‘కన్యాశుల్కం’ సినిమాకు 70ఏళ్ళు ..నెగటివ్ పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్!!

Sharing is Caring...

A popular Telugu play…………

ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే  ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు.

ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ రిలీజ్ లో బాగా ఆడింది. కొన్ని చోట్ల వందరోజులు ఆడింది. చిత్ర పరిశ్రమలో అదొక రికార్డు.గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటి సమాజ స్థితికి అద్దం పట్టిన నాటకం. దాన్ని యధాతధంగా తీయడం చాలా కష్టమైన విషయం. దర్శకుడు పి.పుల్లయ్య బాగానే కసరత్తు చేశారు.

ఆయనకు ప్రముఖ రచయిత సదాశివ బ్రహ్మం సహకరించారు. సినిమాకు డైలాగులు కూడా ఆయనే రాశారు. తెలుగు ప్రజలకు అందరికి తెలిసిన నాటకం కాబట్టి జాగ్రత్తలు తీసుకుని దాన్నొక మాస్టర్ పీస్ గా రూపొందించారు.అయినప్పటికీ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. 

నాటకాన్ని చెడగొట్టారని.. వితంతువులను మోసం చేసే గిరీశం పాత్రను మంచివాడిగా మార్చివేశారని, ఎన్టీఆర్‌ కోసం ఈ మార్పులు చేశారని అప్పట్లో నాటక ప్రియులు అభిప్రాయపడ్డారు.ఈ విమర్శల పట్ల నిర్మాత, దర్శకులు స్పందించలేదు

సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కూడా నటించి మెప్పించారు.వాటిలో ‘కన్యాశుల్కం’ లోని ‘గిరీశం’ పాత్ర ఒకటి. ఎన్టీఆర్ ఆ పాత్రను చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆ సినిమా తీసే నాటికి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు. 

నిర్మాత డీఎల్ నారాయణ వెళ్లి ఎన్టీఆర్ ను సంప్రదించారు. అప్పటికే ‘దేవదాసు’ తో మంచి హిట్ కొట్టిన డీఎల్ కూడా మంచి ఊపులో ఉన్నారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని సినిమా తీస్తున్నామని అనగానే ఎన్టీఆర్ ఒకే అన్నారు. గిరీశం పాత్ర ఎలా ఉంటుందో తెలిసే ఆయన అంగీకరించారు.అప్పటికి ఎన్టీఆర్ చిత్రపరిశ్రమ కొచ్చి ఐదేళ్లు అయింది.

ఎన్టీఆర్‌ గిరీశం పాత్రలోకి  పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. తెలివితేటలు, చమత్కారం, అవకాశవాద లక్షణాలు కలగలసిన గిరీశం పాత్రకు తన అసమాన నటన తో ఎన్టీఆర్ జీవం పోసి మెప్పించారు ..గిరీశం పాత్రకుండే బలహీనతలు, వ్యంగ్యధోరణిని పూర్తిగా ఆకళింపజేసుకున్న ఎన్టీఆర్ హుషారుగా నటించి ప్రేక్షకుల మన్నన పొందారు.మొదట్లో ఈ పాత్రకు అక్కినేని నాగేశ్వరరావు ని అనుకున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అది నిజం కాదని నిర్మాతలు తర్వాత కాలంలో ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మధుర వాణిగా సావిత్రి నటన అమోఘం. మరొకరు ఆలాచేయలేరు.‘లొట్టిపిట్ట’ గురించి చెప్పే సన్నివేశంలో మధురవాణి రామప్పంతుల్ని ఆటపట్టిస్తూ రెండుమూడు నిమిషాలు అలా నవ్వుతూనే వుంటుంది. ఈ సీన్ లో సావిత్రి నటన అద్భుతం.సినిమాలోని ప్రధాన పాత్రల్లో సావిత్రి పాత్ర వేసిన మధురవాణి ఒకటి.

కన్యాశుల్కం’ సినిమా చూసిన వారికి లుబ్ధావధాన్లు గా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు పాత్ర పోషణ బాగా నచ్చుతుంది. తమాషా ఏమిటంటే ఆయన రంగస్థలం మీద గిరీశం’ పాత్ర వేసేవారట. సినిమా కొచ్చేసరికి తారు మారు అయింది. అయినప్పటికీ లుబ్ధావధాన్లు గా మెప్పించారు.

ఇక రామప్ప పంతులుగా సీఎస్సార్‌ నట విన్యాసాన్ని ప్రేక్షకులు మరిచిపోలేరు. అగ్నిహోత్రావధానులుగా వి.రామన్న పంతులు గారు అదరగొట్టేసారు. ఇందరు హేమాహేమీలు నటించడం గొప్ప విషయం.

అమాయకపు బుచ్చమ్మ గా జానకి, పూటకూళ్లమ్మగా ఛాయాదేవి తమ పాత్రల్లో జీవించారు.దర్శకుడు ప్రధాన పాత్రలను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించారు.ఈ సినిమాకు నాటి ప్రముఖ రచయిత సదాశివబ్రహ్మం సంభాషణలు రాశారు. ‘సరసుడ దరి చేరరా…’ అనే పాటను కూడా ఆయనే అందించారు.

ఘంటసాల సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘ఆనందం అర్ణవమయితే’ కవితనే పాటగా మలుచుకున్నారు. అలాగే దేవురపల్లి రాసిన ‘చేదాము రారే కల్యాణం’ పాట కూడా బాగుంటుంది. గిరీశంపై చిత్రీకరించిన ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం’ పాటను మల్లాది వారు రాశారు. ‘చేదాము రారే కల్యాణం’ అంటూ సాగే బొమ్మల పెళ్లి పాటలో బాలనటిగా శారద నటించడం విశేషం.

ఇతర పాత్రల్లో గుమ్మడి, వంగర, పద్మనాభం, సూర్యకాంతం,హేమలత తదితరులు నటించారు. ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది … చూడని వారు చూడవచ్చు. చూసిన వారు మరల చూడవచ్చు.

————KNM

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!