Peaceful death ……………….
కొందరు వ్యక్తులు ముందు రోజు రాత్రి కూడా మనకు కనబడి ఉంటారు.మనతో మాట్లాడి ఉంటారు.కానీ తెల్లవారేసరికి వారు మరణించారని తెలిసి ఆశ్చర్యపోతాం.కొందరు మధ్యాహ్నం/రాత్రి భోజనం చేసి నిద్రపోతారు.
ఆ నిద్రలోనే చనిపోతారు. మర్నాడు ఆ విషయం తెలిసి బాధ పడతాం.అలాగే కొడుకు/కూతురు దగ్గరికి బయలు దేరి బస్ లో కూర్చొని లేదా రైల్లో నిద్రపోతూ ఆ నిద్రలోనే చనిపోయే వారు కూడా ఉన్నారు.
ఇలా ఇహాన్ని వదిలి .. అకస్మాత్తుగా దూరమై పోయేవారు ఎంతో మంది ఉంటారు. నిత్యం ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కొన్ని మన దృష్టికి రావచ్చు. మరికొన్ని రాకపోవచ్చు. ఒక విధంగా చూస్తే ఇలాంటి అనాయాస మరణాలు మంచివేమో.
ఆసుపత్రుల్లో చేరి ఇబ్బందులు పడుతూ కొడుకులు, కోడళ్ళు ఏమనుకుంటున్నారో ? డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని మధనపడుతూ … సమయానికి సేవలు అందించే వారు లేక కష్టపడుతుంటారు. కొందరు ఆసుపత్రుల్లో చేరి రకరకాల ట్రీట్మెంట్ తీసుకుంటూ, దారుణమైన శారీరక యాతన అనుభవిస్తూ చనిపోతుంటారు.
కొన్నిసందర్భాలలో ముఖ్యం గా నగరాల్లో తల్లిదండ్రులకు సేవలు చేయలేక ఇబ్బంది పడుతుంటారు.ఉద్యోగ పరంగా సెలవులు దొరకక తీవ్రమైన ఒత్తిడి కూడా ఎదుర్కొంటుంటారు. అది చూసి మంచాన ఉన్నవారు మరీ కృంగి పోతుంటారు. ఇలాంటి కేసులెన్నోఉన్నాయి.
ఇంకొందరు పిల్లలు పట్టించుకోని నేపథ్యంలో ఇళ్లలోనే చావు ఎపుడు వస్తుందా అని రోజూ దేవుడిని ప్రార్ధిస్తుంటారు.అదొక నరకం. పాపం వాళ్ళను పట్టించుకునే వారు ఉండరు. కరోనా సమయంలో అయితే కొందరు మరీ ఘోరంగా చనిపోయారు.మృతదేహాన్నికూడా బంధువులు తీసుకెళ్లని, తీసుకెళ్లలేని వారూ ఉన్నారు.
మొత్తం మీద ఆసుపత్రి మెట్లు ఎక్కకుండా, ఎలాంటి పెద్ద రోగాల బారిన పడకుండా .. తిరుగుతూ .. తిరుగుతూనే మరణించడం నిజంగా గొప్ప వరం. అనాయాస మరణం అది అందరికి దొరకదు. అది దొరికిన వారు నిజంగా పుణ్యాత్ములే.అలాంటి మరణాన్ని ప్రసాదించమని పెద్దవాళ్ళు దేవుడిని కోరుకుంటూఉంటారు. పాపం దేవుడు మాత్రం ఎంతమంది మొర ఆలకిస్తాడు ?