ఆ దేవుడినే హిజ్రాలు ఎందుకు పెళ్లి చేసుకుంటారో ?

Sharing is Caring...

Hijra weddings in a different way……………………… 

మనకు  ప్రతిరోజు  బస్టాండ్ లో, రైల్వే స్టేషన్లలో, షాపుల వద్ద హిజ్రాలు కనిపిస్తుంటారు. అలా వారిని చూసినప్పుడు కొంతమంది  ఈసడించుకుంటారు. మరికొందరు అసహ్యించుకుంటారు.కొందరైతే వారికి దూరంగా ఉంటారు. అలాంటి హిజ్రాల లో తెలివైనవారు ఎందరో ఉన్నారు. చదువుకున్న వారు, ఉద్యోగం చేసేవారు, వ్యాపారాలు చేసేవారు కూడా ఉన్నారు.

హిజ్రాల జీవితాల్లో ఎన్నో రహస్యాలు దాగివుంటాయి. అందుకే వారి జీవితం ఎలా సాగుతుంది? వారికి వివాహాలు జరుగుతాయా? వారు జంటగా ఉన్నప్పుడు స్త్రీ, పురుష పాత్రలను పోషిస్తారా ? లేదా ?అనే సందేహాలు కలుగుతుంటాయి.నిజానికి  ప్రతీ హిజ్రా తన జీవితంలో ఖచ్చితంగా వివాహం చేసుకుంటారు. అయితేవారు ఒక రాత్రికి మాత్రమే వధువుగా మారుతారు. ఇదేమీ విచిత్రం కాదు. వారి సమాజంలో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది.

మన సమాజంలో హిజ్రాలను ప్రత్యేకంగా చూస్తుంటారు. అందుకే హిజ్రాలు తమకంటూ ఒక సమాజాన్ని సృష్టించుకుంటారు. వారి అంత్యక్రియలు, వివాహాలు వారి సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా కొనసాగుతాయి.దక్షిణ భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే హిజ్రాల ఉత్సవాన్ని కూవగం జాతర అని అంటారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఏప్రిల్ 18న ప్రారంభమై మే 03 వరకు జరిగింది.

ఇందులో మే 02, 03 తేదీల్లో హిజ్రాల వివాహాలు జరిగాయి. ఈ జాతర తమిళనాడులోని కూవగం అనే గ్రామంలో జరుగుతుంది ఈ జాతర 18 రోజుల పాటు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుండి హిజ్రాలు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశం తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

హిజ్రాల దేవుడిగా భావించే అరవాన్ దేవతకు వారు ఆరోజుల్లో పూజలు చేస్తారు.జాతరలో హిజ్రాల కళ్యాణం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. దీని వెనుక ఓ పురాణ కథ ఉంది. మహాభారతంలో అరవన్ అనే దేవుని పేరు ప్రస్తావనకు వస్తుంది. అతను.. అర్జునుడు- యువరాణి ఉలూపి కుమారుడు. మహాభారత కథ ప్రకారం యుద్ధ సమయంలో కాళీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు అరవన్‌ తనను తాను త్యాగం చేసుకునేందుకు సిద్ధమవుతాడు.

అయితే పెళ్లి కాకుండా చనిపోవడం ఇందుకు అనువైనది కాదనేది షరతు. అటువంటి పరిస్థితిలో శ్రీ కృష్ణుడు మోహిని రూపాన్ని ధరించి అరవన్‌ను వివాహం చేసు కున్నాడట. అరవన్‌ మరణించిన మరుసటి రోజు ఉదయం మోహిని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు వితంతువులా రోదించాడని చెబుతారు.

ఈ కథను ఆధారంగా చేసుకుని హిజ్రాలు అరవన్‌ను ఒక రోజు వివాహం చేసుకుంటారు. మరుసటి రోజు వారు వితంతువులుగా మారి పెద్దపెట్టున విలపిస్తారు. పెళ్లి రోజన హిజ్రాలు అరవన్‌ను తమ భర్తగా భావించి, తమను తాము నవ వధువులా అలంకరించుకుంటారు.

ఆలయ పూజారులు వారికి మంగళసూత్రం ధరించేలా ఏర్పాట్లు చేస్తారు. మరుసటి రోజు వారు అరవన్ చనిపోయినట్లు భావించి, వితంతువులు అవుతారు. అప్పుడు హిజ్రాలు తమ అలంకరణను తొలగించుకుని పెద్ద పెట్టున రోదిస్తారు.

దేవుడిని పెళ్లాడే మహిళలు 
ఇక ఇదే రీతిలో  జోగినీలు శివుడిని వివాహమాడుతుంటారు.  తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం లో శివరాత్రి తరువాత సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. వేలాది భక్తులు తరలివచ్చి రాములోరి కళ్యాణాన్ని తిలకిస్తుంటారు. ఈ కళ్యాణానికి ఓ ప్రత్యేకత ఉంది.ఓ వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే..మరో వైపు శివుడిని తమ నాథుడిగా భావించి..జోగినిలు వివాహమాడతారు. ఈకళ్యాణం లో మహిళలు  శివుడిని పరిణయం ఆడే సాంప్రదాయం చాలా కాలం నుంచి వస్తున్నదే. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!