Subramanyam Dogiparthi ……..
సుత్తి అనే పదం ఆవిర్భావం ..సుత్తి వేయడం ఎన్నిరకములో రచయిత జంధ్యాల ఈ
సినిమాలో వివరించినతీరు అద్భుతంగా ఉంటుంది. ముందుగా సుత్తి పుట్టుక గురించి తెలుసుకుందాం.
త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడిని అయోధ్యకు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడివి కమ్మని భరతుడు ప్రార్ధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు భరతుడికి తాను ఎందుకు తిరిగి రాలేనో , భరతుడే ఎందుకు రాజ్యపాలన చేసుకోవాలో తెలుపుతాడు.
అంతా విన్న తర్వాత భరతుడు ఇంత ‘సుత్తి వేయాలా’ అన్నయ్యా అని శ్రీరాముడితో అంటాడు. ఇలా మొదటిసారి త్రేతాయుగంలో భరతుడి నోటి వెంట పుట్టిందని ఈ ‘నాలుగు స్తంభాలాట’ సినిమాలో సుత్తి వేలు చేత జంధ్యాల ఉవాచించారు.
అప్పుడు కాబట్టి జనం విన్నారు. నవ్వుకున్నారు.ఇప్పుడయితే మా రాముడిని ఎగతాళి చేస్తావా, మా రామాయణాన్ని వక్రీకరిస్తావా అంటూ అనంత శ్రీరాముడు హూంకరించేవాడు…. జంధ్యాల కనబడని లోకాలకు వెళ్లి బతికిపోయాడు.
ఇంక వివిధ రకములు ఎట్టివనిన : ఇనుప సుత్తి (Iron hammering) , రబ్బర్ సుత్తి (Rubber/smooth hammering) , సామూహిక సుత్తి (రాజకీయ నాయకులు జనానికి వేసే Mass hammering) , ఎదురు సుత్తి (Riverse hammering) , వదలకుండా చాలాసేపు వేసే ధీర్ఘకాల సుత్తి (Prolonged hammering) . ఇవండీ జంధ్యాల సుత్తి రకాలు.
జంధ్యాల తన నాటికల్లో కూడా ఇలాగే కొన్నిపదాలను జనంలోకి వదిలేవారు. మా మిచ్చరు బండబ్బాయి చెప్పాడు , మా పాలబ్బాయి చెప్పాడు…వగైరా.. అలాగే ఈ సినిమాలో సుత్తిని , సుత్తి జంటను తెలుగు వారికి అందించారు. ఈ 43 ఏళ్ల నుంచి చిన్నాపెద్దా , పండిత పామరులు అందరికీ నానుడి పదమయిపోయింది.
ముద్దమందారం సినిమా తర్వాత లేత ప్రేమికులతో తీసిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ బ్రహ్మాండంగా పొందింది . కేవలం 12 లక్షల రూపాయల బడ్జెటుతో ,పెద్దగా పాపులర్ కాని నటీనటులతో తీసారు ఈ సినిమాను . 1+2 కధ కాదు . ఏకవీర లాగా అటూఇటూ అయిన ప్రేయసిల కధ కాదు.
ఇద్దరు ప్రాణమిత్రుల్లో ఒకరు అనుకోకుండా , తన ప్రమేయం లేకుండా తన మిత్రుడు ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అప్పటికే గర్భవతి అయిన మిత్రుడి భార్యను చెల్లెలు లాగా చూసుకుంటాడు . ఈ జంటగా ప్రదీప్ , పూర్ణిమలు నటించారు. పూర్ణిమను ప్రేమించిన నరేష్ అన్నావదినల మాట మేరకు మేనమామ కూతురు తులసిని పెళ్ళి చేసుకుంటాడు..
పెళ్ళయితే చేసుకున్నాడు కానీ కాపురం చేయలేకపోతాడు. పూర్ణిమ ఆత్మహత్య చేసుకుని సినిమాకు ముగింపు పలుకుతుంది. ఇలా నలుగురు నాలుగు స్థంభాలాట ఆడుతారు. విధి ఆడిస్తుంది. రొటీన్ కి భిన్నంగా కధను నేయటమే కాకుండా చక్కని కధనంతో అందాల విశాఖ ప్రాంతంలోని ప్రకృతిని అద్భుతంగా ఉపయోగించుకున్నారు జంధ్యాల.
