుకునే అత్యంత శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ ‘S-400’ తో ఆర్మీ దూసుకుపోతోంది. పాకిస్థాన్ ప్రతీకార చర్యలో భాగంగా వైమానిక, క్షిపణి దాడులకు దిగితే వాటిని నిలువరించే శక్తి ఈ S–400 కి ఉంది.
శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధవిమానాలు, క్షిపణులు, డ్రోన్లను మార్గమధ్యంలోనే పేల్చివేయడంలో ఈ S–400 కి తిరుగులేదు. మన ఆర్మీ ఈ S–400 ఆయుధ వ్యవస్థను యాక్టివేట్ చేసింది.
నిన్న రాత్రి, ఈరోజు తెల్లవారుజామున భారత నగరాలపై పాకిస్తాన్ ప్రయోగించిన 15 క్షిపణులను తటస్థీకరించడానికి/పేల్చి వేయడానికి ఈ S–400 ఆయుధ వ్యవస్థను ఉపయోగించారు.లాహోర్లోని ఒక రాడార్తో సహా పాక్ వైమానిక రక్షణ రాడార్లను నిలిపివేయడానికి ఇజ్రాయెల్ హార్పీ డ్రోన్లను మోహరించారు.
నిన్నరాత్రి భారతదేశం వైపు వెళ్తున్న ‘కదిలే లక్ష్యాల’పై వైమానిక దళం S-400 వ్యవస్థను ప్రయోగించి, ఈ లక్ష్యాలను విజయవంతంగా తటస్థీకరించిందని వార్తా సంస్థలు చెబుతున్నాయి.
ఇవాళ ఉదయం పాకిస్తాన్ సైనిక దళాలు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్తో సహా దేశంలోని ఉత్తర,పశ్చిమ ప్రాంతాలలోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను S-400 సాయంతో భారత్ నిలిపి వేసింది.
ఈ దాడుల్లో ధ్వంసమైన పాక్ డ్రోన్లు, క్షిపణుల శిథిలాలను సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆధారాలన్నీ సైనిక శిక్షణ ద్వారా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తాయని భారత్ అంటోంది.
ఈ క్రమంలోనే పాకిస్థాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.మరోవైపు నియంత్రణ రేఖ (LoC) వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది.
జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు.పాక్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే మాత్రం… వెనక్కి తగ్గేదే లేదని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ఇక S-400 గురించి చెప్పుకోవాలంటే .. ఇది సంచార క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన ఎన్పీవో అల్మాజ్ సంస్థ దీనిని రూపొందించింది. గతంలో ఉన్న ఎస్-300ను ఆధునికీకరించి, దీన్ని తయారుచేసింది. మరింత మెరుగైన ఎస్-500 గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
శత్రువులు ఉపయోగించే జామింగ్ విధానాలను ఎస్-400 తట్టుకుని నిలబడుతుంది. ఇది యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్రూజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను గన్ షాట్ గా నేలకూలుస్తుంది. ఇలాంటి ఐదు క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్.. 2018లో రష్యాతో 35,000 కోట్ల
ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇప్పటికే మూడు వ్యవస్థలు భారత్ కి వచ్చాయి. మరో రెండు వచ్చే ఏడాది ఆగస్టులో భారత్ చేతికందుతాయి. పాకిస్థాన్ దాడులను ఎదుర్కొనేందుకు పంజాబ్లో, రాజస్థాన్లలో ఒక్కొక్కటి చొప్పున ఎస్-400 వ్యవస్థలను మోహరించినట్లు సమాచారం. అలాగే చైనా ను ఎదుర్కొనేందుకు అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థను ఉంచారని భావిస్తున్నారు.