ఎవరీ హరిసింగ్ నల్వా ? ( part 3 )

Sharing is Caring...

श्रीनिवास कृष्णः(Srinivasa Krishna Patil) ………………………..  

హరిసింగ్ ప్రతిరోజూ ఉదయమే షాహిబాగ్ కు వచ్చి ఏకాంతంలో జపజీ సాహిబ్ ను భక్తిశ్రద్ధలతో పఠిస్తాడు. ఆ సమయంలో ఒకరిద్దరు సైనికులు కొంత దూరంగా ఉంటారే తప్ప మరెవరూ ఉండరు. ఆ తరువాత అక్కడకు వచ్చిన పౌరులు ఎవరైనా తనతో మాట్లాడదలిస్తే వారితో కొంతసేపు ముచ్చటిస్తాడు. ఈ విషయం తెలిసిన కమాల్ ఖాన్ సరిగ్గా అటువంటి హరిసింగ్ అలవాటునే తన కోర్కె నెరవేర్చుకునేందుకు తగిన ఉపాయంగా మలచుకుందామనుకున్నాడు. ఆవిధంగా అతడి ధర్మతత్పరతనే అతడి బలహీనతగా మార్చి దెబ్బ కొట్టాలని అతడు భావించాడు. ఒక రోజు హరిసింగ్ ప్రజలను కలుసుకునే సమయానికి నూర్ భాను అక్కడకు వెళ్లేలా ఏర్పాటు చేశాడు.

హరిసింగ్ ప్రజలను కలుసుకునే స్థానానికి వచ్చాడు. ఆజానుబాహుడైన అతడి దేహం క్షత్రియోచితంగా అమితబలాఢ్యమై అలరారుతోంది. అతడు పిడికిలి బిగించి కొడితే ఎంతటి కఠినమైన పాషాణశిల అయినా ముక్కలు కావలసిందే అనిపిస్తుంది. ప్రసన్నమైన అతని ముఖం దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. “సూర్యసింగ్, ఈ రోజు వచ్చినవారిని తీసుకురా” అన్నాడు హరిసింగ్ అక్కడ ఉన్న తన అనుచరునితో.“ఈరోజు ఒక్కరే వచ్చారు” అని తెలిపాడు సూర్యసింగ్. “సరే. తీసుకురా”. ఒక్క నిమిషంలో తన ముందుకు వచ్చి కొంత దూరంలో నిలబడిన వ్యక్తిని చూశాడు హరిసింగ్. ముదురు నీలం రంగు దుస్తులలో మేలిముసుగు కప్పుకుని వచ్చిన ఒక యువతి. ఆమె ముఖం కనబడటం లేదు.మొట్ట మొదటసారి హరిసింగ్ ను ప్రత్యక్షంగా చూసిన నూర్ భాను పరవశురాలైపోయింది.తాను ఊహించుకున్న దానికంటె నూరింతలు గొప్పగా ఉన్నాడు.ఒక స్త్రీ ఒంటరిగా ఏదో చెప్పుకోవాలని వచ్చిందంటే ఆమె నిస్సహాయురాలై ఉంటుందని, చాల చిక్కులలో ఉండి ఉంటుందని భావించి హరిసింగ్ మనసులోనే వ్యాకులత చెందాడు. “కూర్చోండమ్మా” అన్నాడు ఎంతో దయాపూర్ణమైన కంఠంతో.నూర్ భాను కు అమ్మా అనే ఆ పిలుపు కర్ణకఠోరంగా వినిపించింది.

