రష్యా ఉక్రెయిన్ లోని అణువిద్యుత్ కేంద్రంపై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంత హై డ్రామా తర్వాత పెను విపత్తు తప్పింది. అసలు ఏమి జరిగిందంటే ?? ఉక్రెయిన్పై తొమ్మిదోరోజూ కూడా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా సేనలు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు జారవిడిచాయి.
ఈ విద్యుత్ కేంద్రం రాజధాని కీవ్ కి ఆగ్నేయంగా 550 కి.మీ (342 మైళ్ళు) దూరంలో ఉంది. ఇది యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం. ఈ జెపోరిషియా అణువిద్యుత్ కేంద్రం పై రష్యా బలగాలు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఈ దాడులతో విద్యుత్ కేంద్రం శిక్షణ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి.
ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. అంతకుముందు కొంత హై డ్రామా నడిచింది. అమెరికా అధ్యక్షుడు బిడెన్ అణువిద్యుత్ కేంద్రం జోలికి వెళ్లవద్దని పుతిన్ ను రిక్వెస్ట్ చేశారు. రష్యా సేనలు కూడా ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది ని లోపలికి అనుమతించలేదు. ఎట్టకేలకు రష్యా సేనలు వెనక్కి తగ్గడంతో పెను విపత్తు తప్పింది.
ఈ అణువిద్యుత్ కేంద్రం రియాక్టర్ పేలితే చెర్నోబిల్ పేలుడు కంటే పదిరెట్లు భారీ నష్టం జరిగేది కాగా అణువిద్యుత్ కేంద్రంలో అత్యవసర పరికరాలు నాశనం కాలేదు. ప్లాంటు సురక్షితంగానే ఉందని అక్కడి డైరెక్టర్ చెప్పినట్టు రాయిటర్ వార్తాసంస్థ ధృవీకరించింది.దాడికి ముందు రష్యా దళాలు ఈ విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయి.
ట్యాంకులతో పట్టణంలోకి రష్యా సేనలు అక్కడికి చేరుకొని భయానక పరిస్థితులను సృష్టించాయి. రష్యా తప్ప మరే దేశం అణు విద్యుత్ యూనిట్లపై ఇప్పటివరకు కాల్పులు జరపలేదు. చరిత్రలో ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే రాజధాని కీవ్తో పాటు ఇతర పెద్ద నగరాల్లో పుతిన్ సేనలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్ సేనలు కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. కీవ్ నగరంలోకి రష్యా సైన్యం చొచ్చుకురాకుండా గెరిల్లా దాడులు చేస్తున్నాయి .