పాపం సింఘానియా !

Sharing is Caring...

Is it destiny written?………………………………………..

తల్లిదండ్రులు తమ మరణానంతరం మాత్రమే పిల్లలకు ఆస్తులు ఇచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. అంతేగానీ బతికుండగా ఇవ్వకూడదని ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్‌ పత్‌ సింఘానియా తన ఆత్మకథలో రాసుకున్నారు. బతికుండగానే ఆస్తిపాస్తులు రాసిస్తే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు. ఆస్తుల వ్యవహారంలో ఆయన తన అనుభవాలను పాఠకులతో పంచుకున్నారు.

విజయ్ పత్ ఒక్కరే కాదు .. పిల్లలకు ముందే ఆస్తులు రాసిచ్చి రోడ్డున పడ్డ తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఇదే అంశంపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కథలు.వచ్చాయి. నిత్యం వార్తలు చదువుతుంటాం. అయినా పిల్లలపై ప్రేమతో ఆస్తులు రాసిచ్చి భంగపడిన తల్లిదండ్రులు  దేశ వ్యాప్తంగా వేలల్లో ఉన్నారు.

రేమండ్‌ గ్రూపు సంస్థల మాజీ ఛైర్మన్‌ సింఘానియా తన ఆత్మ కథ ‘ఏన్‌ ఇన్‌ కంప్లీట్‌ లైఫ్‌’లో ఈ మేరకు తన జీవితంలో చోటుచేసుకున్న చేదు అనుభవాలను  వివరించారు. ఈ పుస్తకాన్ని పాన్‌ మాక్‌ మిలన్‌ సంస్థ పబ్లిష్ చేసింది. అంతకు ముందే సింఘానియా పడ్డ కష్టాలు మీడియాలో వచ్చాయి.

2015 కుటుంబ సభ్యులతో వివాదాలు వచ్చాయి. వాటి కారణం గా సింఘానియా తన ఇంటిని.. ఆస్తిపాస్తులను పోగొట్టు కున్నారు. కోర్టు ను ఆశ్రయించారు. పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి పొందడానికి పోరాడారు. ఈ నేపథ్యంలోనే సింఘానియా జీవించి ఉండగానే సంతానానికి ఆస్తి రాసివ్వకూడదనే  గుణపాఠం నేర్చుకున్నట్టు  చెబుతున్నారు.

వివాదాల కారణంగా సింఘానియా సొంత ఆఫీస్ కి వెళ్లలేకపోయారు. ఆఫీస్ లో ఉన్న కీలకమైన డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోలేకపోయారు.ముంబయి, లండన్‌లలో ఉన్న కార్లు కూడా వాడుకునే అర్హతను కోల్పోయారు. చివరికి ఆఫీస్ లోకి కూడా సింఘానియాని రానివ్వలేదు.

రేమండ్స్‌ ఉద్యోగులెవరూ కూడా సింఘానియా తో మాట్లాడకూడదని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. దీంతో సింఘానియా నరకయాతన అనుభవించారు. అంతకంటే ఘోరమైన అవమానం లేదు. సింఘానియా  కష్టాలు చూస్తుంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని కార్ల్ మార్క్స్‌ అపుడెపుడో చెప్పిన విషయం గుర్తుకొస్తుంది.అది నిజమేనని పలు మార్లు రుజువైంది కూడా.

రాను రాను మానవ సంబంధాలు ఆర్థిక పరమైన అంశాలకే పరిమితం అవుతున్నాయి. డబ్బుకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బు మాయలో పడి తోటివారినే కాదు కుటుంబసభ్యులను కూడా మర్చిపోతున్నారు. మనుష్యుల్లో పెరుగుతున్న స్వార్థం, ధన కాంక్ష కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే విజయ్ పత్ సింఘానియా ఆత్మకథ ‘ఎన్‌ ఇన్‌కంప్లీట్‌ లైఫ్‌’ అమ్మకాలు, సర్క్యులేషన్‌, పంపిణీపై బాంబే హైకోర్టు  3 రోజుల క్రితం నిషేధం విధించింది. సింఘానియా కి ఇది మరో షాక్. ఈ ఆత్మకథ విషయంలో రెండేళ్ల నుంచి వివాదం నడుస్తోంది. పుస్తకంలో రాసిన సంగతుల కారణంగా పరువు నష్టం కలుగుతుందని విజయ్ పత్ కుమారుడు గౌతమ్ అంటున్నారు.

గోప్యత హక్కును ఉల్లంఘించడంతో పాటు ..సంస్థ వ్యాపార కార్యకలాపాలు, ఇతర రహస్య సమాచారాన్ని చర్చించారని గౌతమ్ సింఘానియా ఆరోపణ. ఈ ఆత్మకథ ను నిషేధించాలని 2019 లోనూ ఠాణె జిల్లా సెషన్స్ కోర్టు, ముంబయిలోని సివిల్ కోర్టులో పిటిషన్‌ వేశారు.

విచారణ చేపట్టిన ఠాణె జిల్లా సెషన్స్‌ కోర్టు.. అదే ఏడాది ఏప్రిల్‌లో ఆత్మకథ పుస్తకం విడుదలపై నిషేధం ప్రకటించింది. అయినా.. విజయపత్ సింఘానియా, ప్రచురణకర్తలు కోర్టు ఉత్తర్వును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ ఇటీవల పుస్తకాన్ని విడుదల చేశారని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రేమండ్ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్.. పుస్తక విక్రయాలు, పంపిణీ, సర్క్యులేషన్‌ను నిలుపుదల విధిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.

———-KNMURTHY.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!