Subramanyam Dogiparthi ………………….
మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . It’s a musical , literary , emotional classic.
ముఖ్యంగా ఈ సినిమాలో నటి లక్ష్మి పోషించిన వేశ్య పాత్ర ఎవరి మనసునైనా కదిలిస్తుంది. లక్ష్మీ బాగా నటించింది . విటులకు గాలం వేసే వేశ్యగా ఎంత సునాయాసంగా నటించిందో .. కవికి భక్తురాలిగా అంత అద్భుతంగా నటించింది . కవి వేణు పాత్రలో శోభన్ బాబు ఇమిడి పోయారు. చక్కని హావభావాలను ప్రదర్శించారు.
కాస్త ఈ పాత్రకు దగ్గరగా ఉండే పాత్రనే చెల్లెలి కాపురంలో శోభన్ చేశారు. కవి ప్రేయసి పాత్రలో చలాకీగా జయసుధ నటించారు. మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకోవలసి వచ్చినప్పుడు,మాజీ ప్రియుని ఈసడింపుకు గురై వేదన పడే సన్నివేశాలలో బాగా నటించారు. ఈ మూడు ప్రధాన పాత్రల తర్వాత మనసుకు హత్తుకుపోయే పాత్రలు మాలిష్ రామదాసు , తోటి వేశ్య పాత్ర .
రామదాసు పాత్రలో రావు గోపాలరావు , తోటి వేశ్య పాత్రలో కె విజయ మనసున్న మనుషులుగా చక్కగా నటించారు. ఆపాత్రలను చక్కగా తీర్చిదిద్దారు. ఇతర పాత్రల్లో శ్రీధర్ , గిరిబాబు , నిర్మలమ్మ , మాడా , కె వి చలం , అల్లు రామలింగయ్య తదితరులు నటించారు .
ఈ సినిమాలో కవి సమ్మేళనంలో ఆరుద్ర ,వేటూరి కాసేపు తళుక్కుమంటారు. ఓ చిన్న పాత్రలో, సినిమాకు కీలక పాత్రలో మా నరసరావుపేట కళాకారులు A L నారాయణ కనిపిస్తారు. ఇందులో బిచ్చగాడిగా రైలు ఢీకొట్టడం వలన చనిపోతారు . అందరూ కవే చనిపోయాడని అనుకుంటారు .
ఎప్పుడో 1957 లో వచ్చిన ప్యాసా అనే హిందీ సినిమాకు రీమేక్ మన మల్లెపూవు సినిమా. హిందీ సినిమాలో గురుదత్ , వహీదా , మాలాసిన్హా నటించారు.పండిత పామరులను అలరింపచేసింది.ఆ మూలకథకు ఎలాంటి భంగం కలిగించకుండా వి మధుసూధనరావు దర్శకత్వం వహించారని చెప్పవచ్చు. కోదండరామిరెడ్డి ఈ సినిమాకు ఒక అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసారు.
గురుదత్తుతో శోభన్ బాబుని పోల్చలేం. కానీ వహీదా , మాలాసిన్హాల కన్నా లక్ష్మి , జయసుధలే బాగా చేసారు .ఇక చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసింది చక్రవర్తి సంగీతం. ఆ సంగీతానికి అమరత్వాన్ని ఇచ్చింది ఆరుద్ర , వేటూరి , వీటూరి సాహిత్యం . ఈరోజుకీ ఈ సినిమాలో పాటలు రస హృదయులను పలకరిస్తూనే ఉంటాయి . ‘నువు వస్తావని బృందావని ఆశగా చూసేనయా కృష్ణయా’ పాట. ఆ పాటలో పండరీబాయి , లక్ష్మిల నటన మరచిపోలేం.
‘చిన్న మాటా ఒక చిన్న మాట’ పాటలో సాహిత్యం , ఆ పాటలో లక్ష్మి నటన తప్పక ఆస్వాదించవలసిందే . ‘ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది .. మకరందం కన్నా తీయనిది’ పాట మరో గొప్ప పాట. ఆ తర్వాత శోభన్ బాబు , జయసుధల రెండు డ్యూయెట్లు కూడా అందంగా ఉంటాయి. బహుశా కాశ్మీర్లో తీసారేమో !
వీటూరి వారి ‘చకచకసాగే చక్కని బుల్లెమ్మ’ , వేటూరి వారి ‘ఓహో లలితా నా ప్రేమ కవితా’ పాటల్లో చక్కటి సాహిత్యాన్ని అందించారు ఇద్దరు కవులు. వేటూరి వారిదే మరో పాట ‘మల్లెపూవులా వసంతం మా తోటకి వచ్చింది’ బాగుంటుంది .‘జుంబాంబ జుంబాంబ’ మాలిష్ పాటను ఆరుద్ర వ్రాస్తే చక్రవర్తే పాడారు. బాగా హిట్టయిన పాట. ‘ఎవ్వరో వీరెవ్వరో’ అనే వేటూరి వారి పాట మానవుడు-దానవుడు సినిమాలోని ‘ఎవరు వీరు… ఎవరు వీరు ‘పాటను గుర్తుకు తెస్తుంది.
మల్లెపూవు లోని ఈ పాట ప్యాసాలో కూడా ఉంది. వేటూరి వారిదే మరో పాట ‘ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని’ గుండెకు హత్తుకుపోతుంది. ఆత్రేయ గారి క్లైమాక్స్ పాట’ బ్రతికున్నా చచ్చినట్టే ఈ సంఘంలో ‘అనే పాటలో ఇది మహోదయం అంటూ కాస్త ఎర్ర వాసనను కూడా తగిలించారు. సినిమాలో అన్ని పాటలను వి మధుసూధనరావు బాగా చిత్రీకరించారు.
మనసు సినిమా ఇది. కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండుతాయి . 46 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా పండిత పామరులను , రస హృదయులను అలరించటమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . విశాఖపట్నంలో వంద రోజులు ఆడింది . ఈతరంలో చూడని రస హృదయులు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . సినిమా అంతా చూసే సమయం లేకపోతే పాటల వరకయినా తప్పక చూడండి . మీ మనసులను అవి మీటుతాయి . An unmissable musical , emotional , literary classic .