ఉక్రెనియన్ల సాయం కోసం నిధుల సమీకరణకు బ్రిటన్ నడుం బిగించింది. ఇందుకోసం తాజాగా నిర్వహించిన వేలం పాటలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఖాకీ జాకెట్.. ఏకంగా రూ.85.46 లక్షల (90 వేల పౌండ్లు)కు అమ్ముడుపోవడం విశేషం.
లండన్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రారంభ ధర 50 వేల పౌండ్ల వద్ద మొదలైంది. ఉక్రెయిన్ నిధుల సమీకరణలో బిడ్డింగ్ ప్రారంభానికి ముందు జిలెన్స్కి వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.
రష్యా దండయాత్ర నేపథ్యంలో జెలెన్స్కీ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ప్రశంసలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన తన ట్రేడ్మార్క్ గ్రీన్ మిలిటరీ దుస్తులకు ప్రసిద్ధి. ఖాకీ జాకెట్ ధరించి.. రాజధాని కీవ్లో పర్యటించిన చిత్రాలు పలు సందర్భాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
వేలంలో ఈ జాకెట్ ప్రారంభ ధరను 50 వేల పౌండ్లుగా నిర్ణయించగా.. మరింత ఎక్కువకు కొనుగోలు చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్కడున్నవారికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే భారీ ధరకు అమ్ముడుపోయింది. బోరిస్ జాన్సన్ గతంలో జెలెన్స్కీతో కలిసి కీవ్ వీధుల్లో పర్యటించిన సందర్భంగా అందుకున్న కాకరెల్ జగ్ సహా అనేక వస్తువులనూ వేలంలో ఉంచారు.
ఈ విపత్కర సమయంలో ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడం ద్వారా.. పురాతన యూరోపియన్ నగరం కీవ్కు మళ్లీ ఎప్పటికీ ముప్పు ఉండదని, ఆ దేశం మరోసారి స్వేచ్ఛగా మనగలుగుతుందని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ ప్రజల స్ఫూర్తిని పుతిన్ ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేరని ప్రకటించారు. ఈ సందర్భంగానే.. బ్రిటన్ చేస్తున్న సాయానికి జెలెన్స్కీ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధ సంక్షోభిత ఉక్రెయిన్ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి నుంచి బ్రిటన్ అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.