ఏపీ లో పంచాయితీ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసి … తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేమని … కరోనా పూర్తిగా అదుపులోకి రాని నేపథ్యంలో ఎన్నికలు పెట్టి తమ బతుకులను అభద్రతలోకి నెట్టవద్దని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేసినప్పటికీ నిమ్మగడ్డ స్పందించలేదు. అలాగే ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను ఆయన తిరస్కరించారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి నిమ్మగడ్డ ఎలాగైనా ఎన్నికలు జరిపి తీరాలనే పంతం తో ఉన్నట్టు అర్ధమవుతోంది.
కాగా నిబంధనలు అతిక్రమించారనే కారణంతో 9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి నిమ్మగడ్డ తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లతోపాటు తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాలహస్తి డీఎస్పీలు, మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలపై బదిలీ వేటు వేశారు. తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్కు, డీజీపీకి నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాశారు. కానీ ఆ ఆదేశాలను జగన్ సర్కారు తిరస్కరించింది. ఎస్ఈసీకి రాసిన లేఖలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి కొందరు అధికారులను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు.ఆ అధికారులందరూ ప్రస్తుతం కొవిడ్ ప్రోటోకాల్ అమలు విధుల్లో బిజీగా ఉన్నారని, కాబట్టి వారిపై చర్యలు తీసుకోవడం కుదరదని సీఎస్ తేల్చి చెప్పారు. ఇపుడు నిమ్మగడ్డ ఏం చేస్తారో చూడాలి.
ఇక్కడే కథ రస కందాయంలో పడింది. నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. ప్రభుత్వ విజ్ఞప్తిని నిమ్మగడ్డ లెక్కచేయడం లేదు. నోటిఫికేషన్ మాత్రం జారీ చేశారు. మరి ప్రభుత్వ సిబ్బంది ఎన్నికలకు సహకరిస్తారా ? సహకరించరా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కమీషనర్ గా నిమ్మగడ్డ కు కొన్ని అధికారాలు సంక్రమిస్తాయి. ఉద్యోగులు .. అధికారులు ఆయన పరిధిలోకి వస్తారు. ఆయన చెప్పినట్టే పనిచేయాలి. నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చేయాలి. అయితే వాతావరణం చూస్తుంటే అందుకు భిన్నంగా కనబడుతోంది. నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకునే అవకాశాలు లేవు.ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ ఏంచేస్తారు ?అందరిని సస్పెండ్ చేసి పడేస్తారా?
ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనడంపై ఉద్యోగుల వైఖరి ఎలా ఉందనేది తేలాలి. ఉద్యోగ సంఘాల నేతలు మటుకు ఎన్నికల్లో పాల్గొనడం పట్ల సుముఖం గా లేరు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వైఖరే కీలకం కానుంది. వారి నిర్ణయం ఎలాఉంటుందో చూడాలి. ఎన్నికలంటే సుదీర్ఘ విధానం. లక్షలమంది సిబ్బంది సహకారం లేకుంటే సజావుగా సాగదు. కాగా ఇవాళ సాయంత్రం నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు అందరూ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ సూచించారు. ఇక్కడే ప్రభుత్వ సిబ్బంది వైఖరి కొంత మేరకు తేలిపోతుంది. ఇక ఉద్యోగులు .. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు ఎలా స్పందించి తీర్పు ఇస్తుందో సోమవారం కానీ తేలదు. అపుడు కానీ ఎన్నికలపై క్లారిటీ రాదు.
————–KNM