New banking rules ……………………..
కొత్త ఆర్థిక సంవత్సరం ఇవాళ్టి నుంచి మొదలైంది. దాంతో పాటు కొత్త బ్యాంక్ రూల్స్ అమలులోకి వచ్చాయి. బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహణ , ఏటీఎం విత్ డ్రాయల్స్, యూపీఐ రూల్స్ మారాయి. ఇవి తెలుసుకోకపోతే బ్యాంకులు సామాన్యులను బాది పడేస్తాయి. మినిమం బ్యాలెన్స్ నిర్వహణ మటుకు సామాన్యుల జేబులను గుల్ల చేస్తుంది.
మేజర్ బ్యాంకులన్ని ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.
బ్యాంకులు ఈ నిబంధనలను ఖాతా ఉండే ప్రాంతాన్నిబట్టి అమలు చేస్తాయి. పట్టణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులు అధిక కనీస బ్యాలెన్స్ అకౌంట్ లో ఉంచాలి. సెమీ-అర్బన్ ఈ ప్రాంతాల బ్యాంకుల ఖాతాదారులు తమ అకౌంట్ లో పరిమితమైన కనీస బ్యాలెన్స్ ఉంచాలి.
గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువ గా కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలను బ్యాంకులు అమలు చేస్తాయి. ఆర్బీఐ నిర్దేశించిన కనీస బ్యాలెన్స్ ఖాతాలో ఉంచకపోతే జరిమానా పడుతుంది. కాబట్టి ఖాతాదారులు తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను ఎంత ఉంచాలో బ్యాంకులకు వెళ్లి తెలుసుకోవడం మంచిది.
బ్యాంకు ఖాతాను బట్టి ఈ అమౌంట్ మారుతుంది. కొన్నిబ్యాంకుల ఖాతాదారులు పట్టణ ప్రాంతాల్లో రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2,000 కనీస బ్యాలెన్స్ను ఉంచుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు లావాదేవీల భద్రతను పెంచడానికి, బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ (PPS) విధానాన్ని కూడా అమలు చేయడం మొదలు పెట్టాయి.
ఈ విధానం రూ. 5,000 కంటే ఎక్కువ విలువ ఉన్న చెక్కుల లావాదేవీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం చెక్ నంబర్, తేదీ, చెక్ చెల్లింపుదారుని పేరు, చెక్ మొత్తం వంటి విషయాలను ప్రస్తావించాలి. చెక్కుల పేరుతో జరుగుతున్న మోసాలను తగ్గించడానికి ఈ విధానం అమలు చేస్తున్నారు.
ఇక ATM లావాదేవీల రుసుములకు RBI మార్గదర్శకాలను నిర్దేశించింది..ఉచిత పరిమితి దాటితే.. ప్రతి లావాదేవీకి చార్జీలను వసూలు చేస్తారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా, అనేక బ్యాంకులు తమ ATM ఉపసంహరణ రుసుములను సవరించాయి. నెలకు ఉచిత ఎటిఎం ఉపసంహరణల సంఖ్యను తగ్గించాయి.ముఖ్యంగా ఇతర బ్యాంకులు నిర్వహించే ATM లలో లావాదేవీలకు.
ఇప్పుడు కస్టమర్లు ఇతర బ్యాంకు ATM లలో ప్రతి నెలా మూడు ఉచిత ఉపసంహరణలకు మాత్రమే అనుమతి ఉంది. ఆ తర్వాత, ప్రతి లావాదేవీకి రూ.20 నుండి రూ.25 వరకు ఛార్జ్ వసూలు చేస్తారు.ఈ అంశాలకు సంబంధించి ఖాతాదారులకు బ్యాంకులు మెసేజులు కూడా పంపలేదు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1, 2025 నుంచి చాలా కాలంగా పనిచేయకుండా ఉన్న మొబైల్ బ్యాంకుల UPI లావాదేవీలను నిలిపివేయబోతోంది. బ్యాంక్ ఖాతాకు ఫోన్ నంబర్ లింక్ చేసి ,దాన్ని చాలా కాలం పాటు ఉపయోగించకుండా ఉంటే, ఆ UPI లావాదేవీలను కొనసాగించడానికి.. బ్యాంక్ ఖాతాకు కొత్త నంబర్ను లింక్ చేయాలి. లేదంటే ఆ నంబర్తో UPI లావాదేవీలు చేయలేరు. ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి వివరాలను తెలుసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవడం మంచిది.