Share price fall……………………………….
రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ తో దేశంలోనే అతిపెద్ద ఐపీవో జారీ చేసి చరిత్ర సృష్టించిన ఎల్ఐ సీ షేర్ల ధర పెరుగుతుందా ?లేదా ? అని ఇన్వెస్టర్లు మధన పడుతున్నారు. కంపెనీ చరిత్ర చూసి షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు షేర్ ధర పతనమౌతున్న తీరు చూసి బెంబేలెత్తి పోతున్నారు.
ఇటీవల కాలంలో వరుసగా ఎల్సీ షేర్ల ధరలు దారుణంగా పతనమయ్యాయి. ప్రస్తుతం ఎల్ ఐ సి షేర్లు రూ.690 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ఒక పదిహేను రూపాయల మేరకు ధర పెరిగింది. ఇదే అప్ ట్రెండ్ కొనసాగుతుందా ? ధర మరింత పడుతుందో అర్ధం కాక ఇన్వెస్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పిరియడ్ ముగిసిపోవడంతో అమ్మకాలు మరింత జోరందుకున్నాయి.దీంతో లిస్టింగ్ అయిన మే 17 నాటి నుంచి ఇప్పటివరకు షేర్ వ్యాల్యూ ఏకంగా 30 శాతం మేరకు తగ్గింది. ఏకంగా 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 132,753 కోట్లు) మేర సొమ్ము తుడిచిపెట్టుకుపోవడంతో ఇన్వెస్టర్లు నష్టపోయారు.
దీంతో ఆసియాలో ఈ ఏడాది లిస్టింగ్ అయి అత్యధిక నష్టాలను చవిచూసిన రెండవ కంపెనీగా ఎల్ ఐ సి నిలిచింది. ప్రధమ స్థానంలో దక్షిణ కొరియా కంపెనీ ఎజ్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ ఉంది. ఈ కంపెనీ లిస్టింగ్ నాటి నుంచి ఇప్పటివరకు 30 శాతం మేర పతనమైంది. కాగా ఐపీవో లిస్టింగ్ సమయంలో కూడా ఎల్ఐసీ ఆకట్టుకోలేకపోయింది.
అప్పటి నుంచీ నష్టాల బాటలోనే నడుస్తోంది. ఈ ఏడాది బీఎస్ఈ సెన్సెక్స్ 9 శాతం మేర దిగజారగా ఇంతకు రెండింతలు ఎల్సీ షేర్లు నష్టపోయాయి. ఈ క్రమంలో ఈ షేర్ ధర మరింత పతనం అవుతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
పేలవమైన త్రైమాసిక ఫలితాలు వస్తే మరింత పతనం ఖాయమని బ్రోకింగ్ సంస్థలు అంటున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఈ షేర్లు రాణించే అవకాశాలు లేకపోలేదు. కొత్త ఇన్వెస్టర్లు ఈ షేర్లలో ఇపుడు మదుపు చేయడం కంటే కొంత కాలం వేచి చూడటం మంచిది. షేర్ హోల్డర్లు మరికొన్నిషేర్లు కొనుగోలు చేసి ధరను యావరేజ్ చేసుకోవచ్చు.