‘Great Wall of India’ ………….
‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ‘కుంభాల్గఢ్ కోట గోడ ‘ చూసి రావాల్సిన ప్రదేశమే.’గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ తర్వాత ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ పొడవైన కోట గోడ గా ప్రఖ్యాతి గాంచింది.ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ పాలకుడు రాణా కుంభ నిర్మించారు. ఈ గోడ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది.
ఈ గోడ సుమారు 36 నుండి 38 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. దీని వెడల్పు కొన్ని చోట్ల 15 నుండి 25 అడుగుల వరకు ఉంటుంది, దీనిపై ఎనిమిది గుర్రాలు పక్కపక్కనే వెళ్ళవచ్చు.ఈ ‘కుంభాల్గఢ్ కోట’రాజస్థాన్ లోని రాజ్సమంద్ జిల్లాలో, ఉదయపూర్కు సుమారు 84 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంది.
కోటలోకి ప్రవేశించాక ఈ గోడపైకి వెళ్లే మార్గం ఉంటుంది.కుంభాల్గఢ్ కోట గోడపై పర్యాటకులు నడవవచ్చు.ఇదొక థ్రిల్లింగ్ అనుభవం.రాజస్థాన్ టూరిజం వారు సాహస ప్రియుల కోసం ప్రత్యేకంగా గోడపై నడక, ట్రెక్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
పూర్తిగా 36 కిలోమీటర్లు నడవడం కష్టం కాబట్టి, పర్యాటకులు సాధారణంగా కోట ప్రధాన ద్వారం నుండి కొంత దూరం వరకు నడిచి ఆరావళి కొండల అందాలను చూస్తుంటారు. గోడపై నుండి చూస్తే ఒకవైపు దట్టమైన అడవి (కుంభాల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యం), మరోవైపు లోతైన లోయలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల గోడ ఎత్తుగా, మెట్లు ఎక్కువగా ఉంటాయి.
ఈ కోట ఆవరణలో సుమారు 360కి పైగా జైన్,హిందూ దేవాలయాలు ఉన్నాయి.ఇది వీరయోధుడు మహారాణా ప్రతాప్ జన్మస్థలం. శత్రువులకు ఏమాత్రం చిక్కని విధంగా, అజేయంగా ఈ కోటను నిర్మించారు. దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
ప్రతిరోజూ ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఈ గ్రేట్ వాల్ ను సందర్శించవచ్చు. సాయంత్రం వేళల్లో నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షో ఇక్కడి ప్రధాన ఆకర్షణ. కుంభాల్గఢ్ కోటను సందర్శించడానికి శీతాకాలం (అక్టోబర్ నుండి మార్చి) అనుకూలమైన సమయం. ఉష్ణోగ్రతలు 10°C నుండి 25°C మధ్య ఆహ్లాదకరంగా ఉంటాయి, దీనివల్ల కోట మొత్తం నడిచి చూడటం సులభమవుతుంది.
కోట లోపల తప్పక చూడాల్సినవి బాదల్ మహల్.. దీనిని “మేఘాల ప్యాలెస్” అని పిలుస్తారు, ఇక్కడ నుండి ఆరావళి పర్వతాల అందాలు చూడవచ్చు అలాగే నీలకంఠ మహాదేవ ఆలయం: 15వ శతాబ్దానికి చెందిన భారీ శివలింగం ఉన్న పురాతన ఆలయం. మరెన్నో దేవాలయాలున్నాయి. సమయాన్ని బట్టి చూడవచ్చు.
ఆరావళి పర్వత శ్రేణులు పచ్చదనంతో నిండిపోయి, ఆ ప్రాంతమంతా చాలా అందంగా కనిపిస్తుంది. కుంభాల్గఢ్ రాజస్థాన్ లోని ప్రధాన నగరాలతో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానమై ఉంది. ఇక్కడికి అత్యంత సమీప విమానాశ్రయం ఉదయపూర్ (మహారాణా ప్రతాప్ విమానాశ్రయం), ఇది కోట నుండి సుమారు 85-100 కి.మీ దూరంలో ఉంది.
అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో కోటకు చేరుకోవచ్చు.రైలు మార్గం అయితే సమీప ప్రధాన రైల్వే స్టేషన్ ఉదయపూర్ సిటీ..కుంభాల్గఢ్కు దగ్గరగా ఉండే చిన్న స్టేషన్లు రాణి (Rani) (35 కి.మీ) ఫల్నా (Falna) (80 కి.మీ). ఉదయపూర్ నుండి కుంభాల్గఢ్కు క్యాబ్ లేదా ప్రైవేట్ వాహనంలో వెళ్లడానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. జైపూర్ (345 కి.మీ), జోధ్పూర్ (200 కి.మీ) నుండి కూడా బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
కోటకు దగ్గరగా 1–5 km పరిధిలో చాలా హోటల్స్, రిసార్ట్స్, గెస్ట్ హౌసులు ఉన్నాయి.. కుంభాల్గఢ్కి వెళ్ళినపుడు సమీపంలోని రాణక్పూర్ జైన్ దేవాలయం, కుంభాల్గఢ్ వన్యప్రాణి అభయారణ్యం,హల్దీఘాటి,పరశురామ్ మహాదేవ్ ఆలయం,హమ్మీర్పాల్ సరస్సు కూడా చూసి రండి.

