Great Parents………………………………….పై ఫొటోలో కనిపించే వారు ఒక కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. కొడుకు మంత్రి అయినప్పటికీ వ్యవసాయ కూలీలుగా వారు జీవిస్తున్నారు. అందుకు వారు సిగ్గు పడటంలేదు. పైగా గర్విస్తున్నారు. స్వశక్తి మీద బతుకుతూ అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆ కేంద్రమంత్రి ఎవరో కాదు. ఇటీవలే ప్రధాని మోడీ క్యాబినెట్లో చేరిన మురుగన్. తన తప్పు ఏమిలేకుండా మురుగన్ తన వద్దకు వచ్చి ఉండమని ఆహ్వానించినప్పటికీ ఆ ఇద్దరు సున్నితంగా తిరస్కరించి తమ పని తాము చేసుకుంటూ బతుకుతున్నారు.
మురుగన్ సొంత గ్రామం తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరమత్తి కి దగ్గర్లో ఉన్న కోనూరు. తండ్రి లోకనాథన్ (65) తల్లి వరదమ్మాళ్ (60) మురుగన్ చిన్నప్పటినుంచే కూలీలుగా పని చేస్తున్నారు. కష్ట పడి కొడుకును బాగా చదివించారు. మురుగన్ కు రామస్వామి అనే సోదరుడు కూడా ఉన్నారు. మురుగన్ ఇటీవల మత్స్య, పాడి .. పశుసంవర్ధక,సమాచార ప్రసార శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
మురుగన్ న్యాయ విద్యను అభ్యసించారు. తర్వాత ఎంఎల్, పిహెచ్ డి కూడా చేశారు. అఖిల భారతీయ విద్యా పరిషత్,రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో మురుగన్ సభ్యులు. క్రియాశీలక కార్యకర్త. ఆస్థాయి నుంచి తమిళనాడు బీజీపీ శాఖకు అధ్యక్షుడయ్యారు. పార్టీ కి మురుగన్ చేసిన సేవలను , విద్యార్హతలు గమనించిన ప్రధాని మోడీ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఇక మురుగన్ తల్లిదండ్రులు మొదటినుంచి స్వతంత్ర జీవనానికి అలవాటు పడ్డారు. పని పట్ల వారికి అపార గౌరవం. తమ బిడ్డ మంత్రి అవడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ఆ దంపతులు .. చివరి రోజుల వరకు కష్టపడి పని చేస్తూనే ఉంటామని చెబుతున్నారు. తమ కుమారుడు స్యయం కృషితో ఎదిగాడని .. అతను ఈస్థాయికి చేరుకోవడానికి తాము పెద్దగా చేసింది ఏమీ లేదని అంటున్నారు. ఇలాంటి తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు కదా. అలా ఉండటం ఎంతో గొప్ప విషయం.