Huge footprints …………………
ఫొటోలో పెద్ద సైజులో కనబడే పాదముద్ర అనంతపురం జిల్లా ‘లేపాక్షి’లోని వీరభద్ర ఆలయంలో ఉంది. ఈ పాదముద్ర సీతమ్మ వారిదని .. కాదు ఆంజనేయ స్వామిదని అంటారు. ఎవరిది అయినప్పటికీ మామూలు మనుష్యుల పాదాల కంటే భారీ సైజు పాదముద్ర అని చెప్పుకోవాలి.
ఈ పాదముద్ర లోని బొటనవ్రేలు భాగంనుంచి నిరంతరం సన్నని నీటిధార వస్తుండటం విశేషం. మండువేసవిలో సైతం ఈ నీటిధార వస్తూనే ఉంటుందట. నిరంతరం కొంత తడిగా ఉంటుందట.
పై ఫోటో లోని పెద్ద పాద ముద్ర థాయిలాండ్ పురాతన రాజధాని అయుతయలో ఉంది.ఈ పాదముద్ర హనుమంతునిదని అక్కడ ప్రజలు నమ్ముతారు.ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారు. ఇలాంటి భారీ సైజు పాద ముద్రలు అన్నీ కూడా హనుమవే అనే కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
ఈ తరహా పాదముద్రలు శ్రీలంకలో, సిరియా, మరికొన్నిచోట్ల ఉన్నాయి. చాలా చోట్ల ఇలాంటి భారీ పాదముద్రలను కనుగొన్నారు.ఇవి పురాతన కాలంలో భూమిపై అత్యంత శక్తివంతమైన మనుష్యుల ఉనికిని తెలియజేస్తున్నాయని కూడా అంటారు.
మనకు పురాణాల్లో శక్తివంతమైన పాత్రలు ఎన్నో కనిపిస్తాయి.వీరిలో దేవతలు,యక్షులు, రాక్షసులు,వానరులు,గంధర్వులు వంటి వారెందరో ఉన్నారు. వీరంతా మామూలు మనుష్యులతో పోలిస్తే అత్యంత బలవంతులుగా వర్ణించ బడ్డారు.
అలాంటి వారు భూమ్మీద పుట్టారా? పెరిగారా? పురాతన గ్రంధాలలో భూమి మీద భారీ మానవులు నివసించినట్లు చెబుతారు. ఆధునిక శాస్త్రవేత్తలు ఈ కథనాలను నమ్మడం లేదు. పురాతన కాలం నాటి మానవ అవశేషాలు కొన్నిపెద్దవిగా ఉన్నట్లు కనుగొనబడ్డాయి.
కానీ అవి జెయింట్స్ అని నిర్ధారించడానికి తగినన్ని ఆధారాలు లేవని అంటారు. ఈ క్రమంలో ఈ పాదముద్రలు నిజమైనవా ?లేక కృత్రిమమైనవా ?లేక ప్రకృతి సహజంగా వాటికవే ఏర్పడ్డాయా ? అనేది మిస్టరీ.
నోట్ …ఎవరైనా రెండు పాదాలతో నడుస్తారు. కానీ ఒక పాదమే నేలను తాకినట్టు కనిపిస్తున్నది. అన్ని చోట్ల ఒక పాదముద్ర ఉండటం చిత్రమనిపించడం లేదా ?