ఎవరీ కాశీ నాయన అవధూత ?

Sharing is Caring...

Kasi nayana the great person …………………………

ఆధ్యాత్మిక గురువుగా, అవధూత గా కాశీ నాయన  ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు . యుక్త వయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్య నేర్పుతూ కొంతకాలం గడిపారు.

తరువాత నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే కొంత కాలం తపస్సు చేశారు. తర్వాత కాలంలో తీర్ధయాత్రలు చేశారు. తిరిగి వచ్చిన దరిమిలా స్థానికుల సహకారంతో పాడుబడిన దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. దాంతో బాటుగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు.

అన్నదాన కార్యక్రమానికి స్పందన బాగా ఉండటంతో అది నిరతాన్నదానంగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు. ఆ సొమ్మును ఆలయాల జీర్ణోద్ధరణకు కూడా ఉపయోగించేవారు.జ్యోతిలోని లక్ష్మినరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించారు. అక్కడే 1995 డిసెంబరు 6న విగ్రహ ప్రతిష్ఠ చేసిన కాశినాయన భక్తుల సమక్షంలో కన్నుమూసి, సమాధి దీక్ష పొందారు.

తాను సమాధి స్థితికి చేరుతానని తన శిష్యులతో కాశీ నాయన ముందుగానే చెప్పారని అంటారు. తన మరణాంతరం తనను తపస్సు చేసిన ప్రాంతంలోనే సమాధి చేయాలని ఆయన సూచించారని చెబుతారు. ఆయన కోరినట్టు భక్తులు చేశారు.నాటి నుంచి ఈ ప్రాంతం జ్యోతి క్షేత్రంగా వెలుగొందుతోంది.

కాశినాయన అసలు పేరు కాశిరెడ్డి. ఎంత మంది ఆకలితో వచ్చినా 24 గంటలూ కడుపునిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలో ప్రత్యేకత. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి అందాల మధ్య అలరారే జ్యోతి క్షేత్రం చూడాల్సిన క్షేత్రాల్లో ఒకటి. 

ఇక అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అనేకచోట్ల కాశినాయన పేరు మీద నిరంతరం అన్నదానం చేసే క్షేత్రాలు ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం  కాశినాయన సమాధి ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది. ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా ఇక్కడ  ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

1995 నుంచి అప్పటి నాయకులు, అధికారులు అండదండలతో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది. అక్కడ వివిధ భవనాలు వెలిశాయి.వాటిలో భక్తులు కోసం వసతి,భోజన సదుపాయాలు కల్పించారు.గోశాల నిర్మించారు.ఈ క్రమంలో గిట్టనివారు పిటిషన్ వేయడంతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి.

కొద్దీ రోజుల క్రితం అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలో ఉందని, వెంటనే ఖాళీ చేయాలంటూ హడావుడి చేశారు. ఆ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కాశినాయన ఆశ్రమ అన్నదాన సత్రాలు,గోశాలను కూలగొట్టారు.

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ఈ అంశానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. స్థానికులు, భక్తులు తీవ్ర నిరసన ప్రకటించి ఉద్యమం చేపట్టారు. కాశినాయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. నిరసన సెగలు అసెంబ్లీని తాకాయి.

దీంతో సమస్య తీవ్రతను గమనించి ప్రభుత్వం దిగివచ్చింది.ప్రభుత్వం తరపున మంత్రి  నారా లోకేష్ ఆశ్రమ నిర్వాహకులు జీరయ్యస్వామితో ఫోన్లో మాట్లాడారు.జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తంచేశారు. కూల్చిన షెడ్ల పునర్ నిర్మాణ పనులుకూడా మొదలయ్యాయి

కూలగొట్టిన నిర్మాణాలను తిరిగి కడతామని హామీ ఇచ్చి,ఆగిపోయిన బస్సును పునరుద్ధరిస్తూ సమస్యకు ముగింపు పలికారు. కాశినాయన ఆశ్రమానికి సంబంధించిన అసెంబ్లీ లో చర్చ జరిగింది.

ఆ సందర్భంగా దేవాదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ‘కాశినాయన ఆశ్రమాన్ని దేవాదాయ శాఖలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. సీఎంతో చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటా’మని మంత్రి హామీ ఇచ్చారు. కాగా ఈ ప్రతిపాదనపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆశ్రమం స్వతంత్ర సంస్థ నిర్వహణలో ఉండాలని కాశీనాయన భక్తులు అంటున్నారు.ఈ మేరకు ప్రభుత్వం తో సంప్రదింపులు జరుగుతున్నాయి.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!