గాల్వన్ లోయలో ఘర్షణలు ఎందుకో ?

Sharing is Caring...

Galvan Valley………………………………………….మనం తరచుగా గాల్వన్ లోయ గురించి వింటుంటాం. ఆ మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా భారత్ సైనికుల మధ్య ఘర్షణ జరిగి 20 మంది భారత్ సైనికులు చనిపోయారు. ఈ ఘటన ప్రజలలో ఉద్రేకాన్నికూడా రగిలించింది. ఈ లోయ అసలు ఎక్కడుంది ? ఈ గాల్వన్ లోయ ప్రాధాన్యత ఏమిటి ? అనే విషయాల్లో కెళితే ఈ లోయకు చాలా చరిత్రే ఉంది.

గాల్వన్ లోయ లడఖ్ ప్రాంతంలో ఉంది. చైనా భారత్ సరిహద్దు ప్రాంతం. నిటారు గా ఉన్న రెండు పెద్ద కొండల మధ్య ఉన్న లోయ గుండా గాల్వన్ నది ప్రవహిస్తున్నది. ఆపేరు మీదనే లోయ ఏర్పడింది. గాల్వన్ నది చైనా పాలనలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతం నుండి మన దేశంలోని లడఖ్ ప్రాంతానికి ప్రవహిస్తుంది. ఇది కరాకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న కారవాన్ క్యాంప్‌ సైట్ సామ్‌జంగ్లింగ్ సమీపంలో పుట్టి .. పశ్చిమానికి ప్రవహించి శ్యోక్ నదిలో కలుస్తుంది. ఈ శ్యోక్ నది సింధు నదికి ఉపనది, గాల్వన్ నది ని సింధునది లో భాగం గా చెప్పుకోవచ్చు.

గత అరవై ఏళ్లుగా ఈ గాల్వన్ లోయ ప్రాంతం తమదే అని చైనా వాదిస్తోంది. అదును దొరికినపుడు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నది. ఈ కారణంగానే అపుడపుడు ఘర్షణలకు దిగుతుంటోంది.ఇక్కడి సరిహద్దు ప్రాంతం ఇప్పటికి నిర్దారణ కాలేదు. చైనా ఏ సమయంలో ఏమి చేస్తుందా అని భారత్ ప్రభుత్వం గాల్వన్ లోయ వద్ద పెద్ద ఎత్తున కాపలా పెట్టింది. చైనా కూడా అటు పక్క పహారా పెట్టింది.రెండు దేశాల సైనికులు కళ్ళలో వత్తులు వేసుకుని కాపలా కాస్తుంటారు. చైనా అపుడపుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా …  భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్నది.

గత 46 ఏళ్లుగా భారత్ సైనికులు ఇక్కడ కాపలా కాస్తున్నపటికి పెద్దగా ఘర్షణలు జరగలేదు. గత ఏడాది ఒక్కసారి జరిగింది. ఆ ఘర్షణలోనే మన సైనికులు చనిపోయారు. చైనా సైనికులు చనిపోయినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ సమయం లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరగబోయే వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

ఇక ఇక్కడ కాపలా కాయడమంటే చాలా కష్టంతో కూడిన వ్యవహారమే. సైనికులు ఎన్నో ఇబ్బందులు పడుతూ దేశ భద్రత కోసం శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతంలో చైనా తో పోరాటం కంటే ప్రకృతితో పోరాట చేయడమే కష్టమే. ఇది చాలా ఎత్తైన ప్రాంతం. వాతావరణం అనుకూలంగా ఉండదు. మంచు ఎడారి తరహాలో ఉంటుంది. మంచు ఎక్కువగా కురుస్తుంటుంది. ఎటు చూసినా కొండలు, లోయలు, మంచు వర్షాలు, గాలులతో మనుష్యులు గడ్డకట్టి పోయేలా వాతావరణం ఉంటుంది.

మౌలిక సదుపాయాలూ ఏమి ఉండవు. కొండలపై ఉండే సైనిక పోస్టులకు నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా లోయలో పడి పోయే ప్రమాదం ఉంది. ఈ వివాదాస్పద ప్రాంతంలో అపుడపుడు చైనా సైనికులు తారసపడుతుంటారు. ఆ సమయంలో తోపులాటలు .. చిన్న ఘర్షణలు జరుగుతుంటాయి.ఈ గాల్వన్ లోయ ప్రాంతంలో పనిచేసే సైనికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా ఎదుర్కొనే విధంగా తర్ఫీదు ఇస్తారు. ఆ తర్వాతే సైనిక పోస్టుకు పంపుతారు. సైనిక పోస్టుల వద్ద కూడా సదుపాయాలు తక్కువే. ఈ సైనిక పోస్టులను త్వరగా చేరేందుకు గాల్వన్ నది ప్రాంతంలో ఒక వంతెన ను ప్రభుత్వం నిర్మించింది.

అటు చైనా కూడా తక్కువేమి తినలేదు. తన భూభాగంలో భారీ నిర్మాణాలు చేపట్టింది. అప్పట్లో వంతెన నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చైనా కవ్వింపు చర్యలకు దిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత భారత్ వెనుకడుగు వేయకుండా వంతెన నిర్మాణాన్ని గత ఏడాది పూర్తి చేసింది. గాల్వన్ ప్రాంతంలో గస్తీ ని పటిష్టం చేసింది.

———- KNM

 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!