డైలాగులు రాయడం లో ఆయన స్టయిలే వేరు కదా !!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………….

యమవ్యవహారికప్మాటల రమణకు జై…28 జూన్ బుడుగు బర్త్ డే…అదేనండీ ముళ్లపూడి వెంకటరమణ గారు పుట్టిన రోజు. ఇలా కూడా రాస్తారా? అని అశేష తెలుగులు అవాక్కయ్యేలా చేసిన రచయిత ఆయన. వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాయకుడు అయితే…యమ వ్యవహారిక్మాటలకు బుడుగు నాయకుడు.ఆ బుడుగు మాటున ఉన్న అసలు పిడుగు రమణగారు.మామూలుగా మాట్లాడేలా రాయడం మాత్రమే కాదు. 

ఆ మాట్లాడింది మనకి ఎలా వినిపిస్తుందో అలా రాసేయడం…జళుబు చేసిల్ది లాగా అన్నమాట.అలా పాఠకులకు కొత్త అనుభూతులు కలిగించడమే కాదు.. అనేక మందికి మార్గదర్శనం చేశారు రమణ గారు.తెలుగు వచన రచన మీదా సినిమా రచన మీదా ఆయన వేసిన ముద్ర మామూలుది కాదు. కావాలంటే ‘కృష్ణావతారం’ లో కృష్ణ గారి డైలాగులు వినండి. 

1931 జూన్ 28న ధవళేశ్వరంలో ముళ్లపూడి వెంకట రావుగా పుట్టిన ఓ కుర్రాడు అలా హాయిగా ఆడుకోకుండా…బోల్డు కష్టాలపాలై,ఆనక మద్రాసు దారి పట్టి …అక్కడ బాపు అనే నేస్తంతో కల్సి కబుర్లూ అవీ చెప్పుకుంటూ మధ్యలో…కష్టాలు అర్థం చేయించిన జీవితంలోంచి అనుభవాలను కామెడీ టచ్ తో రాసి…
మీ ప్రోజ్ భలే ఉంటుందండీ అని సాక్షాత్తూ శివలెంక శంభూప్రసాద్ లాంటి ఉద్దండ సంపాదకుడి నుంచీ కితాబు అందుకోవడం అహో అనిపించదూ?

అలా అక్కడితో ఆగలేదు …సాక్షాత్తు ఎన్టీఆర్ తో వావ్ అనిపించేలా ‘రక్తసంబంధం’ డైలాగులు రాశారు.ఏ ఆత్రేయో రాయాల్సినంత బరువైన సన్నివేశాలున్న ఈ సినిమా కామెడీ రైటర్ చేతిలో పెట్టారేంటి అన్నారు అన్నగారు. జీవితం తెల్సిన వాడే హాస్యం రాస్తాడు … హాస్యం రాశాడంటే జీవితం తెల్సే ఉంటుంది కనుక అన్న డూండీ మాటలు నిజమని అన్నగారు అంగీకరించేశారు. 

ఆంధ్రపత్రిక వార పత్రికలో ఉపసంపాదక పదవి లో పన్జేసీ చేసీ బోరుకొట్టి….. రిజైన్ చేసి ఫ్రీలాన్సర్ గా అదే పత్రికకు కథలు రాయడం మొదలెట్టారు రమణగారు.జీతానికి మూడింతలు రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పత్రిక యాజమాన్యం బావురుమంది. అలా రచయితగా విశ్వరూపం ప్రదర్శించారు. 

ఇదంతా గమనించిన నిర్మాత దినవహి భావనారాయణ గారు వచ్చి ఆదుర్తి దగ్గరకు తీసుకుపోయి ఇతనే మన ‘దాగుడు మూతలు’కు రచయిత అన్జెప్పారు. ఆదుర్తి ఆ కథ తర్వాత చూద్దాంగానీ ముందు ఈ ‘మూగమనసులు’ సంగతి చూడు అనడంతో అలా తెర మీదకు అడుగేశారు. రమణగారికి మొదటి నుంచీ తెంపరితనం ఎక్కువ… ఆ మాత్రం రిస్క్ తీసుకోకపోతే మనకీ మిగతా వారికీ తేడా ఏటుంటాదీ అని ముందడుగు వేసేసేవారు.

అలా సినిమాలు రాసుకుంటూ,పత్రికల్లో కథలూ అవీ నడిపిస్తూ హాయిగా మద్రాసులో ఉండక బెజవాడ వెళ్లి జ్యోతి మంత్లీ వెలిగించారు.పోనీ అక్కడ కుదురుగా ఉండిపోతాడనుకున్నవారిని అవాక్కవండని చెప్పి …బెజవాడ శ్రీఫిలింస్ పర్వతనేని చంద్రశేఖరరావుగారికి కథ చెప్పి సినిమాకు కొంత డబ్బులు పెట్టేలా ఒప్పించారు.

హైనూన్ అనే ఇంగ్లీషు కౌబాయ్ సినిమా కథను తెలుక్కు తెచ్చి …సాక్షి అని పేరు పెట్టి ఇది ఇంగ్లీషు ప్రాంతాల్లో ఎందుకు జరుగుతుందీ …మన గోదారొడ్డున మా బల్లకట్టు కిట్టయ్య కథైతేనూ … అనేంతగా మెప్పించారు. ‘సాక్షి’ తర్వాత తీసిన ‘బంగారు పిచ్చిక’ మాట దక్కించకపోయే సరికి కించిత్తు పౌరుషం వచ్చింది బాపు రమణలకి.

