గంటల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని కూల్చేసిన ఖ్యాతి ఆయనదేనా ?

Sharing is Caring...

 A military dictator ……………

పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. పాక్ ప్రభుత్వాన్ని గంటల వ్యవధిలోనే కూల్చేసిన ఖ్యాతి ఆయనది. అది 1999 వ సంవత్సరం … అక్టోబర్‌ 12 వతేదీ ……  సమయం సాయంత్రం 6:45.నిమిషాలు..  ఎయిర్‌బస్‌ విమానం  .. మొత్తం 198 మంది ప్రయాణికులతో పాక్‌కు వస్తోంది.

అందులో పిల్లలు,వృద్ధులు కూడా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవ్వాలి. కానీ ల్యాండ్‌ చేయడానికి పైలట్‌కు అనుమతులు మాత్రం రాలేదు. కారణం అందులో నాటి పాకిస్థాన్  ఆర్మీ చీఫ్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ఉండడమే.పైగా విమానాన్ని ల్యాండ్‌ కానివ్వొద్దని ఆదేశాలిచ్చింది స్వయంగా నాటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కావడం విశేషం. అంతా సినిమా కథలా ఉంది కదా .. అవును సినిమాకు పనికొచ్చే కథే.

కట్‌ చేస్తే రాత్రి 8:45కల్లా పాకిస్థాన్  ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని  షరీఫ్‌ను గృహ నిర్బంధం చేశారు. ఆర్మీ సహకారంతో ల్యాండ్‌ అయిన ముషారఫ్‌ దేశ పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. అలా  ముషారఫ్‌ ఎక్కిన విమానం గాల్లో చక్కర్లు కొడుతుండగానే.. సైన్యానికి ఆదేశాలిచ్చి ప్రభుత్వాన్ని కూల్చేశారు.

అప్పట్లో జరిగిన  మిలిటరీ కుట్ర అంత నాటకీయంగా, అత్యంత రహస్యంగా జరిగింది. రాత్రికి రాత్రే ప్రభత్వం కూలిపోవడం ముషారఫ్‌ పాలనా పగ్గాలు చేపట్టడం జరిగి పోయాయి. ఈ కుట్రకు ముందే వ్యూహరచన జరిగింది.తెర వెనుక ఎవరు ఉంది చెప్పనక్కర్లేదు. 

కాగా అంతకు ముందు … 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్‌ భారత్‌పై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్‌ను దెబ్బకొట్టాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలో ఆయన కన్నుకార్గిల్‌ పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్‌ 7వ తేదీన ముషారఫ్‌కు నాటి ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సైనిక పగ్గాలు అందించారు.

బాధ్యతలు స్వీకరించిన ముషారఫ్‌  కొన్ని గంటల్లోనే కార్గిల్‌పై దాడికి ప్రణాళికలను అమలు  చేశారు.. కానీ, వారి కుట్రల్ని భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ యుద్ధం పాక్‌కు అంతర్జాతీయంగా అవమానాన్ని మిగిల్చింది.కార్గిల్‌ యుద్ధం షరీఫ్‌, ముషారఫ్‌ మధ్య విభేదాలకు దారితీసింది. 

ఈ క్రమంలో ముషారఫ్‌ సైన్యంలో కీలక స్థానంలో ఉన్న లెఫ్టినెంట్‌ జనరల్‌ తారీఖ్‌ పర్వేజ్‌కు బలవంతంగా రిటైర్మెంట్‌ ఇప్పించారు. తారీఖ్‌ ప్రధాని షరీఫ్‌కు సమీప బంధువు. సైన్యంలోని అంతర్గత విషయాలు తెలిసిన వ్యక్తి. ముషారఫ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. సైన్యం తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ప్రధానిని  తారీఖ్‌ హెచ్చరించారు.

దీంతో గత్యంతరం లేక జాయింట్‌ చీఫ్ ఆఫ్‌ స్టాఫ్‌గా  ముషారఫ్‌ను నియమిస్తూ షరీఫ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నియామకం  అప్పటి నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ బొఖారీకి ఏమాత్రమూ నచ్చలేదు. కార్గిల్‌  యుద్ధం విషయంలోనూ ఆయన ముషారఫ్‌తో విభేదించారు. త్రివిధ దళాలను సంప్రదించకుండానే ముషారఫ్‌ ఈ విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని బహిరంగంగా ఆరోపించారు.

ఈ క్రమంలో ముషారఫ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై షరీఫ్‌తో బొఖారీ మాటలయుద్ధానికి దిగారు.దీంతో ప్రభుత్వం, మిలిటరీకి మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇది ఎక్కడ సైనిక తిరుగుబాటుకు దారితీస్తుందోనని భావించిన షరీఫ్‌.. ముషారఫ్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నారు. సమయం కోసం వేచి చూశారు.

మరోవైపు ముషారఫ్‌ కూడా అన్ని విషయాలను ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ముందు జాగ్రత్తగా తన అనుచరులకు అప్రమత్తం చేశారు. అక్టోబరు 1999లో ముషారఫ్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లారు. దీన్ని అవకాశంగా భావించిన షరీఫ్‌.. ఆయన్ని తొలగించి జియాఉద్దీన్‌ బట్‌ను ఆ స్థానంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముషారఫ్‌ అసలు పాకిస్థాన్‌కు రాకుండా అడ్డుకోవాలని షరీఫ్‌ భావించారు. 

అక్టోబరు 12 సాయంత్రం 5 గంటలకు టీవీల్లో చూసి విషయం తెలుసుకున్న ఆర్మీలోని ముషారఫ్‌ అనుచరులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కరాచీలోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచే ముషారఫ్‌ను కాంటాక్ట్‌ చేశారు. అప్పటికే విమానం ల్యాండింగ్‌కు అనుమతి దొరక్క సతమతమవుతున్న ముషారఫ్‌ తదుపరి ప్లాన్ ను సిద్ధంచేశారు.

ఆయన ఆదేశాలను అనుచరులు అమలు చేస్తూ వెళ్లారు. ప్రధాని నివాసం సహా ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అంతా ఓక వ్యూహం ప్రకారం జరిగింది. ఈ తతంగం 1999 అక్టోబరు 12 రాత్రి 7:45 గంటల కల్లా పూర్తయిపోయింది. 7:48 గంటలకు ముషారఫ్‌ సురక్షితంగా కరాచీలో ల్యాండ్‌ అయ్యారు. 

ఆ తర్వాత  సమీప సైనిక కార్యాలయానికి వెళ్లారు.సైన్యంలోని తన మద్దతుదారులతో సుదీర్ఘ మంతనాలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేసి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.అర్ధరాత్రి 2:30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు.

నాటి నుంచి ఈ సైనిక నియంత పాక్‌ను దాదాపు పదేళ్లు పాలించాడు.  ముషారఫ్ భార్య పేరు సెహబా. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.కుమార్తె  పేరు ఐలా.  ఆర్కిటెక్ట్. కొడుకు పేరు బిలాల్. చార్టెడ్ అకౌంటంట్ గా చేస్తున్నారు.  ముషారఫ్‌ 2023 సం. ఫిబ్రవరి 5న దుబాయి లో మరణించారు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!