భక్తి ఉద్యమంలోకి బ్రాహ్మణేతరులను ప్రోత్సాహించింది ఆయనే !!

Sharing is Caring...

సుదర్శన్ టి…………………………..

అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను కాస్త లోతుగా అధ్యయనం చేయాలని ఓ పది,పన్నెండేళ్ల క్రితం ప్రయత్నించాను.ఆ ప్రక్రియలో శంకరాచార్యులు,మద్వాచార్యులు, రామానుజాచార్యుల వారి గురించి చదివాను. కానీ రామానుజాచార్యుల వారు బడుగువర్గాల ఆలయ ప్రవేశ విషయమై ఒక విప్లవం తీసుకొచ్చారని ఎక్కడా చదవలేదు.

ఈ అంశం కంటే ముందు రామానుజాచార్యుల వారి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి.రామానుజులు చెన్నైకి దగ్గరున్న శ్రీపెరంబుదూర్ లో జన్మించారు. ఆయన స్థిరమైన చోళ సామ్రాజ్యంలో పెరిగారు. అప్పటి చోళ సామ్రాజ్యం వివిధ కుల మతాల సమ్మేళనంతో వర్ధిల్లింది. వైష్ణవ, శైవ, స్మార్త, శాక్తేయ, జైన, భౌద్ధ మతాలు, సంప్రదాయాలు కలసికట్టుగా అభివృద్ధి చెందిన స్వర్ణ యుగం ఆ చోళసామ్రాజ్యం.

రామానుజుల తొలి గురువు యాదవ ప్రకాశుల వారు అద్వైత సంప్రదాయానికి చెందిన వారు. రామానుజులు ఆయన శిష్యునిగా చేరిన అనతి కాలంలోనే అద్వైత సిద్ధాంత విషయంలో గురు-శిష్యులకు మధ్య తరచూ వాగ్వివాదం జరిగేది.కొన్నాళ్ళకు గురు శిష్యులు వేరయ్యారు.

రామానుజులు కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రధాన పూజరిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఆయన పేరుప్రఖ్యాతులు దశదిశలా వ్యాపించడం మొదలైంది.అప్పటికి అద్వైతం చాలా లోతుగా ప్రధాన హిందూ సంప్రదాయంగా కొనసాగుతోంది.

కొన్ని శతాబ్దాల తర్వాత అద్వైతాన్ని ప్రశ్నించగల ఒక వ్యక్తి భక్తి ఉద్యమం నుండే రావడంతో వివిధ రాజ్యాల్లోని విప్రులు ఆసక్తితో గమనించసాగారు. వారిలో ప్రముఖులు శ్రీ యమునాచార్యుల వారు. వీరు వైష్ణవ సంప్రదాయానికి చెందినవారు. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో హిందూ మత గురువు, అధ్యక్షులూనూ.

ఎన్నాళ్ళుగానో తమ సంప్రదాయానికి సరైన వారసుని కోసం వెతుకుతున్న యమునా చార్యులవారికి రామానుజులే సరైన వారసుడు అనిపించింది.తమ శిష్యుల్లో ప్రముఖుడైన శ్రీ మహాపూరుడిని రామానుజులను తీసుకుని రావలసిందిగా కంచికి పంపారు.యమునాచార్యుల వద్ద శిష్యరికం చేయాలన్నది రామానుజుల చిరకాల కోరిక.

అటువంటిది ఏకంగా ఆయన్నుండే ఆహ్వానం అందడంతో వెంటనే వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి, మహాపురునితో శ్రీరంగానికి ప్రయాణమయ్యారు. కానీ తానొకటి తలస్తే దైవమోకటి తలచినట్టు రామానుజులు శ్రీరంగం చేరే సమయానికి యమునా చార్యుల వారు స్వర్గస్థులయ్యారు.

యమునాచార్యుల వారిని రామానుజులు చాలా బాధపడ్డారు. ఆయన్ను తన నుండి శ్రీరంగనాథుడే దూరం చేశాడని భావించి ఇక శ్రీరంగం ఎప్పటికీ రానని చెప్పి కంచికి తిరిగి వెళ్లి పోయారు.యమునాచార్యుల తర్వాత ఆయన కుమారుడు తిరువరంగ అరియార్ బాధ్యతలు స్వీకరించారు. 

కానీ యమునాచార్యుల లాగా వేదాలను, శాస్త్రాలను నిర్వచించ లేకపోయేవారు. అదొక పెద్ద లోటు గా అందరికీ తెలుస్తూనే ఉంది.అందుకే మళ్లీ రామానుజుల వారిని ఆహ్వానించాలని నిర్ణయించి మహాపురున్ని కంచికి పంపారు.ఇంతలో అక్కడ రామానుజులకు తన తోటి విద్యార్థి కంచిపూరునితో చక్కటి చర్చలు జరుగుతుండేవి.

కంచిపూర్ణుడి ప్రతిభ చూసి, తనను శిష్యునిగా స్వీకరించమని ఆయనను కోరాడు. తాను రామానుజుని కులానికి చెందినవాడను కానని కాబట్టి గురువుగా ఉండలేనని, తగిన గురువు త్వరలో దొరుకుతాడని ఆశీర్వదించి తిరుపతి వేంకటేశ్వరుని సేవించుకోడానికి వెళ్ళిపోతాడు.

రెండవసారి శ్రీరంగం నుండి ఆహ్వానం అందడంతో ఇక తప్పనిసరి అయి రామానుజుల వారు శ్రీరంగంలో బాధ్యతలు స్వీకరించారు.ఇక అసలు విషయానికి వస్తే, బ్రాహ్మణేతరులకు వేద, శాస్త్ర పఠనం రామానుజులవారు తీసుకొచ్చింది, ప్రవేశపెట్టింది కాదు.

అప్పటికే ఆ సంప్రదాయం ఉండేది. రామానుజుల వారు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. (ఉదాహారణకు కంచిపూరుడు, మహాపూరుడు బ్రాహ్మణులు కారు కానీ వేద, శాస్త్ర విషయాల్లో వాళ్లకు చాలా గట్టి పట్టు ఉండేది).

ఆ ఆళ్వారుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే తన వంతుగా అంటరానివాళ్లుగా పరిగణింపబడుతున్న దాస్, దాస, దాసుగా పిలువబడే కులాలవారిని భక్తి ఉద్యమంలో భాగం చేసే దిశగా వారికి ఆళ్వార్ దివ్య ప్రబంధాలు బోధించడం మొదలుపెట్టారు.

శ్రీరంగ ఆలయంలో కూడా బ్రాహ్మణేతరులు ఆలయ ఆచారవ్యవహారాల్లో పాలుపంచుకునే విధంగా మార్పులు తీసుకొచ్చారు.బహుశా ఆయన కృషి ఫలితమో ఏమో, గురువాయుర్, తిరువనంతపురం శ్రీపద్మనాభ స్వామి ఆలయాల్లో పనిచేసే వాళ్లలో చాలా మంది జంధ్యం లేకుండా కనబడతారు. వీళ్ళందరూ ఆలయ వ్యవహారాలు, పూజలు చూసుకునే బ్రాహ్మణేతరులు. భక్తి ఉద్యమానికి రామానుజాచార్యులవారు చేసిన సేవ కొనియాడదగినది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!