మైనాస్వామి ………………………………………….
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడివుంది. విశాలమైన ఆవరణంలో ఆలయం వుంది. మూల విరాట్ నర సింహస్వామి. స్వామి ఖాద్రీశుడుగా ఖ్యాతి చెందాడు. ఖాద్రి అంటే విష్ణు పాదం గల కొండ అని అర్ధం. ఖాద్రి నుంచి ‘కదిరి’ పేరు పుట్టింది.
నరసింహ స్వామి సన్నిధికి ఎడమ పక్కన లక్ష్మీ అమ్మవారి కోవెల వుంది. ప్రధానాలయం చుట్టూ కొన్ని ఉపాలయాలు, వివిధ మండపాలు ఉన్నాయి. దేవాలయానికి రక్షణగా కట్టిన భారీ ప్రాకారంపై నలుదిక్కులా అత్యంత భారీ ఎత్తుతో ద్వార గోపురాలను నిర్మించారు.
తూర్పున గల సింహ ద్వార గోపురం ఎంతో ఆకర్షణీయంగా వుంది. కదిరి ఆలయంలోని శిల్పకళ విజయనగర శిల్ప శైలికి నిదర్శనం. శిల్పకళ అద్భుతంగా వుంది. చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలయ ఆవరణం వెనుక పెద్ద కోనేరు వుంది. కోనేరును భృగుతీర్ధంగా పిలుస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతియేటా ఫాల్గుణ మాసం ( మార్చి – ఏప్రిల్)లో జరుగుతాయి.
బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం ప్రధాన ఆకర్షణ రథోత్సవం.. కదిరి తేరుగా ప్రసిద్ధిగాంచింది. రాయలసీమ జిల్లాల నలు మూలల నుంచే గాక, పక్క జిల్లాల నుంచి .. కర్నాటక రాష్ట్రం నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ‘కదిరి తేరు’ను లాగుతారు. నరసింహనాదంతో కదిరి మార్మోగుతుంది. స్వామి సన్నిధిని సందర్శించడం ఒక ఎత్తయితే.. తేరు తిరువీధుల్లో తిరుగుతుండడాన్ని చూడడం మరో ఎత్తు.
‘కాటమ రాయుడా.. కదిరి నరసింహుడా’ అనే జానపద గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది.ఖాద్రీశుని గుడి మొదటి బుక్కరాయల పాలనా కాలంలో సంపూర్ణ గుడిగా రూపుదిద్దుకొన్నది.చాళుక్యుల కాలంలో కోవెలకు అంకురార్పణ జరిగి ఉండవచ్చు. కానీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన అనతికాలంలోనే ఆలయం అభివృద్ధి చెందింది. ఇందుకు బలమైన సాక్ష్యం వీరబుక్కరాయల క్రీస్తు శకం 1352 శాసనం.
ఆ శాసనం చాలా చిన్నదే. కానీ విజయనగర రాజ్యానికి చెందిన విలువైన సమాచారం లభిస్తుంది. గుడి వివరాలు తెలిపే తొలి శాసనం అదే. ఒకటో దేవరాయలు, క్రిష్ణదేవరాయలు, స్థానిక రాజప్రతినిధుల శాసనాలు మరిన్ని వివరాలు అందిస్తున్నాయి. మహా మండపం దక్షిణాన శాసనాలన్ని ఒక చోట వున్నాయి.వాటికి నీడ లేదు. వాటిలో ముఖ్యమైనది బుక్కరాయల శాసనం.
బుక్కరాయలు: విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ ( క్రీ.శ. 1336-1485), సాళువ (1485-1505), తుళువ (1505-1571), అరవీడు (1571-1672) వంశాల రాజులు పాలించారు. తొలి వంశానికి మూల పురుషుడైన సంగమునికి ఐదుగురు కొడుకులు. వారు హరిహరరాయలు, కంపరాయలు, బుక్కరాయలు, మారప, ముద్ధప. హరిహర – బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకులు. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపినగరం. హంపి కర్ణాటకలోని హోసపేట సమీపంలో ఉంది. హరిహర రాయలు రాజ్యానికి తొలి ప్రభువు అయ్యాడు.
బుక్కరాయలు దోరసముద్రం – పెనుకొండ రాజ్యాల ప్రతినిధిగా పనిచేశాడు. ద్వార సముద్రం హోయసల రాజ్యానికి రాజధాని. దోర సముద్రం ప్రస్తుత పేరు.. హళేబీడు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. కర్ణాటక రాయలసీమ జిల్లాలు హొయసల రాజ్యంలో భాగంగా వుండేవి. విజయనగర రాజ్యం ఆవిర్భవించేంత వరకు హొయసలుల పాలన సాగింది. చాళుక్యుల కాలం నాటి నుంచి పెనుకొండ ముఖ్య స్థానంగా వెలుగొందింది.
హొయసల రాజుల పాలనలో పెనుకొండ ప్రాముఖ్యం పెరిగింది. విజయనగర రాజ్యంలో సైనిక సంపత్తి స్థావరం సుస్థిర స్థానం సంపాదించుకొన్నది. అటు వంటి దోరసముద్రం పెనుకొండ రాజ్యాలకు బుక్కరాయలు బాధ్యునిగా వున్నట్టు కదిరి లక్ష్మీ నరసింహాలయంలోని శాసనం చెబుతున్నది. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు గల భూభాగానికి పాలకుడని పేర్కొన్నది.
హరిహరరాయల (క్రీ.శ. 1336-1356) తర్వాత బుక్కరాయలు విజయనగర రాజ్యానికి రాజు అయ్యాడు. 1356 నుంచి 1379 వరకు పాలించాడు. రాజ్యాన్ని స్థాపించడమే గాక ఒక మహా సామ్రాజ్యంగా విజయనగరం (హంపి) ఎదగడం వెనుక హరిహర-బుక్కరాయలు సోదర ద్వయం సాగించిన అవిరళ కృషి అనితర సాధ్యం. ప్రజారంజక పాలన అందించి ప్రజల మెప్పు పొందారు.
సంగమ వంశం వారు శైవమతంలోని పాశుపత శాఖకు చెందినవారు. కానీ వారి ఇంటి దేవుడు నరసింహస్వామి. అందువల్లనే హరిహరరాయలు-బుక్కరాయల హయాంలో రాజ్యంలో పలుచోట్ల ప్రహ్లాద వరదుని సన్నిధులు వెలిశాయి. నరసింహస్వామిని వారు అవుభళ స్వామిగా కీర్తించారు. అవుభళ అంటే అహోబిల. మహాబలశాలి అయిన స్వామి అని అర్థం.