ఎక్కడిదీ లష్కరే తోయిబా ? దాని మూలాలు ఎక్కడ ?

Sharing is Caring...

History of Lashkar-e-Taiba ………………

లష్కరే తోయిబా..  ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇది. 1980 దశకం చివరలో పాకిస్తాన్‌లో సున్నీ ఇస్లాంలోని వహాబీ శాఖచే ప్రభావితమైన ఇస్లామిక్ సంస్థ. మర్కజ్-ఉద్-దవా-వాల్-ఇర్షాద్  ఉగ్రవాద విభాగంగా ప్రారంభమైంది. జమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతం చేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 

పాకిస్తాన్‌ కేంద్రంగా ఉన్నప్పటికీ, లష్కరే తోయిబా మొదట్లో జమ్మూ కాశ్మీర్‌లో, పాకిస్తాన్-భారత్ సరిహద్దులో కార్యకలాపాలు నిర్వహించింది, కానీ 21వ శతాబ్దం మొదటి నాటికి ఈ సంస్థ భారతదేశంలో తన పరిధిని విస్తరించింది. జమ్మూ కాశ్మీర్‌లో అనేక సాయుధ గ్రూపులను తయారు చేసిందనే ఆరోపణలున్నాయి.

పేద ముస్లిం యువకులను ఆకర్షించి .. వారికి రహస్యంగా శిక్షణ ఇచ్చి .. దాడుల్లో వారిని వినియోగించుకుంటుందని ప్రధాన అభియోగం. కొండలు,కోనలు, అడవుల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. జమ్మూ కాశ్మీర్‌లో పనిచేస్తున్న అతిపెద్ద గ్రూపులలో ఒకటైన లష్కరే తోయిబా, ఈ ప్రాంతంపై నియంత్రణ విషయంలో పాకిస్తాన్‌కు చాలా అనుకూలంగా ఉంది.

ఈ గ్రూపు జమ్మూ కాశ్మీర్ కు రాయితీలు ఇవ్వడాన్ని వ్యతిరేకించింది. ఈ గ్రూప్ నాయకులు భారతదేశం అంతటా ఇస్లామిక్ పాలనను స్థాపించాలని కోరుకుంటున్నారు. ముస్లిం రాజ్యాన్ని సృష్టించే ప్రయత్నంలో జమ్మూ కాశ్మీర్‌లోని ముస్లిమేతర పౌర జనాభాను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు చేసింది. లష్కరే తోయిబా సభ్యుల్లో చాలామంది పాకిస్తానీ, ఆఫ్ఘన్లు ఉన్నారు.

ఈ గ్రూపుకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంతో పాటు సంపన్న సౌదీ తీవ్రవాది, అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌తో సంబంధాలు ఉన్నాయని అంటారు. 1998 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లోని బిన్ లాడెన్ శిక్షణా శిబిరాలపై అమెరికా క్రూయిజ్ క్షిపణులు దాడి చేసినప్పుడు లష్కరే తోయిబా, మరొక ఉగ్రవాద ముస్లిం గ్రూపు హిజ్బుల్-ముజాహిదీన్ నుండి వచ్చిన యోధులు హతమైనారు.

1993లో లష్కరే తోయిబా జమ్మూ కాశ్మీర్‌లోకి తొలిసారిగా చొరబడింది. 1990 దశకం చివర్లో లష్కరే తోయిబా పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థల నుండి నిధులు పొందిందని ఆరోపణలు వచ్చాయి, ఆ ఆరోపణను పాక్  ప్రభుత్వం ఖండించింది.ముస్లింలు కాని వారు పెద్ద సంఖ్యలో ఉన్న జమ్మూ ప్రాంతంలో ఈ బృందం పని చేస్తున్నది.హిజ్బుల్-ముజాహిదీన్‌తో కలిసి పనిచేస్తూ, లష్కరే తోయిబా హిందువులు, సిక్కులపై దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించింది.

లష్కరే తోయిబా దాడులు తరచుగా పౌరులను లక్ష్యంగా చేసుకునేవి. 1999 నుండి, లష్కరే తోయిబా భారత భద్రతా దళాలపై వరుస ఆత్మాహుతి దాడులను నిర్వహించింది. తరచుగా సురక్షితమైన ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంది. అటువంటి దాడులలో, లష్కరే తోయిబా దళాలు సంఖ్యాపరంగా తక్కువగా ఉండటంతో  పోలీసు దళాలు చివరికి వారిని హతమార్చాయి. 

నవంబర్ 2008 లో ముంబైలోదాడులు జరిగాయి, ఈ దాడులలో సుమారు 164 మంది మరణించారు.వందలాది మంది గాయపడ్డారు. జూలై 2006లో బహుళ ముంబై కమ్యూటర్ రైళ్లపై దాడి జరిగింది. డిసెంబర్ 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ దాడుల వెనుక లష్కరే తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ సంస్థల హస్తముంది. 

అక్టోబర్ 2005లో న్యూఢిల్లీ లో , డిసెంబర్ 2005లో బెంగళూరులో జరిగిన దాడులలో కూడా ఈ సంస్థల పాత్ర ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇతర ఆసియా దేశాలలో కూడా లష్కరే తోయిబా చురుగ్గా పనిచేస్తున్నది. దీనికి జెమా ఇస్లామియా తో సంబంధాలు ఉన్నాయి. తన ఫ్రంట్ ఆర్గనైజేషన్ జమాత్-ఉద్-దావా (జెయుడి) ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరిస్తోంది.   

పలు సందర్భాలలో అనేక విధాలుగా అల్-ఖైదాకు మద్దతు ఇచ్చింది. డాన్ దావూద్ ఇబ్రహీం, రివైవల్ ఆఫ్ ఇస్లామిక్ హెరిటేజ్ సొసైటీ, మరికొన్ని సంస్థలు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నాయి.

కాశ్మీర్ లో JKLF, అల్లా టైగర్స్, పీపుల్స్ లీగ్, హిజ్బ్-ఐ-ఇస్లామియా,హర్కత్-ఉల్-జిహాద్-ఎ-ఇస్లామీ,అల్-బదర్,పీపుల్స్ లీగ్, వహ్దత్-ఇ-ఇస్లాం వంటి సంస్థలు ఎన్నో పని చేస్తున్నాయి.. వీటికి నిధులు లష్కరే తోయిబా అందిస్తున్నదని అంటారు. ఇక  లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్ బతికే ఉన్నాడు.

ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో పాకిస్తాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఉగ్రవాద సంస్థలకు నిధులకు సమకూర్చిన అనేక కేసుల్లో ఆయన దోషి.అనేక దాడుల్లో కూడా ఆయన పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. హఫీజ్ కుమారుడు తల్హా సయీద్ లష్కరే తోయిబా సెకండ్-ఇన్-కమాండ్‌గా పనిచేస్తున్నాడు.

సంస్థ ఆర్థిక వ్యవహారాలను అతనే చూస్తుంటాడు. 2019లో, లాహోర్‌లో తల్హా సయీద్ పై బాంబు దాడి జరిగింది కానీ తప్పించుకున్నాడు. తల్హా సయీద్  కింద మరికొంతమంది కమాండర్స్ పని చేస్తున్నారు.వీరి సంచారం అంతా చాలా రహస్యంగా సాగుతుంది.    

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!