ఇలా ఆమెను మా అంటూ సంబోధించినవారు అంతవరకూ ఎవరూ లేరు. అటువంటిది తాను ఎవరిని తన ప్రియునిగా భావిస్తూ ఉన్నదో ఆ వ్యక్తి తనను అమ్మా అని పిలవడం ఆమెకు ఎంతో కష్టమనిపించింది. “కూర్చోండమ్మా” అని మరోసారి అన్నాడు హరిసింగ్.మరోసారి మరోసారి అమ్మా అని పిలిపించుకొనడం ఇష్టం లేక నూర్ భాను తటాలున కూర్చుంది. అయితే అక్కడున్న శిలాసనం మీద కాకుండా నేలపై తన మోకాళ్లమీద కూర్చుంది. వెంటనే హరిసింగ్ లేచి నిలుచున్నాడు. “అమ్మా, మీరు ఇంత దీనంగా ఉండకండి, గురు సేవకుడూ రాజా రంజిత్ సింగ్ ఆజ్ఞాపాలకుడూ అయిన ఈ హరిసింగ్ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాడు. మీకు వచ్చిన ఎటువంటి కష్టాన్నైనా నేను తొలగిస్తాను. భయపడకుండా నేను మీకు ఏమి చేయగలనో చెప్పండమ్మా” అన్నాడు.హరిసింగ్ నోటినుండి వెలువడుతున్న అమ్మా అనే పదం మాటిమాటికి ములుకుల్లా గుచ్చుకుంటూ ఉండగా నూర్ భాను ఏమీ మట్లాడలేక పోయింది.ఆమె ఎంతకూ తన మౌనాన్ని వీడి మాట్లాడకపోవడంతో తన కష్టాన్ని ఇతరుల ముందు చెప్పుకునేందుకు ఆమె సంకోచిస్తున్నదేమో అనే భావించి హరిసింగ్ సూర్యసింగును కాస్త దూరంగా పొమ్మని సంజ్ఞ చేశాడు. సూర్యసింగ్ దూరంగా పోయాడు. కాని, మరీ దూరంగా కాదు. ఎవరైనా శత్రువు తన ప్రభువుకు అపకారం తలపెట్టే ఉద్దేశంతో మారువేషంలో వచ్చివుంటే, ఏమైనా ద్రోహం తలపెట్టదలిస్తే మెరుపులా అడ్డుపడి అతడి తలను ఒక్క వేటుతో ఎగురగొట్టగలిగినంత దూరంలోనే అప్రమత్తంగా ఉన్నాడు.

“చెప్పండమ్మా” అన్నాడు హరిసింగ్ మృదువుగా. “మీకు వచ్చిన కష్టం ఎటువంటిదైనా శాయశక్తులా తీరుస్తాను. ఆ కష్టాన్ని తీర్చలేకుంటే పెషావర్ పాలకుడనే ఈ పదవి నాకు తృణప్రాయమైనది. తక్షణమే వదులుకుంటాను” అన్నాడు. తాను ఆమె కోర్కెను తీర్చలేమోననే సందేహంతో ఆమె మాట్లాడటానికి సంశయిస్తుందేమోనని అతడు భావించాడు. ఆ మాటలతో నూర్ భాను చలించిపోయింది. తన తండ్రి, ఇతర బంధువులు పదవీకాంక్షతోనే నిత్యం యుద్ధాలలో నిమగ్నమై నరమేధం చేస్తున్నారు. ఎంతోమందిని చిత్రహింసల పాలు చేస్తున్నారు. ఎన్నడూ కూడా మనసా వాచా కర్మణా హరిసింగ్ వంటి ప్రశాంతుడైన ఒక్క మనిషిని కూడా తాను చూచి ఎరుగదు.
అంతవరకూ ఆమె ఊహాప్రపంచంలో హరిసింగ్ ఒక పురుషుడు, తాను ఒక స్త్రీ. అంతే. కాని, ఇప్పుడు హరిసింగ్ సమక్షానికి వచ్చాక, కేవలం ఒకటి రెండు మాటలలోనే అతడి మహోన్నత వ్యక్తిత్వం అర్థమైనాక ఆమెకు అతడు భగవత్స్వరూపంలా తోచాడు. అతడి పట్ల భక్తిభావం పెరిగింది. కానీ… కానీ… “నీవు హరిసింగును కాకుండా ఇంకెవరిని నిఖా చేసుకున్నా దోస్త్ మహమ్మద్ ఖాన్ అతడిని చంపేసి నిన్ను ఎత్తుకుపోతాడు” అని తండ్రి చెప్పిన మాట గుర్తుకు రాగానే ఆమె భయంతో వణికి పోయింది. నెమ్మదిగా నోరు విప్పి అస్పష్టంగా చెప్పింది. “నాకు కుమారుడు కావాలి.” విని వినిపించకుండా ఆమె పలికిన మాటలు హరిసింగుకు అర్థం కాలేదు. “ఏమన్నారమ్మా?” అని స్పష్టత కోసం మరలా అడిగాడు.“నేను మీవంటి కుమారుని కోరుతున్నాను” అన్నది నూర్ భాను నెమ్మదిగా, స్పష్టంగా.

