What is the charm in the life style of Naga saints? …………….
వారంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మెరైన్ బయోలాజిక్స్, మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు , ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు చదివినావారే. వీరంతా నాగ సాధువులు గా మారుతున్నారు. ఈ కుంభమేళా సమయంలో యువకులు ప్రయాగ తదితర ప్రాంతాల్లో నాగా సాధు పెద్దలను కలసి సాధువుల్లో చేరిపోతున్నారు.
మహాకుంభ్-2025 సందర్భంగా పురాతన హిందూ అఖాడాల ద్వారా దాదాపు 12,000 మంది నాగ సాధువులు గా మారారని సమాచారం. కుంభ మేళాకు ముందు గా మూడు రోజుల ఆధ్యాత్మిక తపస్సు పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి కొత్త సాధువులను చేర్చుకున్నారు. జునా, నిరంజని, మహానిర్వాణి అకడాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
నాగ సాధువు గా మారాలనుకునే వ్యక్తుల పూర్తి వివరాలను అకడా పెద్దలు నిశితంగా పరిశీలిస్తారు. పూజలు, మతపరమైన పనుల పట్ల పూర్తి అంకితభావంతో ఉన్నారని భావించిన తర్వాతనే నాగ సాధువుగా మారే క్రతువు మొదలవుతుంది. ఈ ఏడాది మౌని అమావాస్య స్నానోత్సవం జనవరి 29న కాబట్టి జనవరి 27 నుంచి అకడాలలో ఆచారాలు ప్రారంభమవుతాయి.
సంప్రదాయం ప్రకారం మొదటి రోజు అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాధువులుగా దీక్షలు చేసి నాగులుగా మారబోతున్న వారిని గురువుల ఎదుట హాజరు పరుస్తారు. ఈ క్రమంలోనే గురువులు నాగసాధు జీవన శైలి గురించి వివరిస్తారు. కుంభ మేళాకు ముందు కూడా ఈ విధానాన్ని అనుసరించారు.
ఇలా సాధువులుగా మారే వాళ్లలో హిందువులు మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే.ఇందులో ముస్లిం, క్రిస్టియన్,ఇతర కమ్యూనిటీలకు చెందిన యువత కూడా ఉంటున్నారు. ఉక్రెయిన్ , మలేషియా దేశాల నుంచి కూడా వచ్చి మరీ ఇలా సాధువులుగా మారిపోతున్నారు.
సాధువుగా మారాలంటే వారి భవబంధాలు, ప్రేమానురాగాలు, బంధుత్వాలను వదిలిపెట్టాలి.అలా వచ్చిన వారినే సాధువుగా మారుస్తున్నారు. ఒకసారి సాధువుగా మారాక వారు కామ, క్రోధ,మద, మాత్సర్యాలకు దూరంగా ఉండాల్సిందే. సన్యాసం స్వీకరించాక వారు హిమాలయాలు, అడవులు ,గుడులు, గోపురాల వెంటే ఉంటూ జీవితాంతం భగవంతుడి ధ్యాసలో బతకాల్సి ఉంటుంది.
దిగంబరంగా ఉండాలి .. తిరగాలి .. భిక్ష కు వెళ్ళాలి .. దొరికితే తినాలి .. లేదంటే గాలి నే భోం చేయాలి. చలికి, ఎండకు, వానకు చలించకూడదు. అంత కష్ట పడాలి. ఇన్నికష్టాలు ఉంటాయని తెలిసినా పెద్ద సంఖ్యలో చదువుకున్న వారు.. ఉద్యోగులు సాధువులుగా మారిపోతున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఉద్యోగం లో ఒత్తిడి , కుటుంబ సమస్యలు, ప్రేమలో పడి మోస పోవడం ,బిజీ లైఫ్లో ఇమడలేక యువకులు ఇలా సాధువులుగా మారిపోతున్నారు. యువత ఆధునిక పోకడలకు అలవాటు పడి .. అవి నెరవేర్చుకోలేక అశాంతి కి గురవుతున్నారు. వేగాన్ని అందుకోలేకపోవడం.. ఫ్యామిలీ గొడవలు భరించలేకపోతున్నారు.
గతం లో మాదిరి ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం.. ధైర్యం చెప్పే అమ్మమ్మ, తాతయ్యలు లేకపోవడం.. ఎవరికీ వారే యమునా తీరే తరహా జీవితాలను తట్టుకోలేక సన్యాసం వైపు ఆకర్షితులవుతున్నారు.ఎక్కడో పుట్టి ..మరెక్కడో పెరిగి చివరకు సాధువులుగా మారడానికి ఇండియాకు వస్తున్నారు.
ఇలా వస్తోన్న వారి వయసు 18 నుంచి 30 లోపు ఉంటోంది. వందలు, వేలల్లో వచ్చి పవిత్ర స్నానాలు చేసి .. పిండ ప్రదానాలు కావించి . వారి అంత్యక్రియలు వారే చేసుకుని సాధువుల్లో కలుస్తున్నారు. రాత్రంతా జరిగే అగ్నిపూజల్లో పాల్గొని సన్యాసం స్వీకరిస్తున్నారు.
ఎప్పుడైతే అఖిల భారతీయ అకడా పరిషత్ వారిని ఆమోదిస్తుందో.. అప్పటి నుంచి వారి జీవితం.. చాలా కఠినంగా మారుతుంది. అప్పటికే ఉన్న నాగసాధువులు కొత్తగా నాగసాధువులుగా మారిన వారిని సంవత్సరాల పాటు పరీక్షిస్తారు.
వారు నాగ సాధువులుగా ఉండ గలుగుతారా, కేవలం ఏదో జీవితంపై విసుగుతో వచ్చారా లేక ఎప్పటికీ ఉండగలుగుతారా? అని టెస్ట్ చేస్తారు. అందులో ఉత్తీర్ణులు అయితేనే నాగసాధువులుగా కొనసాగుతారు. గతంలో కొందరు ఉండలేక తిరిగి వచ్చినవారు కూడా ఉన్నారు.
దేశంలో 4 లక్షలకు పైగా నమోదిత నాగ సాధువులు ఉన్నారు. ప్రతి ఏటా వేలల్లో ఈ సమూహాల్లోకి చేరుతున్నారు.. ఏదైతేనేం మొత్తం మీద సాధువుల సంఖ్య పెరుగుతోంది. అక్షత్ గుప్తా అనే వ్యక్తి కొన్నాళ్లుగా నాగసాధువుల జీవన శైలిని పరిశీలించి ‘నాగా వారియర్స్’ పుస్తకం కూడా రాశారు.
————–K.N.MURTHY