విశాఖ, భీమిలి, అరకు లోయ,యారాడ ప్రాంతాలలోని లొకేషన్లను కన్నులకింపుగా తెర పై కెక్కించారు. అప్పటికే పెద్ద నటిగా, నిర్మాతగా,దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న మా నరసరావుపేట వనిత విజయనిర్మల తన కుమారుడు నరేష్ ని జంధ్యాల సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసారు.
ఒక విధంగా మంచికే జరిగింది. ఆ తర్వాత మరెన్నో మంచి సినిమాల్లో హాస్యనటుడిగా నరేష్ నటించాడు. ఇప్పటికి కీలక పాత్రలు చేస్తున్నాడు. అలాగే సుత్తి జంట . ఈ సినిమాకు ముందే కొన్నిచిన్నాచితకా పాత్రల్లో నటించిన వీరభద్రరావు, వేలులకు ఈ సినిమా తో బ్రహ్మాండమైన బ్రేక్ వచ్చింది.
చాలా సినిమాల్లో హాస్య జంటగా, కేరెక్టర్ ఆర్టిస్టులుగా ఒక వెలిగారు. రేలంగి-రమణారెడ్డి , కోట శ్రీనివాసరావు-బాబూమోహన్ జంటల్లాగా వీర పాపులర్ అయింది ఈ సుత్తి జంట . ‘నిన్నూ ఈ దేశాన్ని బాగుచేయటం నావల్ల కాదు’ అనే పడికట్టు పదం కూడా నూతన్ ప్రసాద్ ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది లాగా’ నానుడి మాట అయిపోయింది.
జంధ్యాల డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇతర ప్రధాన పాత్రల్లో రోహిణి, డబ్బింగ్ జానక, అన్నపూర్ణ , కాకినాడ శ్యామల, విజ్జి బాబు , ఆలీ , ఎంతో మంది ఔత్సాహికులు , రంగస్థల నటులూ నటించారు.
రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా చినుకులా రాలి అనే పాట బాగా హిట్టయింది కూడా . రాగమో అనురాగమో , కలికి చిలకురా , దొరల నీకు పాటలు శ్రావ్యంగా ఉంటాయి . కొబ్బరాకు గాలి అనే పాట చాలా బాగా వ్రాసారు వేటూరి. అన్ని పాటలూ ఆయనే వ్రాసారు.
బాల సుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ జానకిలు పాడారు . పాటల చిత్రీకరణ విషయంలో దర్శకుడిని , ఫొటోగ్రఫీ డైరెక్టర్ గోపాలరెడ్డిని , కెమేరామేన్ రఘుని ప్రత్యేకంగా మెచ్చుకోవాలి . 1982 ఏప్రిల్ పదిహేనున రిలీజయిన ఈ సినిమా ఎనిమిది సెంటర్లలో వంద రోజులు , అదీ పిల్ల హీరోహీరోయిన్లతో ఆడింది.
హైదరాబాద్ దేవి థియేటరుతో సహా మూడు కేంద్రాలలో సిల్వర్ జూబిలీ కూడా చేసుకుంది . ప్రముఖ దర్శకుడు ఇ వి వి సత్యనారాయణ ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. 1983లో ప్రముఖ నిర్మాత వి బి రాజేంద్రప్రసాద్ హిందీలోకి ‘ బేకరార్’ టైటిలుతో రీమేక్ చేసారు. సంజయ్ దత్ , పద్మిని కొల్హాపురి , సుప్రియా పాథక్ , మోహిష్ బెహ్ల్ నటించారు .
సినిమా, పాటల వీడియోలు,సుత్తి జంట సీన్లు ,ఇతర ముఖ్య సన్నివేశాలు అన్నీ యూట్యూబులో ఉన్నాయి. మాతరంలో వారందరూ చూసే ఉంటారు. ఈనాటి కుర్రతరంలో చూడనివారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి.
సప్తపది సినిమాలోలాగా మరీ విప్లవాత్మక ముగింపుని ఇవ్వలేదు జంధ్యాల. సాధ్యం కాదు కూడా. కారణం అప్పటికే నరేష్ కి పెళ్లి అయింది కాబట్టి.అందుకే పూర్ణిమ పాత్రను చంపేసారు. సరైన ముగింపే.. నవతా కృష్ణంరాజు నిర్మించిన సినిమా ఇది.