Abdul Rajahussain …………………………
అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు..జన్మతః అంధుడైనా..’గణితావధానాల్లో ‘ ప్రపంచంలోనే మేటి..అంకెలు ఎలా ఉంటాయో తెలియకుండానే ఆయన”గణితబ్రహ్మ” అయ్యారు.నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ సృష్టికర్త ఆయన.
నోబెల్ ‘ (Nobel) పురస్కారం కూడా ఈయనకు చిన్నదే.గణితంలో నాకన్నాప్రతిభావంతుడు శర్మ గారు” హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి ఒక సందర్భంగా అన్నారు. కడప జిల్లాకు చెందిన ‘గణితబ్రహ్మ’ లక్కోజుసంజీవరాయశర్మ గారి గురించి ఈ తరం వారికి అంతగాతెలీకపోవచ్చు.
కానీ,ఇలాంటి ఓఅపర మేధావి మన తెలుగు వాడైనందుకు గర్వించాలి.సంజీవరాయశర్మ 1907 నవంబర్ 27 న కడపజిల్లాప్రొద్దుటూరు మండలంలోని ‘కల్లూరు’ లో జన్మించారు. 19వ ఏట ఆదిలక్ష్మమ్మను పెళ్లాడాడు. కల్లూరులో రైతు లకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. అలా చెప్పినందుకు రైతులు ఆయనకి కొంత సొమ్ముచెల్లించే వారు.
కేవలం గణితమే కాదు.ఆయన వయొలిన్ కూడా వాయించేవారు. ఈయన పుట్టుకతోనే అంధుడు.అయితేనేం ఆత్మ విశ్వాసంతో ఎదిగారు.ప్రపంచం నివ్వెరపోయేలా చేశారు.ఆయనబడికి వెళ్ళలేదు.చదువుకోలేదు. కనీసం బ్రెయిలీలిపికూడా తెలీదు.తన అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర…గొంతెత్తి బిగ్గరగా చదువుతుంటే వాటిని గుర్తుపెట్టుకుని ‘గణితం’ లో అపార విజ్ఞానం సాధించాడు.
లెక్కలకే లెక్కలు సరిచేశాడు.సంవత్సరాలు,తిథులు,నెలలు,నక్షత్రాలు,…వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు,సెకనులేవీ తెలియకున్నాఅన్నీతెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించిన అపర మేధావి శర్మగారు..ఆరు వేల గణితావధానాలు చేసి ప్రపంచంలో ఎవరూ చేయని, చేయలేని అరుదైన ఫీట్ సాధించారు..!!
*గణితావధానాలు..!!
అవధానమే కష్టం..అటువంటిది గణితావధానమంటే వేరేచెప్పాలా.? అయితే శర్మ గారు గణితా
వధానాన్ని అవలీలగా చేసేవారు. 1928 లో తొలి గణితావధానం చేశారు…ఆయన ప్రతిభకు జనం అచ్చెరువొందారు.నాటి నుంచి ..ఆయన వెనుతిరిగి చూడలేదు..దేశంలోని తెలుగు రాష్ట్రాలతో.. పాటుకర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఆయన అవధానప్రస్థానం కొనసాగింది.
1995వరకు ఆయన ఎన్నోప్రాంతాల్లో పర్యటించి తన అవధాన విద్యనుప్రదర్శించారు.ఒకటికాదు..రెండుకాదు..సుమారు6000కు పైగా గణితావధానాలు చేశారు.ప్రపంచంలోని …గణితమేధావులందరూ ముక్కు మీద వేలేసుకొని శర్మగారిసహజ ప్రతిభను వేనోళ్ళ కొనియాడారు..!!
1928 నవంబర్ 15న నంద్యాలలోఅఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగినపుడు సంజీవరాయ శర్మ గణితావధానం చేశారు.ఆ సభల్లో శర్మ గారి అవధానం ప్రధానాకర్షణ కావడంవిశేషం.అప్పటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ శర్మ గారి ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ములో కొంత మొత్తాన్ని మనియార్డర్ ద్వారా శర్మగారికి పంపడం విశేషం!
అనీబ్సెంట్, నెహ్రూ, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్,మేధ్స్ విజార్డ్ శకుంతలా దేవి,కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే,తదితరులంతా శర్మగారి గణితావధానాన్నిస్వయంగా తిలకించి ఇటువంటి ప్రతిభ అనితరసాధ్యమని మెచ్చుకున్నారు..వేనోళ్ళ కీర్తించారు.
శర్మగారి అవధానం ఇలా..
గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది యే వారమైందో చెప్పడం సర్వసాధారణం. కానీ సంజీవరాయ శర్మగారు..అలా కాదు.ఆ పుట్టిన తేదీ యే వారమో చెప్పడమేకాదు..ఆనాటి పూర్తి పంచాంగం చెప్పేవారు.అంటే,పుట్టిన తేదీ,సమయం ప్రదేశంచెప్పగానే,దానికిసంబంధించిన తిథి,వారం, నక్షత్రం, కరణం, యోగం, వర్జ్యం, రాశి కూడా చెప్పిఅదనంగా జాతకం కూడా చెప్పి ఆశ్చర్యపరిచే వారు.
గణితంలో మేటి గా,మానవయంత్రంగా భావించే శకుంతలా దేవి తో సహా ప్రపంచంలో మరెవరూ కూడా ఇటువంటిప్రతిభను ప్రదర్శించలేదంటే అతిశయోక్తి కాదు.
అనితర సాధ్యం ఆయన ప్రతిభ..!! అది 1966, డిసెంబర్ నెల 7వ తేదీ..స్థలం హైదరాబాద్ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. కార్యక్రమం…శర్మగారి గణితావధానం.
* 2 power 103 ఎంత? ఓం పృచ్ఛకుడి ప్రశ్న ?
దానికి అవధాని శర్మగారి సమాధానం…
“ముప్పైరెండు అంకెలున్న సంఖ్య”..!!
‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత? యాభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు… !
కలం, కాగితం చేతిలో వున్నాగంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానం ఇది..
ఇటువంటి క్లిష్టమైన,కష్టమైన ఎన్నో ప్రశ్నలకు ఆయన ఊపిరిపీల్చుకొని వదిలి సులువుగా చక
చకా సమాధానాలు చెప్పేవారు.!ప్రశ్న అడిగటమే తరువాయి,ఏమాత్రం తడుముకోకుండా,జాప్యం చేయకుండా ఠక్కున సమాధానం చెప్పేవారు.. సంజీవరాయ శర్మ గారు.
ఆయనకు కళ్ళు లేవు.కళ్ళతో అంకెలు చూసిన వాడు…కాదు.పోనీ చదువుకున్నాడా,! అంటే అదీలేదు.పారిజాతం సహజంగా విప్పారి పరిమళించినట్లు శర్మగారి ప్రతిభ దశదిశలా గుబాళించింది.
*మరో ఉదంతం చూడండి..!!
శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు,…మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది.ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలోతేల్చాల్సివచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!
దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం చూడండి. *ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73వేల,70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట… (1,84,46,74,40,73,70,95,51,615 )ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే… అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం!
నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై వుంటుందా? వుండదు. కానీ సంజీవరాయశర్మ గణితావధాన వివరణ మహిమ ఇది.
*ఒకటా రెండా? ఎన్నో ప్రదర్శనలు..!! శర్మ గారు వివిధ విశ్వవిద్యాలయాల్లో, అనేక కళాశాలల్లో అవధాన విద్యను ప్రదర్శించి, విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే పలు గ్రంథాలయాల్లో తమ గణితావధానాలు చేశారు.అలాగే మేథమేటికల్ సొసైటీల్లో ప్రదర్శనలిచ్చారు.
ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది.వివిధ విశ్వవిద్యాలయాలు బంగారు పతకాలతో ఘనంగా సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణి స్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్కేస్ ను ఎవరో తస్కరించారు.
ప్రపంచంలో అంధులైన ప్రతిభావంతుల్లో జాన్మిల్టన్,బ్రెయిలీ కనుగొన్న హెల్న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామి నాయుడు,కథకులు అందే నారాయణ స్వామి వంటివారు పుట్టుకతో అంధులుకారు. తదనంతర కాలంలోవారు అంధులయ్యారు.
కానీ..ఈగణితమేధావి’లక్కోజుసంజీవరాయ శర్మ’ గారికి మాత్రం పుట్టుకతోనే అంధత్వం…
వుంది.ఆయనదంతా.. వినికిడి జ్ఞానమే..ఆయన కు ‘అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య, తదితర బిరుదులుండేవి.!
*కడవరకూ పేదరికమే…!!
శర్మగారు జీవితచరమాంకం వరకూ పేదరికంలోనే గడిపారు..ఈ మేధావిని గుర్తించి,సముచిత గౌరవమివ్వడంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయి.మరణించే వరకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.300 భరణం మాత్రం అందేది.
దేవస్థానం అధికారుల నుంచి గౌరవ వేతనం కోసంశ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతిరోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు..! గుడ్డిలో మెల్లగాశ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు మాత్రం శర్మగారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి, తమ్ము తాముగౌరవించుకున్నారు.!
శర్మగారు..తమ చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామి నర్చిస్తూగడిపారు.1997 డిసెంబరు రెండోతేదీన ఆయన అస్తమించారు.
నోబెల్ బహుమతులు, మెగ్సెసేలు,.. జ్ఞాన్పీఠ్లు.. శర్మగారి ప్రతిభాపాటవాలముందు ఎంతో చిన్నవి.