ప్రముఖ గాయని సునీత వివాహం ఖరారు అయింది. డిజిటల్ మీడియా వ్యాపారంలో ఉన్న వీరపనేని రామ్ తో ఇవాళ నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల 27న వీరిరువురు పెళ్ళి చేసుకోబోతున్నారు. గత కొద్దీ రోజులుగా సునీత రెండో పెళ్లి గురించి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సునీత 19 సంవత్సరాల వయసులో కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం సరిగ్గా ముందుకు సాగలేదు. ఆ విషయం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సునీతే స్వయంగా చెప్పారు. భర్తతో అభిప్రాయ బేధాలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు విడిపోయారు. కాని పిల్లలు మాత్రం సునీత వద్దే ఉంటున్నారు. సునీతకు ఒక కూతురు, కొడుకు. వారి పేర్లు ఆకాష్, శ్రేయ. ఇద్దరు చదువుకుంటున్నారు.
భర్త నుండి విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోమని సునీతకు కుటుంబసభ్యులు, స్నేహితులు సలహాలు ఇచ్చారు. అయితే పిల్లల భవిష్యత్ కోసం ఇప్పటి వరకు ఆమె వివాహం చేసుకోలేదు. మొత్తం మీద కుటుంబ సభ్యుల సలహా మీద ఇన్నాళ్లకు ఆమె తన వివాహం పై దృష్టి పెట్టారు. ఇక రామ్ వీరపనేని కి కూడా ఇది రెండో సంబంధం అని సమాచారం. గత నెలలోనే సునీత నాయనమ్మ చనిపోయారు. సునీత ఇన్నాళ్లూ పిల్లలే ప్రాణంగా బతికారు. వాళ్లు పెద్దవాళ్లవడంతో సునీత మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయమేనని ఆమె సన్నిహితులు , స్నేహితులు అభిప్రాయపడుతున్నారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత మంచి పేరు సంపాదించుకున్నారు.