Taadi Prakash …………………
A COMPELLING FILM BY COSTA GAVRAS …………………………………………
గ్రీసు దేశానికి చెందిన కాన్స్టాంటినో గౌరస్ సినిమా దర్శకుడు. కోస్టా గౌరస్గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్ అమెరికా ప్రభుత్వాలు గడగడలాడతాయి. గ్రీస్లో కోస్టాగౌరస్ని నిషేధించారు. ఆయన సినిమాల్ని నిషేధించారు.
ఆస్కార్తో సహా అనేక అంతర్జాతీయ అవార్డులు పొందిన ఆయన పేరు కో…అని పలకడం కూడా అక్కడ నిషేధం. 1933 ఫిబ్రవరి 12న గ్రీస్లోజన్మించిన కోస్టాగౌరస్ స్థిర నివాసం పారిస్. 1964 నుంచే ఫ్రెంచిలో సినిమాలు తీశారు. ఇప్పుడాయన వయసు 87 ఏళ్ళు. గత ఏడాది 2019లో కూడా ADULTS IN THE ROOM అనే సినిమా తీశారు. ఆయన 30 సినిమాల వరకూ తీసినా, నాకు నచ్చిన, నేను చూసిన రెండు సినిమాల గురించి చెప్పాలి. 1. Z ( దీన్ని ‘జీ’ అని పలకాలి) గ్రీకు భాషలో జీ అంటే HE LIVES అనీ HE IS ALIVE అనీ అర్ధం. 1969లో జీ రిలీజ్ అయింది. 2. మిస్సింగ్. 1982లో వచ్చింది. చిలీ దేశంలో కనపడకుండా పోయిన ఒక అమెరికన్ జర్నలిస్టు కథ.
చిలీ అనే చిన్న దేశం దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన చిటికెన వేలులా సన్నగా పొడవుగా వుంటుంది. అర్జెంటీనా, బ్రెజిల్, చిలీని A,B,C countries అంటారు. ఆరు వేల కిలోమీటర్ల పసిఫిక్ సముద్ర తీరం వున్న చిలీలో ఆండీస్ పర్వతశ్రేణి ప్రత్యేక ఆకర్షణ. స్పానిష్ మాట్లాడే ఆ దేశ జనాభా కోటిన్నర. రాజధాని శాంటియాగో. చిలీని ‘COUNTRY OF POETS’ అంటారు. సాహిత్య నోబెల్ పొందిన పాబ్లోనెరూడా, గ్రాబియేలా మిస్త్రల్ యిద్దరూ చిలీ దేశస్తులే ! 1960వ దశకంలో చిలీలో వామపక్ష ఉద్యమం పుంజుకుంది. కమ్యూనిస్టులు, విప్లవ కవులు, గాయకులు, మేధావుల ఉత్తేజంతో ఎర్రగాలి బలంగా వీచింది. ఆ వూపులో 1970 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు ఐక్య సంఘటన అధికారంలోకి వచ్చింది.
సాల్వడార్ గిల్లేర్మో అలెండీ దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన శాంటియాగో యూనివర్సిటీలో మెడిసిన్ చదివిన డాక్టరు. మార్క్సిజాన్ని నమ్మినవాడు. దక్షిణ అమెరికాలో ఒక మార్క్సిస్టు ప్రభుత్వం అధికారంలోకి రావడం అమెరికాకి నచ్చలేదు. అలెండీ ప్రభుత్వాన్ని యిబ్బంది పెట్టడానికి వ్యూహ రచన చేసింది. 1973 సెప్టెంబర్ వరకూ అలెండీ అధికారంలో వున్నారు. చిలీ ఆర్మీలోని ఒక వర్గాన్ని అమెరికా చేరదీసింది. సి.ఐ.ఏ వాళ్ళకి సైనిక సహయం అందించింది. తిరుగుబాటు చేయించింది. సెప్టెంబర్ 11న అగస్టో పినోచెట్ అనే ఆర్మీ జనరల్ నాయకత్వాన భయానకమైన సైనిక దాడి జరిగింది. శాంటియాగోలో దేశాధ్యక్షుడు అలెండీ అధికార నివాస భవనాన్ని సైన్యం చుట్టుముట్టింది. కాల్పులు జరిపింది. పైనించి భవనంపై బాంబులు కురిపించారు.
కుట్రని ఎదుర్కొడానికి అలెండీ, ఇతర ప్రభుత్వ నేతలు మెషీన్ గన్లతో కాల్పులు జరిపారు. బాంబింగ్ జరుగుతుండగానే దేశ ప్రజల్ని ఉద్దేశించి చీలీ రేడియోలో అలెండీ అఖరి ప్రసంగం చేశారు. చివరిదాకా తుపాకీతో పోరాడిన అలెండీ బాంబుదాడిలో మరణించారు. సైన్యం అధికారం చేజిక్కించుకుంది. వైట్హౌస్లో కేరింతలు కొట్టి కేకులు తిన్నారు. చిలీ పరిణామాలని కవర్ చేయడానికి న్యూయార్క్, వాషింగ్టన్ల నుంచి అమెరికా జర్నలిస్టులు వచ్చివున్నారు. అందులో యిద్దరు జర్నలిస్టులు కనిపించకుండాపోయారు. శాంటియాగోలో మార్షల్ లా విధించారు. మార్షల్ లా అంటే కర్ఫ్యూ జేజమ్మ. రోడ్ల మీద ఎవరు కన్పించినా కాల్చి చంపేస్తారు. ఒక చిమ్మ చీకటి తెర చిలీని కమ్ముకుంది. మిస్సింగ్ జర్నలిస్టు కథే సినిమా !
ఛార్లెస్ హార్మన్ అనే అమెరికన్ జర్నలిస్టు కనిపించకుండా పోతాడు. అమెరికాలో పలుకుబడిగల వ్యాపారస్తుడైన ఛార్లెస్ తండ్రి ఎడ్ హార్మన్ కొడుకుని వెతకటం కోసం చిలీ వస్తాడు. నిజ జీవిత కథని కోస్టాగౌరస్ తెరకెక్కించాడు. రాజకీయ హత్యలతో నిండిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ని GRIPPING, DISTURBING, HAUNTING, UNSETTLING అని అప్పట్లో అంతర్జాతీయ పత్రికలు రాశాయి.శాంటియాగో చేరుకున్న ఎడ్ హార్మన్,కొడుకు భార్య Bethని కలుస్తాడు. మామకీ,కోడలికీ రాజకీయంగా పడదు. మీ వామపక్ష రాజకీయాల వల్లే నా కొడుకు కనిపించకుండా పోయాడని బెత్తో అంటాడు.
అమెరికా దుర్మార్గ రాజకీయ విధానం వల్లే యిలా జరిగిందని ఆమె అంటుంది. 24 గంటల మార్షల్ లా సమయంలోనే తండ్రి వెదకడం మొదలుపెడతాడు. అమెరికన్ గనక ప్రభుత్వం ఎలానూ సహకరిస్తుంది. శాంటియాగోలోని అమెరికన్ ఎంబసీలో అధికార్లని అడుగుతాడు ” మేమూ అదే చూస్తున్నాం” అంటూ దొంగమాటలు చెబుతారు. పలుకుబడి ఉపయోగించి హర్మన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతాడు. ఫలితం వుండదు. మిస్సింగ్ కేసు పెడతాడు. కోర్టు విచారణ నడుస్తూంటుంది. ఈలోగా 1973 సెప్టెంబర్ నాటి శాంటియాగో నగరాన్ని కోస్టా గౌరస్ మనకి చూపిస్తాడు. గుండెలు పగిలిపోయే దృశ్యాలవి !
కమ్యూనిస్టుల్నీ, వాళ్ళ సానుభూతిపరుల్నీ, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సోషలిస్టుల్నీ, గాయకుల్నీ, రచయితల్నీ ఆడవాళ్ళనీ, పిల్లల్నీ, శాంటియాగో మధ్యలో వున్న ఫుట్బాల్ స్టేడియంకి తీసుకెళుతుంటారు. అతిపెద్ద స్టేడియంలో వందలమందిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపేస్తుంటారు. ఆ స్టేడియం హింసల భయానక దృశ్యాలు ప్రేక్షకుడు ఎన్నటికీ మరిచిపోలేడు. శాంటియాగో ప్రధాన వీధిలో ఒక అర్ధరాత్రి మార్క్సిస్ట్ గ్రంథాలని కుప్పలుగా పోసి తగలబెడుతుంటారు. వీధివీధంతా తగలబడిపోతుంటే, సైనికులు తుపాకులతో కాపలా కాస్తుంటారు. హఠాత్తుగా వచ్చిన ఒక తెల్ల గుర్రం గట్టిగా సకిలిస్తూ ఆ రోడ్డు మీద మెరుపు వేగంతో పరిగెత్తి వెళిపోతుంది. జీపులో వెళ్తున్న సైనికులు దానిపై కాల్పులు జరుపుతారు. ఆ సింబాలిక్ షాట్ మనల్ని షాక్ చేస్తుంది. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న చిలీ ప్రజల ఆకాంక్షకు సింబల్ ఆ తెల్ల గుర్రం.
Read it also ……………………………. అమెరికన్ జర్నలిస్ట్ ‘మిస్సింగ్ ‘ ! (2)