Shiva lingas unearthed during archaeological excavations…….
వియత్నాంలో ఆరేడు ప్రదేశాల్లో ఆమధ్య కాలంలో పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహించింది. పునరుద్ధణ పనులు కూడా కొన్నిచోట్ల చేపట్టింది. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే 9 వ శతాబ్దపు నాటి పురాతన శివలింగం ఒకటి బయట పడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్లో ఆర్కియాలజికల్ సర్వే సంస్థ అధికారులు ఈ శివలింగాన్ని కనుగొన్నారు.
వియత్నాం లోని క్వాంగ్ నామ్ పరిధిలో ఉన్న మై సన్ సిటీలో చామ్ టెంపుల్ కాంప్లెక్స్ ఉంది. దీన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. అప్పటి చంపా సామ్రాజ్య రాజు ఇంద్రవర్మ ఈ దేవాలయాన్ని నిర్మించారు.ఆయన బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేశారు. బౌద్ధంతో పాటు హిందూ మతం కూడా అప్పట్లో వియత్నాంలో ఉన్నట్లు ఈ శివలింగం ద్వారా తెలుస్తోందని సర్వే అధికారులు చెబుతున్నారు.
ఈ దేవస్థానం పరిధిలో ఇంతకుముందు కూడా ఆరు శివ లింగాలను గుర్తించారు. అయితే వాటన్నింటి కంటే 9 వ శతాబ్దపు నాటి శివలింగం అద్భుతమైందని అధికారులు అంటున్నారు. ఇది 1100 సంవత్సరాల నాటి పురాతన శివలింగం.2020 నాటి పనుల్లో ఈ శివ లింగాన్ని వెలికి తీశారు.
4 వ శతాబ్దం నుంచి 13 వ శతాబ్దం మధ్యకాలంలో హిందూ ఆధ్యాత్మిక మూలాలు కలిగిన చంపా రాజ్యంలో ఈ ఆలయాలు నిర్మితమైనాయి. వాటిలో భద్రేశ్వరుడి ఆలయం ముఖ్యమైనది. 1903-1904లో ఫ్రెంచ్ నిపుణులు ఆలయ సముదాయాన్ని శిథిలావస్థలో కనుగొన్నారు. ఆ సమయంలో జరిగిన తవ్వకాలలో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్తలు దేవాలయ స్థలంలో ఒక శివలింగం ఉన్నట్లు వివరించారు.
అయితే అపుడు తవ్వకాలు పూర్తిగా జరగలేదు. తర్వాత వియత్నాం పై జరిగిన దాడులు .. యుద్ధాలు ఆలయ సముదాయాన్ని నాశనం చేశాయి.కాగా తొమ్మిదో శతాబ్దికి చెందిన రాజు ఇంద్రవర్మ ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇంద్రవర్మ చక్రవర్తిగా సింహాసనం అధిష్టించక మునుపు ఆయన పేరు శ్రీ లక్ష్మీంద్ర భూమీశ్వర గ్రామ స్వామి అని అక్కడ బయట పడిన శాసనాలలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
ఇంద్రవర్మ రాజధాని నగరం ఇంద్రపురం. ఇక్కడ లభించిన బుద్ధుడి కాంస్య విగ్రహం అమరావతి శైలిలో ఉందని అంటారు. చంపా తొలి శిల్పం అంటే క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దికి ముందున్నదంతా అమరావతి శైలిలో ఉందని అక్కడి చరిత్రకారులు అంటున్నారు.
2021 నాటి పనుల్లో మరో సైట్ లో ఇంకొక భారీ శివలింగం బయటపడింది. గత ఏడాది హోహి మిన్ నగరానికి 150 కి.మీ దూరంలో ఉన్న కాట్ టియన్ వద్ద జరిగిన తవ్వకాల్లో 2.27 మీటర్ల శివలింగం బయటపడింది.
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మై సన్ ఆలయ సముదాయ పరిరక్షణ…. పునరుద్ధరణ పనుల్లో ఇండియా కూడా పాలు పంచుకుంది . 2014లో సంతకం చేసిన ఒక అవగాహన ఒప్పందం ప్రకారం , భారత పురావస్తు సర్వే (ASI) A, H, K దేవాలయాలపై పని చేసి, ఏప్రిల్ 2023లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది.
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశం ఆలయ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంది.ఈ ప్రాజెక్టులో భాగంగా వియత్నాం పురావస్తు శాఖా పరిరక్షణ నిపుణులకు ఆధునిక పరిరక్షణ పద్ధతుల గురించి భారత్ అధికారులు శిక్షణ కూడా ఇచ్చారు.