Old people’s love story ………………………………..
‘ప్రణయం 1947’. ఈ సినిమా ఇద్దరి వృద్ధుల ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే.. సొసైటీ .. పిల్లలు ఎలా స్పందిస్తారు ? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న అంశాల ఆధారంగా కథ రాసుకుని అభిజిత్ అశోకన్ తెర కెక్కించారు.
దీని మాతృక ‘జననం 1947.. ప్రణయం తుడరున్ను’ గత ఏడాది విడుదలైంది. తెలుగు వెర్షన్ ఆహా లో స్ట్రీమ్ అవుతోంది.
శివన్న (జయరాజన్) 70 ఏళ్ల వృద్ధుడు. భార్య లేని ఒంటరి వాడు.ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుని దూరంగా ఉంటుంటారు. శివన్న సొంతూరిలో పొలం మధ్యలో కట్టుకున్న ఇంటిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. సిటీలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అదే ఆశ్రమంలో గౌరీ (లీలా) అనే ఆవిడ కూడా ఉంటుంది.
టీచర్ గా పనిచేసి రిటైర్ అయిన గౌరీ ని కొడుకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తాడు. గౌరీ అక్కడ ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. సొంతింటిపై బెంగ ఎక్కువ. ఓ సందర్భంలో శివన్న క్యాజువల్ గా అన్నమాటను సీరియస్ గా తీసుకున్న గౌరీ.. అతడితో పాటు అతడి ఇంట్లోనే కలిసి ఉంటానని అంటుంది. పిల్లలకు అంతగా ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఏమైందనేది తెరపై చూడాల్సిందే.
కథలో ఎక్కడా అనవసర పాత్రలుండవు. సినిమా చూస్తున్నంతసేపు చాలా హృద్యంగా ఉంటుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవు. సంభాషణలు పాత్రోచితంగా ఉంటాయి. సున్నితమైన హాస్యం, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, చిరుకోపం.. ఇలా ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా దర్శకుడు తెర కెక్కించారు.
శివన్న గౌరీకి ప్లేటులో ఒక ఇడ్లీ ఎక్కువగా పెట్టి తన ప్రేమని వ్యక్తపరచడం, అందరూ చప్పట్లు కొట్టే సన్నివేశం బాగుంటుంది. శివన్న రెండో కొడుకు ఇల్లు తాకట్టు పెట్టడానికి కాగితాలు తెచ్చి సంతకం పెట్టమని తండ్రిని అడిగిన సీన్,గౌరీ శివన్న కు సలహా ఇస్తే మీరు జోక్యం చేసుకోవద్దన్నపుడు ఆమె నొచ్చుకున్న సీన్ ఆకట్టుకుంటాయి.
ఇద్దరూ గిఫ్ట్ కోసం షాప్ కి వెళ్లడం.. శివన్న కు ఆరోగ్యం బాగా లేనపుడు గౌరీ అతగాడిని ఆసుపత్రిలో చేర్పించి సపర్యలు చేయడం .. నీకు తీరని కోరిక ఏమైనా ఉందా అని గౌరీ అడిగితే శివన్న కంగారు పడే సన్నివేశాలు చాలా నేచురల్ గా ఉంటాయి.
గౌరీ తన చివరి కోరిక తన భర్త సమాధి పక్కనే తన సమాధి నిర్మించాలని అంటుంది. గౌరీ చనిపోయినపుడు ఆమె చివరి కోరిక గురించి కొడుక్కి చెబితే అతగాడు పట్టించుకోడు. కోడలు చీదరించుకునే సన్నివేశాలు బాగా వచ్చాయి.
రాత్రి వేళ పొలం లోకి పందులు వచ్చినపుడు శివన్న రేకు డబ్బా తీసుకుని కర్ర తో కొడుతుంటాడు. ఒకరోజు గౌరీ ఆ శబ్దానికి మేలుకుంటుంది. ఆమె నిద్రలోనే చనిపోయినపుడు.. గాఢ నిద్రలో ఉందేమో అనుకుని శివన్న మరల రేకు డబ్బాపై కర్రతో కొట్టే సన్నివేశం హృద్యం గా ఉంటుంది.
సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. 50 ఏళ్ళు దాటిన వారికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. తల్లిదండ్రులు జీవితంలో ముప్పాతిక భాగం పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటారు. కానీ ముసలితనంలో మాత్రం వీళ్లని కొడుకులు దూరం పెడుతుంటారు.
ఎంతో మంది ఒంటరితనాన్ని భరిస్తూ బతుకుతున్నారు. వృద్ధాప్యంలో తమకు ప్రేమని పంచే ఓ తోడు ఉంటే బాగుండు అనుకునే తల్లిదండ్రుల మనోవేదనకు దృశ్య రూపం ఈ సినిమా. ప్రేమకు వయసుతో సంబంధం లేదని విషయాన్ని తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
పిల్లలు తమను కాదనుకోవడంతో అటు ఆశ్రమాల్లో ఉండలేక.. ఇటు ఇంటికి వెళ్లలేక లోలోపల మధనపడే పెద్దల బాధని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. శివన్నగా జయరాజన్ , గౌరీ టీచర్ గా లీలా సామ్సన్ పాత్రల్లో జీవించారు.
మిగిలిన నటులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. గోవింద్ వసంత సంగీతం , నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. సంతోష్ అనిమా కెమెరా పనితీరు బాగుంది. కుటుంబం మొత్తం నిరభ్యంతరం గా ఈ సినిమా చూడవచ్చు.
thanks for intro