ఆ మాటలు విని హరిసింగ్ ఒక్క క్షణం మౌనం వహించాడు. ఆ మాటలకు అర్థం ఏమిటో అతడికి తెలుసును. ఒక ప్రియురాలు తనను పెండ్లాడమని తన ప్రియుడిని అడిగే సందర్భంలో ఆ విధంగా పలుకడం ఆ ప్రాంతంలో ఒక వాడుక. హరిసింగ్ ఎటువంటి బదులూ పలుకకపోయేసరికి నూర్ భాను నెమ్మదిగా తల ఎత్తి అతడి వైపు చూసింది. హరిసింగ్ మునుపటిలాగానే నిశ్చలంగా ఉన్నాడు. ఆమె మాటలు విన్న తరువాత కూడా అతడి మనస్సు వదనం రెండూ ప్రశాంతంగానే ఉన్నాయి. దూరంగా ఉద్యానంలో ఉన్న ఎత్తైన వృక్షాగ్రభాగాన్ని తదేకంగా చూస్తున్నాడు.అతని నిశ్చలత ఆమెకు కొంత భయం కలిగించింది. హరిసింగ్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. వెంటనే ఆమె తన మేలిముసుగును తొలగించింది. “నీ అందానికి ఏ మగవాడైనా బానిస కాక తప్పదు” అని ఆమె తల్లిదండ్రులు ఆమెకు బాగా తలకెక్కించి పంపించారు. ఆ మాటలను నమ్మిన ఆ అమాయికురాలు వారి బోధనల ప్రకారమే ఆ విధంగా తన ముఖారవిందాన్ని తనవాడనుకున్న పురుషునికి చూపే ప్రయత్నం చేసింది. ఒకే ఒక్క క్షణం ఆమె ముఖాన్ని చూసిన హరిసింగ్ వెంటనే మరలా తలను పక్కకు తిప్పుకున్నాడు. హరిసింగ్ చర్య నూర్ భానుకు శరాఘాతంలా తోచింది.

ఆమె కండ్లలో నీళ్లు పెల్లుబికాయి. కంఠం గద్గదమైపోగా “ప్రభుజీ” అని అతి కష్టంగా పలికింది.ఆమె కంఠంలోని ఆర్తిని హరిసింగ్ గుర్తుపట్టగలిగాడు. ఈసారి తలతిప్పి ఆమెను భక్తి ఉట్టిపడుతుండగా చూశాడు. తాను కూడా నెమ్మదిగా మోకాళ్లమీద కూర్చున్నాడు. మరలా అలాగే ఆమెను సంబోధించాడు – “అమ్మా” అని. “అమ్మా, నావంటి కుమారుడు ఎందుకమ్మా? ఇంతటివాడిని మీ ఎదురుగా నేనున్నాను. నన్నే మీ కుమారునిగా భావించండి. మిమ్మల్ని నేను నా మాతృమూర్తిగా భావిస్తున్నాను. మీ కుమారునిగా స్వీకరించండి” అన్నాడు రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ. ఆమె ఈ మాటలు విని కంపించిపోయింది. ఎంతటి మహోన్నతమూర్తి ఇతడు? ఇతడి చెంతకు తాను ఎంత హీనమైన కోరికతో వచ్చింది? బేలతనంతో ఆమె కన్నీరు పెట్టుకుంది. గద్గదస్వరంతో ప్రభుజీ అని మాత్రం పలికింది.“అమ్మా, నన్ను ప్రభుజీ అనకండి. నేను పెషావర్ లో అందరికీ ప్రభువును కావచ్చును గాని, మీకు, మా తల్లిగారికి మాత్రం కుమారుడనే. అందువల్ల మా తల్లి లాగా మీరు కూడా నన్ను పుత్తర్ అని పిలవండి. బేటా హరీ అని పిలవండి” అన్నాడు హరిసింగ్. ఎంతో మృదువుగా, దయాపూరితంగా అతడు పలికిన మాటలు వినేసరికి నేను చేయరాని తప్పు చేశాను అని తనను తానే నిందించుకుంటున్న నూర్ భాను మనసులోని అపరాధబావం సమూలంగా తొలగిపోయింది.

