తెలంగాణ ప్రజలను బెంబేలెత్తించిన వార్తాపత్రిక !

Sharing is Caring...

People were trembling…………………………..

సరిగ్గా నలభయి అయిదేళ్ల క్రితం ఆ పత్రిక  ప్రచురించిన వార్తా కథనాలతో తెలంగాణా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మిగతా పత్రికలు కూడా అలాంటి వార్తలు ఇచ్చాయి కానీ ఆ పత్రిక మాదిరిగా అదే పనిగా రోజూ వండి వార్చలేదు. అప్పట్లో సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే ఆ పత్రిక  ఆ భయానక వార్తా కథనాలను ప్రచురించిందని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇంతకూ అసలు కథలోకి వెళితే ..  

1979 జూలై 11 న స్కైలాబ్  భూవాతావరణం లోకి ప్రవేశించి విచ్ఛిన్నమైంది. దాని శకలాలు హిందూ మహా సముద్రం లోను, పశ్చిమా ఆస్ట్రేలియా లోనూ పడ్డాయి. ఈ ఘటనకు కొంత కాలం ముందు స్కైలాబ్ నియంత్రణ కోల్పోయి గతి తప్పిందనే వార్తలు వెలువడ్డాయి. అప్పట్లో స్కైలాబ్ అంటే ఏమిటో కూడా చాలామందికి తెలీదు. ఏవో ఉల్కలు రాలిపడతాయని అనుకునే వారు.

ఆ స్కైలాబ్ అంతరిక్ష పరిశోధక నౌక అని …  అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ దాన్ని ప్రయోగించిందని  కొద్దీ మంది చదువుకున్నవారికి తెల్సు. అప్పట్లో ప్రచార సాధనాలు పెద్దగా లేవు. హైదరాబాద్ నగరంలో ఒకటి అరా పత్రికలు ఉండేవి. వాటికి కూడా అంత సర్క్యులేషన్ ఉండేది కాదు. చిన్న పట్టణాల్లో .. పల్లెల్లో ఉండే వారు ఎక్కువగా రేడియో వార్తలు వినేవారు. అందరికి కూడా రేడియోలు ఉండేవి కావు.

ఆ నేపథ్యంలో  ‘స్కైలాబ్’ తెలుగు ప్రజలను మూడు వారాల పాటు భయపెట్టింది. ఈ స్కైలాబ్ వలన భూమి కి భారీ నష్టం కలుగుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన పడ్డారు. అది భూమి పై పడితే మహాప్రళయమే సంభవిస్తుందని ప్రజలు ఇవే చివరి రోజులని బెంబేలెత్తి పోయారు.  

ఆల్ ఇండియా రేడియో , ఇండియన్ ఎక్స్ ప్రెస్, హిందూ, ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక వంటి డైలీ పేపర్లు  ప్రజలను మరీ భయపెట్టకుండా కొంత జాగ్రత్తగా ఉండాలని వార్తలు అందించాయి.అప్పట్లో దూకుడు మీదున్న ఆపత్రిక మాత్రం ఊదరగొట్టేలా వార్తలు ప్రచురించేది.

(కొన్నాళ్ల క్రితం కరోనా వార్తల గురించి మీడియా ఎలా ఊదర గొట్టిందో అలా అన్నమాట ) ఈ వార్తలు ఆనోటా ఈ నోటా పడి ప్రచారం తీవ్ర స్థాయిలో సాగింది. ప్రజలు భీతిల్లి పోయారు. అప్పటికే నిపుణులు స్కై లాబ్ ను సముద్రం లో కూల్చే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. కానీ ఆ విషయం జనాలకు ఆలస్యంగా చేరింది.

స్కైలాబ్ భూమిని ఢీకొంటుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇక చావు దగ్గర పడిందని జనాల్లో విషాదం అలుముకుంది. నిద్రలేని రాత్రిళ్ళు అలవాటు అయ్యాయి. తెలంగాణ మొత్తం స్కైలాబ్ బారిన పడనుందని ప్రచారం ముమ్మరం కావడంతో ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  

బ్రహ్మం గారు మాట నిజం కాబోతుందని మరి కొంతమంది ప్రచారం మొదలు పెట్టారు. అదే సమయంలో తెలంగాణా లోని నిజామాబాద్ మొదలు తీరం వరకు ఎక్కడైనా స్కైలాబ్ కూలిపోవచ్చని వెలువడిన కొత్త వార్త జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

చివరకు ఈ ప్రచారం అంతా వట్టిదే అని తేలిపోయింది. 1979 జూలై 11 న స్కై లాబ్ భూ కక్ష్య లోకి ప్రవేశించి పగిలి ముక్కలైంది. దాని శకలాలు హిందూ మహా సముద్రం లోను, పశ్చిమా ఆస్ట్రేలియా లోనూ పడ్డాయి. తెలంగాణ  ప్రజలు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ పత్రిక మాత్రం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఇంతకూ ఆ పత్రిక ఏదో కాదు ‘ఈనాడు’.

తెలంగాణ సంగతి అలా ఉంటే  స్కైలాబ్ ప్రభావం అప్పట్లో ఆంధ్రా పైన కూడా పడింది. ఆంధ్రా ప్రజలు కూడా భయపడిపోయారు. బతికుంటే బలుసాకు తిని అయినా బతకవచ్చని ఇళ్ళు వాకిళ్లు కూడా అమ్ముకుని వెళ్లారట.

కొంతమంది మాత్రమే ధైర్యంగా ఉన్నారు. ప్రజలకు ఆందోళన పడవద్దని చెప్పిన వారు ఎవరూ లేరు.ఇందులో మౌత్ పబ్లిసిటీ పాత్ర కూడా ఉంది.దేశంలోని మరికొన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఆందోళనకు గురయ్యేరు.  

 

———KNMURTHY 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!