విస్తరణ కాంక్ష తో దూకుడు!

Sharing is Caring...

Will luck come together?…………………………..

భారత కుబేరుడు గౌతమ్ అదానీ మహా దూకుడు మీద ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించాలన్న కాంక్షతో వివిధ రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. అదానీ గ్రూప్ వ్యాపార ప్రస్థానం 1980లో కమోడిటీల బిజినెస్ తో  ప్రారంభమైంది.

క్రమంగా మైనిం గ్, విద్యుత్ ఉత్పత్తి, నౌకాశ్రయాలు, ఎయిర్ పోర్ట్ ల నిర్వహణ, డేటా సెంటర్లు, ఢిఫెన్స్ సిస్టమ్ తో పాటు తాజాగా సిమెంట్, హెల్త్ కేర్, గ్రీన్ హైడ్రోజన్, కాపర్ రిఫైనింగ్, అల్యూమినియం, మీడియా వ్యాపారాల్లోకి ప్రవేశించింది. 

ఇటీవల అంబుజా సిమెంట్స్, ఏసీసీల్లో మెజారిటీ వాటాను స్విట్జర్లాండ్ సంస్థ హెల్సిమ్ నుంచి 10.5 బిలియన్ డాలర్లతో (సుమారు రూ. 83, 920 కోట్లు) కొనుగోలు చేసిన  అదానీ గ్రూప్.. వాటిల్లో మరో 26 శాతం  చొప్పున వాటాను సొంతం చేసుకునేందుకు  ఓపెన్ ఆఫర్ ప్రారంభించింది.సెప్టెంబరు 9న ఇది ముగుస్తుంది.  ఇందు కోసం  రూ.31,000 కోట్లు వెచ్చించనుంది. అంబుజా సిమెంట్స్ ఒక్కో షేరుకు రూ. 385, ఏసీసీకి రూ. 2,300 చొప్పున చెల్లించనుంది.

అంబుజా సిమెంట్స్ లో 51.63 కోట్ల ఈక్విటీ షేర్లను పబ్లిక్ వాటాదార్ల నుంచి కొనుగోలు చేసేందుకు రూ. 19,879.57 కోట్లను అదానీ గ్రూప్  వెచ్చిస్తోంది . ఏసీసీలో 4.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.11,259.97 కోట్లను ఖర్చుపెడుతోంది.  

హెల్సిమ్ కు అంబుజా సిమెంట్స్ లో  63.19 శాతం , ఏసీసీలో 54.53 శాతం  (ఇందులో 50.05% అంబుజా సిమెంట్స్ ద్వారానే) వాటాలున్నాయి. ఈ రెండు సంస్థలకు కలిపి 70 మి.టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అలాగే 23 ప్లాంట్లు, 14 గ్రౌండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లతో పాటు 50,000కు పైగా ఛానెల్ భాగస్వాములు దేశవ్యాప్తంగా ఉన్నారు.

ఇక రిలయన్స్అంబానీ చాలాకాలంగా న్యూస్‌ చానళ్ల వ్యాపారంలో ఉన్నారు. అంబానీ యాజమాన్యంలోని నెట్‌వర్క్‌ 18 సంస్థ సీఎన్‌ఎన్‌-న్యూస్ 18, సీఎన్‌బీసీ-టీవీ 18 వంటి వార్తా చానళ్లను నిర్వహిస్తోంది. అంబానీ తో పోటీ పడేందుకు అదానీ మీడియా వెంచర్స్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా  Quintillion Business Media Pvt Ltd లో మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు. 

తర్వాత  ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌  ‘న్యూ ఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌’లో (N D T V) మెజారిటీ వాటాను చేజిక్కించుకోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తమ సమ్మతి లేకుండానే అదానీ గ్రూప్‌ టేకోవర్‌ చర్యలు చేపట్టిందని ఎన్‌డీటీవి అంటోంది.  లిస్టెడ్‌ కంపెనీ అయిన ఎన్‌డీటీవీలో గౌతమ్‌ అదానీ తొలుత పరోక్షంగా వాటా దక్కించుకున్నారు.

ఇందుకోసం ఎన్‌డీటీవీ ప్రమోటింగ్‌ కంపెనీల్లో ఒకటైన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేశారు. తద్వారా ఎన్‌డీటీవీలో అదానీ గ్రూప్‌కు 29.18 శాతం ఈక్విటీ వాటా దక్కింది. అలాగే బహిరంగ మార్కెట్‌ ద్వారా ఈ మీడియా సంస్థకు చెందిన మరో 26 శాతం వాటా కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది

ఇంతవరకూ బాగానే ఉంది కానీ విస్తరణ కోసం అదానీ ఎక్కువగా రుణాలపైనే ఆధార పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ తడిసి మోపెడైతే గ్రూప్ ఆ భారం తట్టుకోగలదా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్ భవిష్యత్ ఎలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!