తెరాస సర్కార్ పై ఉన్న అంతో ఇంతో వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థి రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఆయనకు మొత్తం ఓట్లు 89,299 ఓట్లు వచ్చాయి. ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరెడ్డి కి 26,799 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రఘునందనరావు కి 22,595 ఓట్లు వచ్చాయి. ఇక 2014 లో జరిగిన ఎన్నికలో రామలింగారెడ్డి మెజారిటీ 37,925 ఓట్లు మాత్రమే. అప్పటితో పోలిస్తే 2018 లో ఆయనకు మెజారిటీ బాగా పెరిగింది . అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చెరకు ముత్యం రెడ్డి కి 44,309 ఓట్లు వచ్చాయి. 2018 లో అదే కాంగ్రెస్ కి ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్ శ్రేణులు తెరాస లో చేరడం ఒక కారణం కావచ్చు.
బీజేపీ రఘునందనరావు కి 2014 లో కేవలం 15,131 ఓట్లు మాత్రమే దక్కాయి. 2014 తో పోలిస్తే 2018లో బీజేపీకి ఓట్లు కొంత మేరకు పెరిగాయి. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని అధిగమించలేకపోయారు. రఘునందనరావు తృతీయ స్థానంలోనే నిలిచారు. ఇపుడు మళ్ళీ రంగంలోకి దిగిన రఘునందనరావు పై రెండు సార్లు ఓడిపోయారనే సానుభూతి కొంత ఉంది. క్యాడర్ కొంత పెరిగింది. పార్టీ అండదండలున్నాయి. ఇవన్నీకలసి గత ఎన్నికల్లో తెరాస కు వచ్చిన 62 వేల మెజారిటీని తగ్గించగలవా? అనేది అసలు ప్రశ్న. అదంత సులభం కాదు. అలాగని పూర్తిగా త్రోసి పుచ్చలేం.
ఇక తెరాస అభ్యర్థి పై కూడా కొంత సానుభూతి ఉంటుంది. దాని ప్రభావం వల్ల ఓట్లు పెరుగుతాయా ? లేదో చూడాలి. ఇక్కడ గెలుపు బాద్యత తెరాస నేత హరీష్ రావు కి అప్పగించారు. తానే అభ్యర్ధిలా హరీష్ దూసుకుపోతున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నిక వైపే కన్నెత్తి చూడలేదు. బావకి అప్పగించిన బాధ్యతలో దూరడమెందుకని దూరంగా ఉన్నట్టుంది. ఇక హరీష్ రావు … రఘునందనరావు లు కూడా స్నేహితులే. ఎక్కడైనా స్నేహం కానీ ఎన్నికల్లో కాదని ఇద్దరు పోరాడుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా చెరకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి రంగంలోకి దిగినందున తండ్రి పలుకుబడి,పేరు ప్రతిష్టలను ఉపయోగించుకుని ఏమేరకు దూసుకుపోగలరో…. ఎన్ని ఓట్లు చీల్చ గలరో చూడాలి. ఆ చీలిక ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో ? ఎన్నికల తర్వాత కానీ తేలదు. తమాషా ఏమిటంటే ఇపుడు బరిలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ అభ్యర్థులు తెరాస నేపధ్యం ఉన్నవారే.
బీజేపీ దూకుడు వల్ల తెరాస నేతలు కూడా నియోజకవర్గం పై పట్టు బిగించే యత్నాలు చేస్తున్నారు. ఓటర్లు జారి పోకుండా శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇక్కడ ఎన్నిక త్రిముఖం కావడంతో వ్యతిరేక ఓటు ఉంటే అది ఖచ్చితంగా చీలిపోతుంది. అదే ద్విముఖం అయితే తెరాస చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. తెరాస సర్కార్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందా ? ఉంటే దానికి ఈ ఎన్నిక అద్దం పడుతుందా? లేదా ? వేచి చూద్దాం.