ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టి ఇవాళ్టికి పదమూడురోజులు అయింది. అయినా యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది.
ఈ సమయంలో కొంత మంది పౌరులు దేశం వీడి వలస పోతున్నారు.ప్రాణ భయంతో లక్షలాది మంది ఉక్రెయిన్ వదిలి పొరుగు దేశాలైన పోలాండ్, హంగేరీ, రోమేనియాకు వెళ్లిపోతున్నారు. ఉన్న ఊరిని వదిలి కట్టుబట్టలతో కన్నీళ్లు పెట్టుకుంటూ సరిహద్దులు దాటి పోతున్నారు.
ఇతర దేశాలు ఏర్పాటుచేసిన శిబిరాలలో తల దాచుకుంటున్నారు. రష్యా భీకర దాడులలో వేల మంది సైనికులు, వందలాది పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. జనావాసాలపై కూడా రష్యన్ సైనికులు దాడులు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి చిన్న పిల్లలతో దేశాన్ని వదిలి వెళుతున్న తల్లులకు సంబంధించిన వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి. అలాగే అందరిని కోల్పోయి బాలలు కూడా దేశాన్ని వీడి పోతున్నారు.
తాజాగా ఓ బాలుడు దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం సోషల్ మీడియాలో కలకలం రేపింది .. అందరినీ కలచివేస్తోంది. రష్యా దాడులకు భయపడిన ఒక బాలుడు ఉక్రెయిన్ సరిహద్దులో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస వెళుతున్నాడు.ఇతగాడి తల్లితండ్రులు ఏమైపోయారో ? సమాచారం లేదు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్గా మారింది.ఇది చూసిన జనాలు రష్యాను తిట్టిపోస్తున్నారు.