సుదర్శన్ టి………………………….
2017 లో GST అమలు చేయడానికి ముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఉదాహరణకు వివిధ రాష్ట్రాల్లో టాక్సుల ధరలు వేర్వేరుగా ఉండేవి. టాక్సులు ఎగ్గొట్టి అధిక లాభాలు సంపాదించడానికి దాదాపు అన్ని వస్తువులు రాష్ట్రాల మధ్య స్మగ్లింగ్ అయ్యేవి.
అలాగే ఇంకో పెద్ద సమస్య.. వస్తువుల తయారీ విషయంలో కూడా ఉండేది. ఉదాహరణకు ముంబై ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువు బెంగళూరులో అమ్మాలంటే చాలా నియమాలు ఉండేవి సేల్స్ ట్యాక్స్ ఇబ్బందులు ఉండేవి ఎక్కువ ఖర్చు అయ్యేది.అలాగే ఒక MNC కంపెనీ ఇండియాలోకి రావాలి అనుకున్నప్పుడు వాళ్లకు అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేర్వేరు లైసెన్సులు తీసుకోవాల్సి వచ్చేది.
కొన్ని రాష్ట్రాల్లో లైసెన్సు పొందడానికే చాలా సమయం, డబ్బు వృధా అయ్యేది. అలాంటి సమస్యలు చాలా ఉండేవి. వీటిని అధిగమించడానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక దేశం, ఒకే ట్యాక్స్ అనే నినాదంతో GST తీసుకొచ్చింది. కానీ అమలు చేయలేకపోయింది.తర్వాత వచ్చిన మోడీ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి GST ని అమలు చేసింది. GST వల్ల వ్యాపారులకు కొన్ని కొత్త సమస్యలు వచ్చాయి కొన్ని పాత సమస్యల నుండి ఉపశమనం లభించింది. అది పూర్తిగా వేరే టాపిక్.
2017లో GST అమలు చేయడానికి చాలా రాష్ట్రాలు అంగీకరించని సమయంలో రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని పూడ్చడానికి కేంద్రం-రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ని రాష్ట్ర ఆదాయాన్ని బేస్ గా తీసుకుని ప్రతి సంవత్సరం 14% రెవెన్యూ వృద్ధిని చేర్చి రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేలా ఒప్పందం జరిగింది.
అంటే ఒక రాష్ట్ర ఆదాయం 2015-16 లో లక్ష కోట్లు ఉంటే 2016-17కు రాష్ట్రానికి 1,14,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి, ఆ తరువాతి సంవత్సరం ఈ 1,14,000 కోట్లకు ఇంకో 14% కలిపి ఇవ్వాలి. అలా 2022 వరకు ఇవ్వాలి.దురదృష్టవశాత్తు 2019-20 లోనే అంటే కరోనా రాక ముందే దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడింది కేంద్రానికి GST వసూళ్లు అనుకున్నంతగా రాలేదు. 2020-21, 2021-22 లో కరోనా తీవ్ర ప్రభావం వల్ల కేంద్ర, రాష్ట్రాల ఆదాయం విపరీతంగా తగ్గిపోయింది.
అయినా రాష్ట్రాలు ఒప్పందం ప్రకారం 2015-16 బేస్ కు 14% కాంపౌండ్ గ్రోత్ కలిపి కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ప్రతి రాష్ట్రం నుండి వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ఒప్పందం చేసుకున్న సమయంలో పరిస్థితులు వేరు… తర్వాత కాలంలో దేశాన్ని కుదిపేసిన పరిస్థితులు వేరు. రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకుని, ఖర్చు తగ్గించుకోవడానికి కావలసిన ఆర్థిక క్రమశిక్షణ ను పాటించకుండా ప్రజలకు కేంద్రాన్ని విలన్ గా చూపించడం చేశాయి.
పైగా పెట్రోలు ధరల్లో తమ వాటా తగ్గించుకోకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే పెట్రోలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ప్రచారం చేసుకున్నాయి. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రమైనా.. రాష్ట్రమైనా ఒకే దేశంలోని సమస్యగా కాకుండా కేంద్రం వేరు.. రాష్ట్రం వేరు అనే పంథాలో ముందుకు పోయాయి.
ఒక మీటింగ్ లో కేరళ ఆర్థిక మంత్రి GST కంపెన్సెషన్ విషయంలో సుప్రీంకోర్టుకు వెళతామని కేంద్రాన్ని బెదిరించారు. ఇప్పుడు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నది రాష్ట్రం నుండి వసూలు అయిన GST లో రాష్ట్రం వాటా కాదు, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన వాటా. 2022 తో ఈ ఒప్పందం ముగిసిపోతుంది. వచ్చే సంవత్సరం నుండి రాష్ట్రాలు ఎవ్వరిని బ్లేమ్ చేస్తాయో చూడాలి.