ఈ సారి డబ్బు చేసి పెట్టే సినిమా తీయాలని నిర్ణయించేసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా ‘బుద్దిమంతుడు’.ఆస్తికుడైన అన్నగారికీ..నాస్తికుడైన తమ్ముడికీ తగువు పెట్టి ఆఖరున ఆ శ్రీహరియే వచ్చి బడిలో కూర్చుని చదివాడు అంటూ హేతువాదానికి తలుపులు తీశారు. హిట్టు కొట్టారు.

‘బుద్దిమంతుడు’ ఏ రేంజ్ సక్సస్ ఇచ్చిందంటే…సాక్షి, బంగారు పిచ్చిక మిగిల్చిన అప్పులన్నీ సింగిల్ చెక్ తో తీర్చేసేసేంత.రమణగారు ఏం రాసినా తీసినా రామాయణ ప్రమాణంగానే చేసేవారు.అసలు రమణగారికి తెలుగోళ్లు ఎంత రుణపడిపోయున్నారంటే …సినిమా హాళ్ల సీట్లలో నల్లులెందుకు ఉంటాయో దగ్గర నుంచీ. ..
రెండుజళ్ల సీతల వెనకాల పడే బాబాయిల గొడవ దాకా ఎన్ని విషయాలు మనకు చెప్పి జ్ఞాన పరచారో కదా. 

రమణగారు రాసిన రామాయణాల్లో డైలాగులు కూడా మాయాజబార్ లో పింగళి రాసినట్టు కొత్తగా ఉంటాయి….’సంపూర్ణ రామాయణం’ ,’సీతాకల్యాణం’, ‘శ్రీరామరాజ్యం’ లాంటి సినిమాలు చూస్తే అర్ధమౌతుంది. సీతా రాముల అంతఃపుర సన్నివేశాన్ని అంత రమణీయంగా రాయడం రమణగారి వల్ల తప్ప ఇంకెవరి వల్లా కాదు.

రమణగారి కలం బలంతో సూపర్ హిట్టులైపోయి జనాల్ని థియేటర్లకు పోటెత్తించిన సినిమాలు అనేకం ఉన్నాయి. స్టార్లు లేకుండానే కేవలం రమణగారి మాటలు వినడానికే జనం టిక్కెట్లు తెంపేసేవారు.
ఆ మాటలు వినడానికి సినిమా ఆడినంత కాలం ఏ పదిసార్లో ఇరవై సార్లో చూసేసేవారు జనం …అలా ఎటువంటి తారాబలం లేకుండా కలం బలం మీద బాక్సాఫీసును కొల్లగొట్టిన రమణగారి సినిమా ముత్యాలముగ్గు.

ఉత్తర రామ చరిత ఆధారంగా వేసిన ‘ముత్యాలముగ్గు’ నిజంగానే స్టార్లను భయపెట్టి వణికించేసింది.జనతా ఎక్స్ ప్రెస్ కథలతో అందాలరాముడిని పరిచయం చేసిన చేత్తోనే కాపురాలు తీసే కాంట్రాక్టర్ ను మన కళ్లెదుట నిలబెట్టారు రమణగారు. అక్కడతో ఆగలేదు …ఓడిపోయిన దేవుడు సైతాను కథను కూడా మనకు నచ్చేలా మనసుకు ఎక్కేలా రాసి మెప్పించారు.

దేవుడు చేసిన మనుషుల బుద్దులు చూపించారు. జ్ఞాన మార్గాన్ని ఎరుకపరచారు.శాంతి అంటే తెలుసు కద శిశువా … రెండు యుద్దాల మధ్య ఇంటర్వెల్ లాంటి మార్క్స్ మార్క్ మాటలను కూడా సైతాను నోటెంట చెప్పించారు.మంత్రిగారి వియ్యంకుడు, త్యాగయ్య ఇలా నడుస్తున్న కెరీర్ కళ్యాణతాంబూలం తర్వాత వేగం పూర్తిగా తగ్గింది.

ఆ టైమ్ లో తనదైన ముద్ర వేస్తూ బాపు రమణలు తీసిన ‘పెళ్లిపుస్తకం’ మళ్లీ ప్రేక్షకులను ధియేటర్లకు పరుగులు పెట్టించింది.పెళ్లి అనే అకేషన్ లో కనెక్ట్ అయిన రిలేషన్ లో ఉన్న తీపి చేదులను భలే రంజుగా చెప్తూ…చేస్తున్న తప్పుల్ని గుర్తు చేస్తూ రమణగారు చెప్పిన దాంపత్యోపనిషత్తు ‘పెళ్లిపుస్తకం’.అదే ఊపులో తీసిన ‘మిష్టర్ పెళ్లాం’ కూడా బాగా మాగిన చింతకాయపచ్చడిలా రుచిగా అనిపించింది.తెలుగు భాష బతికున్నంత వరకు చెరిగిపోని సంతకం రమణగారిది

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!