జరిగిన విషయం తెలుసుకున్న కమాల్ ఖాన్ హరిసింగ్ అంతటి ఔదార్యవంతుడు అంటే నమ్మలేకపోయాడు. అతడు ఎందరో పర్షియన్ ఆఫ్ఘన్ రాజుల చెంత పని చేశాడు. వారందరూ నరరూప రాక్షసులు, హింసాప్రియులు, పశుప్రవృత్తి కలిగినవారు, డబ్బుకోసం ఆడవాళ్లకోసం ఎంతటి ఘోరానికైనా వెనుదీయని వాళ్లే తప్ప హరిసింగ్ లాంటి వాడు ఒక్కడూ తారసపడలేదు. అతడి ప్రవర్తనను గూర్చి తన కూతురు మాటలు విన్న తరువాత హరిసింగ్ పై అతడికి ఏదో మూల గౌరవం కలిగింది. హిందువులలో ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునిగూర్చి, భీష్ముడు వంటి ఆజన్మబ్రహ్మచారులను గూర్చి వారు విన్నారు గాని, కథలలో తప్ప నిజంగా అటువంటివారు నిజంగా ఉంటారని వారు ఎన్నడూ భావించలేదు. ఇప్పుడు హరిసింగ్ ప్రవర్తన తెలిశాక అటువంటి వ్యక్తి పెషావర్ పాలకుడుగా ఉండటం తమ అదృష్టంగా భావించారు.నూర్ భాను సమాచారాన్ని చారుల ద్వారా తెలుసుకున్న హరిసింగ్ ఆ మరుసటి రోజే కమాల్ ఖానును పిలిపించాడు. నూర్ భానుకు మీరు యోగ్యుడైన ఒక వరుని చూడండి. ఆమె పెండ్లి ఖర్చులన్నీ నేనే ఇస్తాను.కమాల్ ఖాన్ ఈ విషయాన్ని నూర్ భాను తల్లులకు తెలుపగానే వారు ఎంతో సంతోషించారు. హరిసింగ్ అండ ఉండగా దోస్త్ మహమ్మద్ ఖాన్ భయం తమకు ఎంతమాత్రం ఉండదు!

సరిగా రెండు నెలలు తిరిగేసరికి నూర్ భానుకు గొప్ప అందగాడు, వీరుడూ అయిన ఒక పఠాన్ యువకునితో వివాహం జరిగింది. హరిసింగ్ పరివారం మొత్తం ఆ పెండ్లికి హాజరైనారు. పెషావర్ ప్రజలందరూ కమాల్ ఖాను కుటుంబాన్ని రాజ బంధు కుటుంబంగా పరిగణించి గౌరవించసాగారు.తాను అనుకున్నట్లు జరుకగపోయినా, తాను మాత్రం ఎంతో అదృష్టవంతుడినని కమాల్ ఖాన్ సంతోషించాడు. కాని అతడి సంతోషం ఎంతో కాలం నిలబడలేదు. కాబూల్ నుండి ఒక రహస్యదూత వచ్చి కమాల్ ఖాన్ తనకిచ్చిన మాట నిలబెట్టుకోనందుకు గాను అతడికి దోస్త్ మహమ్మద్ ఖాను మరణశిక్ష విధించాడనే సమాచారం అందించాడు. కమాల్ ఖాను నిలువెల్లా వణికిపోయాడు.“హుజూర్, అల్లాకీ కసం. నేను మాట తప్పేవాడిని కాను. నా కూతురు ద్వారా హరిసింగును చంపడానికి చేసిన ప్రయత్నం విఫలం అయినట్లు మీకు అనిపించవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయడం ద్వారా నేను హరిసింగుకు చాలా చేరువ అయ్యాను. అతడు నన్ను ఇపుడు నమ్ముతున్నాడు. కాబట్టి, త్వరలోనే హరిసింగ్ నేను మంచి అవకాశం చూసుకుని ఏదో ఒక విధంగా చంపగలను. నన్ను నమ్మండి” అంటూ మహమ్మద్ ఖానుకు రహస్యసందేశం పంపించాడు.

(తరువాత కథ నాల్గవ భాగంలో…)

Read Also …………………. ఎవరీ హరిసింగ్ నల్వా ? (part 2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!