నాటి నేతల తీరే వేరు కదా!

Sharing is Caring...
Paresh Turlapati …………………… 

” సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట. ” ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి . ” ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి ” మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం..ఏర్పాట్లు చూడండి “..అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి.

” సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా ” ? నసిగాడు కార్యదర్శి. 
వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ ” నిక్షేపంగా ” అన్నారు.
ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ.. అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది..రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు.

సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి ? అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు..కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా..అదీ ఆయన మాటల్లోనే..

“1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా..1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది..డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు..ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు..

ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా వెళ్లాలని ఫోన్ లో కోరారు.. చివరగా ఆయన ఒక మాట చెపుతూ ” అటల్ జీ..ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి “..అని చెప్పారు.ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే.నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే ” అని రాసుకున్నారాయన.  

ఇక రాజీవ్ గాంధీ తల్లి ఇందిరా గాంధీ కూడా వాజపేయి ని  అమితంగా గౌరవించేవారు. దేశ పాలనా వ్యవహారాలలో ఆయన్ని సంప్రదించేవారు. వాజపేయి జాతి ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. సుదీర్ఘకాల ప్రతిపక్షనేతగా ఉన్న వాజపేయి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. 

అయితే తరచు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆ అప్రజాస్వామిక చర్యను వాజపేయి తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాడారు. ఎమర్జెన్సీ అనంతరం మొరార్జీ దేశాయి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా పని చేసినప్పుడు ప్రపంచ నేతల, ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నాయకుల గౌరవాదరాలు వాజపేయికి విశేషంగా లభించాయి.

ఇరుగు పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను సుస్థిరపరచడానికి ఆయన చేసిన కృషి ఇప్పటికీ స్ఫూర్తిదాయకం. తదనంతర కాలంలో ప్రధానమంత్రిగా ఆయన పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడించాయి.వాజపేయి ప్రతిపక్ష నేతలతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. ఎంతైనా ఆరోజులు … నేతల తీరు వేరేగా ఉండేవి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!