His kidnapping was a sensation…………
దివంగత కన్నడ హీరో .. సుప్రసిద్ధ నటుడు డాక్టర్ రాజ్కుమార్ కిడ్నాప్ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసింది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. 108 రోజులపాటు తన బందీగా ఉంచుకుని ఎన్నో రాయబారాలు.. బేరాలు తర్వాత రాజ్ కుమార్ ను వదిలారు.
ఈ కిడ్నాప్ కి సంబంధించి వాస్తవాలను ప్రభుత్వం కానీ .. రాజ్ కుమార్ కానీ వెల్లడించలేదు. ఇప్పటికి ఈ విషయాలు మిస్టరీ గానే ఉండిపోయాయి.రాజ్కుమార్ను జులై 30, 2000న ఆయన స్వగ్రామం గాజనూరు లో కిడ్నాప్ చేశారు.పునీత్ రాజ్కుమార్ అశ్విని ని పెళ్లాడిన ఎనిమిది నెలల తర్వాత ఈ కిడ్నాప్ జరిగింది.
రాజ్కుమార్ గాజనూరులో నిర్మించిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన సతీమణి తో సహా అక్కడికి వెళ్లారు వెళ్లారు. అదను చూసి రాత్రివేళ వీరప్పన్ అతని అనుచరులు అక్కడకొచ్చి రాజ్ కుమార్ ను మరో ముగ్గుర్ని కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయానికల్లా కర్నాటక ప్రజలకు ఈ వార్త అందింది. ప్రభుత్వ వర్గాలు .. అభిమానులు షాక్ తిన్నారు.
కిడ్నాప్ అయిన రాజ్ కుమార్ ఎలా ఉన్నారో ?ఎక్కడ ఉంచారో ? ఎవరికి తెలీదు. వీరప్పన్ కిడ్నాప్ చేశారని మాత్రమే తెలుసు.రాజ్కుమార్ నిర్బంధంలో ఉన్న 108 రోజులు ప్రభుత్వం, అభిమానులు టెన్షన్ తో గడిపారు.అభిమానులు ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.అల్లర్లు జరుగుతాయేమో అని ప్రభుత్వం భయపడింది. తర్వాత వీరప్పన్ తో చర్చలకు ప్రభుత్వ దూతలు అడవుల్లోకి వెళ్లారు.
కానీ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. వీరప్పన్ రాజ్ కుమార్ విడుదలకు వెయ్యి కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతారు.ఈ మొత్తంలో రూ.900 కోట్ల విలువైన బంగారం, కోటి రూపాయల లిక్విడ్ క్యాష్ కావాలని డిమాండ్ చేసినట్లు తమిళ పత్రికలు రాశాయి. శివ సుబ్రమణ్యన్ రాసిన “లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్” అనే పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయని తర్వాత కాలంలో కూడా తమిళ, కన్నడ మీడియా జర్నలిస్టులు రాశారు.
చర్చలు కొలిక్కి రాని క్రమంలో రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణను కలిశారు. ఆయన వెంటనే తమిళనాడు వెళ్లి అప్పటి సీఎం కరుణానిధితో సమావేశమయ్యారు. కరుణ జోక్యంతో నక్కీరన్ పత్రిక సంపాదకుడు గోపాల్ అడవుల్లోకి వెళ్లి వీరప్పన్ తో చర్చలు జరిపారు.
అవి సఫలం కాలేదు. తర్వాత గోపాల్,నెడుమారన్ వెళ్లారు, రాజ్ కుమార్ కి వైద్యం అందించడం కోసం డాక్టర్ భాను కూడా తోడుగా వెళ్లారు.గోపాల్, నెడుమారన్ చివరికి రాజ్కుమార్ను విడుదల చేయడానికి వీరప్పన్ను ఒప్పించారు. డాక్టర్ భాను హెల్త్ బాగాలేనట్టు నటించమని రాజ్కుమార్ కు సలహా ఇచ్చినట్టు చెబుతారు.ఈ క్రమంలోనే వీరప్పన్ తన వైఖరిని మార్చుకున్నాడు.దిగి వచ్చాడు.
మొత్తం మీద 15 కోట్లరూపాయలు మూడు విడతల్లో ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని అంటారు.వాస్తవాలు బయటకు రాలేదు.ఈ సొమ్ము ప్రభుత్వం ఇచ్చిందా ? రాజ్ కుమార్ కుటుంబీకులు చెల్లించారో ఎవరికి తెలీదు. ఇక చర్చల వివరాలు కూడా మిస్టరీగా మిగిలిపోయాయి.
సొమ్ము అందిన వెంటనే రాజ్ కుమార్ ను వదిలారు. విడుదలైన తర్వాత జరిగిన మొదటి విలేకరుల సమావేశంలో రాజ్కుమార్ తన కిడ్నాప్ ఎపిసోడ్ మొత్తం సినిమాకు సరిపోయే మంచి స్క్రిప్ట్ అని చమత్కరించారు. 2004లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది జరిపిన ఎన్కౌంటర్లో వీరప్పన్ మరణించారు. అనంతరం 2006లో డాక్టర్ రాజ్కుమార్ కన్నుమూశారు.
———KNM

