Damages with atomic bomb…………………………..
అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాలతో భారీ వినాశనాన్ని సృష్టించవచ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అణ్వాయుధం సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోటనం చెందింది.. స్థానిక వాతావరణం ఎలా ఉందన్న అంశాలపై ఆ బాంబు ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
న్యూక్లియర్ వెపన్స్ను కిలో టన్నుల్లో కొలుస్తారు. వంద కిలోటన్నుల అణు బాంబు పేలితే .. ఆ పరిసరాల్లో దాదాపు 1.8 కిలోమీటర్ల దూరం వరకు పూర్తిగా నాశనమవుతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చు. ఇక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు నష్టం తీవ్రంగా ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరం వరకు భారీ నష్టం ఉంటుంది.
బాంబు పడిన ప్రదేశం నుంచి 8 కిలోమీటర్ల రేంజ్ వరకు ఏదో ఒక నష్టం తప్పదు. బాంబు పడిన ప్రదేశాన్ని అగ్నిగోళంతో పోలుస్తారు. ఆ ప్రదేశంలో ఉన్న భవనాలు… వస్తువులు మాడి మసై పోతాయి. బాంబు ప్రభావంతో ప్రజలు కూడా కాలి పోతారు. పేలుడు తీవ్రతతో ఆ ప్రాంతంలో మనుషులు చనిపోతారు. కొద్దీ మంది మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది.
బలమైన షాక్వేవ్లు భవనాలను ధ్వంసం చేస్తాయి.. భవనం తాలూకు శిథిలాలు ఎగిరి మనుష్యులకు గాయాలు అవుతాయి..ఒక్కోసారి మరణాలకు దారితీస్తాయి. అణుబాంబుల వల్ల రేడియేషన్ విడుదల అవుతుంది. దీంతో మానవ శరీర కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
పేలుడు నుండి వచ్చే తీవ్రమైన వేడి వలన శరీరం పై గాయాలు అవుతాయి. బొబ్బలు వస్తాయి. ఒళ్ళంతా మంటలు వస్తాయి. రేడియేషన్ వల్ల సిక్నెస్ ఏర్పడుతుంది. ఎలక్ట్రోమ్యాగ్నిటిక్ పల్స్ వల్ల.. బాంబు పేలిన ప్రదేశం నుంచి చాలా దూరం వరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులన్నీ పాడైపోతాయి.
బాంబు పేలిన 15 నిమిషాల తర్వాత నేలపై రాలి పడే బూడిద, మట్టి వల్ల కూడా తీవ్రమైన అస్వస్థత కలుగుతుంది.రేడియేషన్ ప్రభావంతో బతికి ఉన్నవారికి వివిధ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వారి సంతానంపై కూడా ప్రభావం చూపుతుంది.
అణ్వాయుధాలు రేడియో ధార్మిక పదార్థాలతో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, నేల, నీరు, వృక్షసంపదను ప్రభావితం చేస్తాయి. చిన్నసైజు వార్హెడ్ పేలినా కూడా భారీ నష్టం జరిగే ప్రమాదం జరుగుతుంది. ప్రాణహాని ఎక్కువగా ఉంటుంది. వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై పడిన అణు బాంబు బరువు 15 కిలో టన్నులు. ఆ బాంబు వల్ల లక్షా 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం రష్యా, నాటో దేశాల వద్ద వెయ్యి కిలో టన్నుల బరువున్న అణు బాంబులు ఉన్నాయి. అణు బాంబు పడిన చోట మనుషులు బ్రతికే అవకాశం తక్కువ.
అన్ని అణు బాంబులు అణ్వాయుధాలే అయినప్పటికీ, అన్ని అణ్వాయుధాలు అణు బాంబులు కావు. అణు బాంబులు వాటి పేలుడు శక్తి కోసం పూర్తిగా అణు విచ్ఛిత్తి (అణువుల విభజన)పై ఆధారపడతాయి. దీనికి విరుద్ధంగా, అణ్వాయుధాలలో హైడ్రోజన్ బాంబులు కూడా ఉండవచ్చు, ఇవి అణు సంలీనం (అణువుల కలయిక)ను ఉపయోగిస్తాయి. అణు బాంబుల కంటే చాలా శక్తివంతమైనవి కావచ్చు.
కాగా అణ్వాయుధాల వ్యాప్తిని, యుద్ధాన్ని నివారించాలని చైనా, రష్యా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ గతంలో ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ ఐదు దేశాల ఉమ్మడి ప్రకటనను రష్యా నే ప్రకటించింది. భారతదేశం వద్ద 180 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. దీంతో భారతదేశం ప్రపంచంలోని టాప్ 9 అణ్వాయుధ దేశాలలో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్ వద్ద దాదాపు 170 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా.